వెలుగు చాటిన తెలుగు
మద్రాసు హైకోర్టులో సోమవారం వెలువడిన
తీర్పుతో-ప్రాచీన విశిష్ట భాషలు (క్లాసికల్ లాంగ్వేజెస్)గా కేంద్ర
ప్రభుత్వం పలువిడతలుగా గుర్తింపు ఇచ్చిన తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడం,
మలయాళం, ఒడిసా భాషలన్నింటి పరువు నిలబడింది. పరువు అని ఎందుకు
అంటున్నానంటే-ప్రజాభాషలన్నిటినీ విశిష్టమైనవిగా, సమానమైనవిగా గుర్తించాలనే
శాస్ర్తియ సూత్రాన్ని విస్మరించి, రాజకీయ వత్తిడులకు తలొగ్గి 2004,
అక్టోబర్ 12న భారత సర్కారులోని గృహమంత్రాలయం వారిచ్చిన ప్రకటన భాషా
రాజకీయాల తుట్టెను కదపడంతోనే ఈ గొడవ మొదలైంది. ద్రావిడ మూలాల నుంచి
కాలక్రమంలో విడివడి స్వతంత్ర భాషలుగా నిలదొక్కుకున్న వాటిలో మొదటిదైన
తెలుగు భాషీయులకు, సోదర భాష అయిన కన్నడ ప్రజలకూ అవమాన భారాన్ని కలిగించిన ఆ
ప్రకటన తర్వాత వారి మొరలను ఆలకించకుండానే 2005 నవంబరు 25న మరొక
నోటిఫికేషన్ ద్వారా సంస్కృతాన్ని కూడ క్లాసికల్ లాంగ్వేజ్గా ప్రభుత్వం
ప్రకటించింది. పుండుమీద కారం అద్దినట్లు భావించిన తెలుగు, కన్నడ
ఉద్యమకారులు పెద్ద యెత్తున ఉద్యమాన్ని సాగించారు.
తెలుగుకు
సంబంధించినంతవరకు తెలుగు భాషోద్యమ సభ్యులు 2006, ఫిబ్రవరి 21న హైదరాబాదులో
చేసిన నిరాహార దీక్షా కార్యక్రమంలో ఉద్యమం ఒక మలుపు తిరిగింది. ఆ మర్నాడు
శాసనసభలో నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తెలుగుకు క్లాసికల్ భాషా
ప్రతిపత్తి కోరుతూ ప్రయివేటు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చివరకు
ప్రభుత్వం అధికార తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో ఏకగ్రీవంగా సభ కేంద్ర
ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేసింది. అక్కడినుంచి మరి రెండున్నరేళ్ల
ఉద్యమం అనేక రకాలుగా ప్రభుత్వంపై వత్తిళ్లను పెంచింది. చివరకు 2008,
అక్టోబర్ 31న కేంద్రం నుండి తెలుగుకూ, కన్నడానికి కూడా క్లాసికల్
ప్రతిపత్తినిస్తూ ప్రకటన వెలువడింది,.
ఈ ప్రకటనలు రావడంతోనే కడుపు
మండిన తమిళ సోదరులు కొందరు గాంధీ అనే ఒక న్యాయవాది చేత మద్రాసు హైకోర్టులో
దావా వేశారు. తెలుగుకూ, కన్నడానికి ఈ హోదా ఇవ్వడానికి అర్హత లేదని వాళ్ల
వాదన. ఆ వ్యాజ్యం సుమారు 8 ఏళ్లు గడిచి, ఇప్పటికి తీర్పు వెలువడింది.
తీర్పు సారాంశమేమంటే తమిళానికి క్లాసికల్ హోదా ఇచ్చిన కమిటీయే తక్కిన
భాషలకూ ఇచ్చిందనీ, కనుక ఇందులో తాము చెప్పేదేమీ లేదు గనుక, మీ గొడవంతా ఆ
కమిటీతోనే తేల్చుకోమని దావాను కోర్టు కొట్టేసింది. ఈ ఎనిమిదేళ్ల వ్యవధిలో
చాలా కథ నడిచిపోయింది. మాకూ హోదా ఇవ్వాల్సిందేనని ముందు మలయాళం వారు తర్వాత
ఒడిసావారు ప్రభుత్వాన్ని నిలదీశారు. వారికీ ఆహోదాను ఇచ్చేసింది ప్రభుత్వం.
