CONNECTICUT (USA)
తేది: 29-09-2011
"చెరో రాజధాని యోచన మరింత కీడే"
చెరో రాజధాని యోచన తెలంగాణా యెడ మరో కుతంత్రం. పచ్చి రాజకీయ స్వార్ధంతో చేసే సీమాంధ్రుల ఆధిపత్యంలోని కాంగ్రెస్ నేతలకుట్ర. గత అయిదున్నర దశాబ్దాల తెలంగాణా పోరాటం తలలేని మొండెం కొరకు కాదు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని తెలంగాణాకు గుండెకాయ లాంటిది. హైదరాబాద్ ను చిన్నా-భిన్నం చేయడం వల్ల ఉగ్రవాదుల నిలయంగామారి దేశభద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం రాక తప్పదు. ఇప్పటికే బొంబాయిలో ప్రేల్చే బాంబులకు ఉగ్రవాదులఅడ్డగా హైదరాబాద్ మారిందని వింటున్నాము. గత 55 ఏండ్ల క్రితం ఇరుప్రాంత పెద్దమనుష్యులు కుదుర్చుకొన్నఒప్పందాలను సీమాంధ్ర పాలకులు ఉల్లంఘించినందువల్లనే తెలంగాణా రాష్ట్ర డిమాండు వచ్చిందనేది జగమెరిగిన సత్యం. తెలంగాణా ప్రజలది, పూర్వ హైదరాబాద్ రాష్ట్రాన్ని పునరుద్ధరించాలనే పోరాటమే గానీ హైదరాబాద్ లేని తెలంగాణా రాష్ట్రం కొరకు ఎన్నడూ ఆరాట పడలేదు. ఇరు ప్రాంతాలకు క్రొత్త రాజధానులు ఏర్పాటైనాక హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం అనేకంటే మరో కాశ్మీర్ గానో, మినీ పాకిస్తాన్ గానో ఏమార్చడమే అవుతుంది, ఇప్పటి భాగ్యనగరం స్థితి… నీటి కొరత, కరెంటు కష్టాలు, కాలుష్య ప్రమాదం సమస్యలతో ఛిన్నా-భిన్నమై అభివృద్ధి కుంటుపడి, దౌర్భాగ్యనగరంగా పరిణమించే ప్రమాదముంది. తెలంగాణావారితో సఖ్యత చెడగొట్టుకున్నసీమాంధ్రులు తెలంగాణా జిల్లాల పొలిమేరలు దాటి ఉమ్మడి రాజధాని హైదరాబాదుకు చేరుకోగలరా? రగిలిన మంటలకు మరింత ఆజ్యం పోయొద్దని, గులాంగిరీ నుండి విముక్తి ప్రసాదించాలని, పిచ్చి తుగ్లక్ వేషాలు వద్దని ఆజాద్ ను కోరుకుంటున్నాం. సోనియమ్మ ఇప్పటికైనా నోరువిప్పి చేసిన బాసను నెరవేర్చాలని, కాంగ్రెస్ ను కాపాడుకోవాలని ముక్కోటి తెలంగాణా ప్రజానీకం ముక్తకంఠంతోఘోషిస్తోంది.
ఇట్లు,
కటంగూరు సత్యనారాయణ రెడ్డి,
టి.ఆర్.టి.యు.వ్యవస్థాపక అధ్యక్షులు,
ఫోన్.నం. 001(860) 656 6666 (USA)