మేమొక జనాజా (శవం) వెంట ‘బఖీ’ శ్మశానవాటికకు వెళ్ళాము.అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా వచ్చి ఓ చోట కూర్చున్నారు. మేము ఆయన చుట్టూ కూర్చున్నాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతిలో ఒక బెత్తం ఉంది. ఆయన తల వంచుకొని బెత్తంతో నేలను గీకసాగారు. కాస్సేపటికి “మీలో ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేక నరకంలో వ్రాయబడి ఉంది. అతను సౌభాగ్యుడా లేక దౌర్భాగ్యుడా అనే విషయం ముందుగానే వ్రాయబడింది.” అని అన్నారు ఆయన. ఒకతను ఈ మాట విని “దైవప్రవక్తా! అయితే మనం విధివ్రాతని భావించి కర్మలు ఆచరించకుండా ఎందుకు కూర్చోకూడదు. మనలో ఎవరైనా సౌభాగ్యుడై ఉంటే అతను ఎలాగూ సత్కర్మలు ఆచరిస్తాడు, దౌర్భాగ్యుడైతే ఎలాగూ దుష్కర్మలు ఆచరిస్తాడు కదా!” అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “కాని వాస్తవం ఏమిటంటే అదృష్టవంతుడికి సత్కార్యాలు చేసే సద్బుద్ధి కలుగుతుంది, దౌర్భాగ్యుడికి దుష్కార్యాలు చేసే దుర్భుద్ది పుడ్తుంది.” అని అన్నారు. ఆ తరువాత ఆయన (దివ్య ఖుర్ఆన్ లోని) ఈ సూక్తులు పఠించారు : “ధనాన్ని దానం చేసి దైవ అవిధేయతకు దూరంగా ఉంటూ, మంచిని (సత్యాన్ని) సమర్ధించే వాడికి మేము సన్మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలుగజేస్తాము. (దీనికి భిన్నంగా) పిసినారితనం వహించి (దైవంపట్ల) నిర్లక్ష్య భావం ప్రదర్శిస్తూ, మంచిని (సత్యాన్ని) ధిక్కరించే వాడికి మేము కఠిన మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలగజేస్తాము.” (92 : 5-10)