అసలు ఈ క్లాసికల్ భాషా రాజకీయం ఎం దుకు, ఎక్కడ, ఎలా మొదలైందో నాలుగు మాటలు
ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం తప్పుకాదు. 2004లో లోక్సభకు జరిగిన
ఎన్నికల్లో డిఎంకె పార్టీ తమిళానికి ఈ ప్రాచీన విశిష్ట హోదాను
సంపాదిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. తమిళభాష పట్ల దాని
ప్రాచీనత పట్ల, విశిష్టత పట్ల వారికి ఉన్న పట్టుదల ఆదరణ తెలిసిందే.
రాయిపుట్టి, మన్నుపుట్టకముందే పుట్టిన శ్రేష్టమైన తొలి భాష తమిళం అని
ద్రావిడ భాషావాదులు ప్రచారంలో పెట్టిన నమ్మకాన్ని సాక్షాత్తు ఒక జి.ఒ.లో
తమిళనాడు ప్రభుత్వం ఉటంకించిందంటే చాలామంది ఆశ్చర్యచకితులు కావచ్చు.
2006లో తమిళాన్ని నిర్బంధ బోధనాంశం చేస్తూ తమిళనాడు వెలువరించిన జి.ఒ. ఈ
ఉటంకింపుతోనే మొదలవుతుంది. అందువల్లనే 2004లో కేంద్రంలో ఏర్పడిన యుపిఎ
ప్రభుత్వంలో భాగంగా చేరిన డిఎంకె, యుపిఎ నుంచి రాబట్టిన కనీస కార్యక్రమంలో
కూడా తమిళ క్లాసికల్ ప్రతిపత్తినిస్తామనే హామీని రాబట్టిందనే వాస్తవాన్ని
ఎవరూ పట్టించుకోలేదు. కాని అది రాజకీయంగా ద్రవిడ పార్టీల మధ్య పోటీలో ఇది
ఒక ముఖ్యాంశం. దానికనుగుణంగానే డిఎంకె మంత్రులు ప్రత్యేకించి ప్రభుత్వం చేత
క్లాసికల్ లాంగ్వేజెస్ అనే ఒక వర్గీకరణను ఏర్పాటు చేస్తూ నిర్ణయం
తీసుకొని, ముందుగా తమిళానికిచ్చి, ఆ తరువాత సంస్కృతానికున్న ప్రతిష్టను
కాపాడుకోవడానికి దానికీ ప్రతిపత్తినిచ్చారు. ద్రావిడ వాదులు దాన్ని కూడా
అంగీకరించలేరు కాని, వ్యూహాత్మకంగా మిన్నకుండి, ఆ తర్వాత తెలుగుకు,
కన్నడానికి, క్లాసికల్ హోదానివ్వగానే రెచ్చిపోయి హైకోర్టులో వ్యాజ్యానికి
దిగారు. సరే. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ (సమైక్య) ప్రభుత్వం తరపున ఎబికె
ప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు మద్రాసు హైకోర్టులో
తెలుగు తరపున సమాధానాన్ని సమర్పించారు. ఆ తర్వాత కొన్ని వాయిదాల కాలక్షేపం
అయ్యేనాటికి రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు జరిగిపోయింది. ఉభయ రాష్ట్రాల
తరపున సంయుక్తంగా ఒక న్యాయవాది వాదించారు. మద్రాసుకు చెందిన తెలుగు
ఉపాధ్యాయుడు తూమాటి సంజీవరావు కూడా ఈ వ్యాజ్యంలో తెలుగు తరపున జోక్యం
చేసుకొని ఏకవ్యక్తి సైన్యంగా పనిచేశారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో
చివరిదశలో తగినంతగా శ్రద్ధ వహించలేదనేది నిజం. కొంతలోకొంత ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం కంటె తెలంగాణ ప్రభుత్వమే క్రియాశీలకంగా వ్యవహరించిందని
చెప్పుకుంటే అది అబద్ధం కాదు. మొత్తం మీద ఇప్పుడు ఏదో సామెత
చెప్పినట్టు-గండం గడిచింది పిండం బయటపడింది! ఇందుకు మన రెండు ప్రభుత్వాల్లో
ఎవరూ ఏదోకష్టపడిపోయినట్లు, విజయం సాధించనట్లు ఆనంద పడిపోనక్కరలేదు.
దివంగత భద్రిరాజు కృష్ణమూర్తి గారు ఈ క్లాసికల్ స్టేటస్ను నిర్ణయించే
కమిటీలో కీలక వ్యక్తుల్లో ప్రముఖుడు. ప్రభుత్వం చెప్పినట్టు ఆ కమిటీ ముందు
తమిళానికి ఇచ్చేసింది, ఆ తర్వాత సంస్కృతానికి న్యాయం చేసింది అంటూనే తక్కిన
భాషలకూ తలుపులు తెరచిపెట్టేట్లు, అనుకూలతలను లభించేట్లు గానే అర్హత
నిబంధనలను రూపొందించినట్లు ఆయన నాతో ఒకసారి అన్నారు. విజయవాడలో జరిగిన సభలో
కూడా ఆయన నర్మగర్భంగా ఈ విషయాన్ని చెప్పారు. ఈ కేసు వీగిపోనుందని, కమిటీదే
తుది నిర్ణయమని, కోర్టు దాన్నే చెప్తుందని ఆయన కనుమరుగవ్వడానికి కొన్నాళ్ల
ముందు నాతో అన్నారు. ఇప్పుడదే జరిగింది. అందువల్ల ఈ మొత్తం కథలో
గర్వించాల్సింది-ప్రభుత్వాలు కాదు, పేర్లు చెప్పుకోవలసి వస్తే- ముందుగా
తెలుగు భాషోద్యమ సమాఖ్యతోపాటు, 2003 నుంచే ఈ అంశాన్ని బయటకు తెచ్చి
చివరిదాకా తానే ఒక ఉద్యమంగా పనిచేసిన ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రికనూ,
అన్ని పత్రికా ప్రసార మాధ్యమాలనూ, కృష్ణాజిల్లా రచయితల సంఘంతో పాటు తక్కిన
రచయితల సంఘాలను, రాష్ట్ర ప్రభుత్వం తరపున పనిగట్టుకొని కృషి చేసిన మండలి
బుద్ధప్రసాద్, ఎబికె ప్రసాద్లను చెప్పుకోవాలి. పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయం వారూ, ఇంకా అనేకమంది పండితులు,
తెలుగుతల్లి ముద్దుబిడ్డలు చేసిన కృషి దీనివెనుక ఉంది. కోర్టు వ్యాజ్యంలో
ఒక్కడే వెంటాడుతూ, మన ప్రభుత్వాల ప్రతినిధులకు కూడా సలహాదారుడై పోరాడిన
తూమాటి సంజీవరావును అభినందించాలి.
కమిటీ నిర్ణయాల్నే ఖాయం చేసేశారు
కనుక ఇక-ఈ నేను న్యాయరంగంలో ముందుకు జరిగేదేమీ లేదు. తమిళ ప్రత్యేక జాతీయత
అనే తీవ్రవాదానికి ఒక మెట్టుగా భాషకు, అంతర్జాతీయతను సాధించుకోవాలనే తమిళుల
పట్టుదలకు ఈ తీర్పువల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. వారి పనిని వారు
చేసుకుపోతూనే ఉన్నారు. వారు తమిళాన్ని ప్రాచీన విశిష్ట భాషగానే కాదు, ఒక
అధునాతనమైన భాషగా కూడా రూపొందించుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లభాష ఆధిపత్యవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొంటూ దానితో
సహజీవనం చేయగలుగుతున్నారు. అక్కడ తమిళం గర్వంగా తలెత్తుకొని నిలబడుతూనే,
అన్ని రంగాల్లో తన బావుటాను నిలబెట్టుకొంటూనే, ఆంగ్లానికి అవసరమైనంత చోటు
ఇస్తున్నది. ఆవిధంగా అక్కడ రెండు భాషల సూత్రం స్థిరపడిపోయింది.
2008
అక్టోబరు 31న తెలుగు కన్నడాలకు కూడా క్లాసికల్ ప్రతిపత్తినిచ్చిన తర్వాత
మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థ (సిఐఐఎల్)లో తెలుగుకు, కన్నడానికి
విడివడిగా పరిశోధనా సంస్థలను స్థాపించి, పనిని కొనసాగించడానికి
ఉత్తర్వులుచ్చేశాయి. ఇందుకు కావలసిన నిధుల విడుదల కూడా జరిగిపోయింది.
‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తెలుగు’ పేర 2010నుంచీ ఒక వ్యవస్థను
రూపొందించే పనీ మొదలైంది. నిజానికి అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి
పురందేశ్వరి మైసూరులో ఒకే రోజున తెలుగు, కన్నడ భాషల పరిశోధనా సంస్థలనూ
ప్రారంభించాలని సమయ నిర్ణయం జరిపోయింది. ఇంతలో- తెలుగువాళ్లకు చెందిన సంస్థ
మైసూరులో ఎందుకుండాలి? అది తెలుగనేలపైనే ఉండాలనే డిమాండును యార్లగడ్డ
లక్ష్మీప్రసాద్ ముందుకు తెచ్చారు. ఆయనను పలువురు సమర్ధించారు కూడ. దానితో
మైసూరులో తెలుగు పరిశోధనా సంస్థ వాయిదా పడింది. కన్నడ కార్యక్రమం మొదలై
నిరాటంకంగా సాగిపోతున్నాయి. తెలుగుకోసం వచ్చే నిధులు ఎటుపోతున్నాయి?
మురిగిపోతాయి కదా- అయితే తెలుగుకు ఏమీ చెయ్యలేదనకుండా మైసూరులోని సిఐఐఎల్
వారు ఏదో మొక్కుబడిగా సమావేశాలు ప్రచురణలూ చేస్తున్నారట. అసలు ఈ
పరిస్థితికి కారణం ఎవరు? మైసూరులోనే తెలుగు పరిశోధనా సంస్థను కూడా
ప్రారంభించితే బాగుండేది కదా. ఇదంతా మనకు మనమే చేసుకున్నామని కొందరు
బాధపడుతున్నారు.
తెలుగుకు క్లాసికల్ హోదా ఇచ్చినా, పనులు కాకపోవడానికి
హైకోర్టులో ఉన్న వ్యాజ్యం కారణం అనే ప్రచారం కొందరి బుర్రలకెక్కేసింది.
అయితే నిజం ఏమిటంటే ఆ కోర్టుతీర్పునకు లోబడే ఈ హోదానిస్తున్నామని కేంద్రం
ఎన్నడో కోర్టుకు స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక సహాయాన్ని అడ్డుకొనే
ఆదేశాలను, కోర్టు ఇవ్వలేదు. కనుక-పరిమితమైన ప్రణాళికతో, నిధులతో కొంత పని
గత అయిదేళ్లలో జరిగి వుండేది. మనకు మనం మైసూరులో పరిశోధనా సంస్థ ఏర్పాటును
అడ్డుకోకుండా ఉంటే..కాదు కాదు, ఆ సంస్థను నాటి ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనో
మరో చోటనో ఏర్పాటు చేసుకొని ఉంటే, ఇప్పటికే ఎంతో పని జరిగి ఉండేది.
అయితే ఇదంతా నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం వారి పట్టనితనం వల్ల, చేతగాని
తనం వల్ల జరిగిపోయింది. ఆ సంస్థకోసం కేవలం ఒక పెద్ద భవనం, మరికొన్ని ఎకరాల
స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అంతకుమించి ఒక్కపైసా అయినా రాష్ట్ర
ప్రభుత్వం ఇవ్వవలసిన అవసరం లేదు. నియామకాలు, నిర్వహణ అంతా మైసూరులోని
సిఐఐఎల్ వారిదే. ఇందులో ఎవ్వరికీ జోక్యంచేసుకునే వీలు లేదు.ముగ్గురు
ముఖ్యమంత్రులు మారారు. రాష్ట్రం రెండు రాష్ట్రాలైంది. కొంత స్థలాన్ని, ఒక
భవనాన్ని ఇందుకోసం ఇవ్వడం చేతగాని ప్రభుత్వాలు మనల్ని పరిపాలిస్తున్నాయి.
దీనికి ఎవరిది బాధ్యత?
- డా॥ సామల రమేష్బాబు
తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు
98480 16136
భాషా రాజకీయాలకు గొడ్డలిపెట్టు మద్రాసు హైకోర్టు తీర్పు
ఈ ఆగస్టు
8 సోమవారం నాడు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో అర్థవంతంగా,
శాస్త్రీయ దృక్పథంతో ఉంది. ఆ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ సంజరుకిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్.మహదేవన్లతో కూడిన
మొదటిబెంచి ఇచ్చిన ఈ తీర్పు అనేక విధాలుగా చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంది.
వాయిదాల దోబూచులాటల్లో ఏడేళ్లు గడిచిపోగా గత ఏడాదిగా ఈ కేసుపై ప్రత్యేక
శ్రద్ధ వహించిన ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా
వెళ్లేముందు దీనిపై న్యాయాన్ని ప్రకటించడం పట్ల శ్రద్ధ వహించడం మనం
గమనించాల్సిన సంగతి.
ఆయన వెలువరించిన తీర్పులో ప్రసిద్ధ అమెరికన్
గ్రంథకర్త ఆలివర్ వెండెల్ హొమ్స్ ను ఉటంకిస్తూ 'ప్రతి భాషా ఒక
దేవాలయమేనని, అందులో ఆ భాషను మాట్లాడేవారి ఆత్మ విలసిల్లుతుంటుందని'
స్పష్టం చేశారు. ప్రజాభాషలన్నిటినీ గౌరవిస్తూ ఆయన ఇచ్చిన తీర్పును
ప్రభుత్వాలు, పార్టీలు, ప్రజలు కూడా సహృదయంతో స్వీకరిస్తే అందరికీ మేలు
జరుగుతుంది.
'భాషా రాజకీయాలు' అనగానే మనకు వెంటనే హిందీ వ్యతిరేక
ఉద్యమం, ఇంగ్లీషు వ్యతిరేక ఉద్యమం, భాషా రాష్ట్రాల ఉద్యమాలు గుర్తుకు
వస్తాయి. ఒక ప్రత్యేక భాషకు సంబంధించిన వారు తమ భాషను కాపాడుకోవడానికి,
పెంపు చేసుకోవడానికి కృషి చేయడం, అందుకోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో
ఉద్యమించడం వారి హక్కు. దాన్నెవరూ కాదనరు. తమ భాషపై పరభాషలు పెత్తనం
చేయడాన్ని వ్యతిరేకించడం ప్రజాస్వామ్య పోరాట పరిధుల్లోకే వస్తుంది. తమ భాషే
ఉన్నతమైనదని, ఇతర భాషలను గౌరవించడం వల్ల, లేదా ప్రోత్సహించడం వల్ల తమ భాష
దెబ్బతింటుందని, అందువల్ల తమ ప్రత్యేకతను, ఔన్నత్యాన్ని ఎవరూ ప్రశ్నించరాదు
అనే ఆధిపత్య ప్రదర్శన తక్కిన భాషాజాతుల వారి వ్యతిరేకతను ఎదుర్కొనక
తప్పదు. అటువంటి ఆధిపత్య భావజాలాన్ని న్యాయస్థానాలు సమర్థించనేరవు. ఇప్పుడు
సరిగ్గా జరిగింది అదే! 2004 అక్టోబరు 12న కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన
చేసింది. 'క్లాసికల్ లాంగ్వేజెస్' అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు
చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ, దాని ప్రకారం ఆ భాష సాహిత్యం
లేదా చరిత్ర ప్రాచీనత వెయ్యేళ్లకు పైబడి ఉండాలని, ఆ భాషను మాట్లాడేవారు
తరాలుగా విలువైన వారసత్వంగా భావించుకునే సాహిత్య సంపద ఉండాలనీ, దాని
సాహిత్య సంప్రదాయం ఇతర భాషా సమూహాల నుంచి అరువు తెచ్చుకొన్నదిగా కాక
స్వతంత్రమైనదిగా ఉండాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ అర్హతలను
తమిళభాష కలిగి ఉన్నందువల్ల దానిని క్లాసికల్ భాషగా గుర్తిస్తున్నట్లు
తెలుపుతూ, ఇకపై ఈ విషయంలో తీసుకోవలసిన చర్యలను సాంస్కృతిక శాఖ చేపడుతుందని ఆ
ప్రకటన వివరించింది.
ఈ ప్రకటనతో సాటి భాషలైన తెలుగు, కన్నడ
ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు మేధావులు, రచయితలు భావించారు. ఇంతలో ఏమైందో ఏమో
కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా నియమితులైన నిపుణుల కమిటీ (ఈ కమిటీయే తొలుత
తమిళానికి 'క్లాసికల్' ప్రతిపత్తిని ఇస్తూ నిర్ణయించింది) అత్యంత గోప్యంగా
అక్టోబరు 29న సమావేశమై క్లాసికల్ భాషగా గుర్తించబడడానికి తొలుత తాము
నిర్ణయించిన అర్హతల్లో మొదటి దాన్ని మార్పు చేసింది. మొదటి నిర్ణయం ప్రకారం
ప్రాచీనత వెయ్యేళ్ల ప్రాచీనత ఉండాలనే నిబంధనను మార్చి అది 1500-2000
సంవత్సరాల ప్రాచీనత ఉండాలని మార్చారు. పైగా ఆ భాషకు చెందిన ప్రాచీన
సాహిత్యానికి, దాని ఆధునిక భాషా రూపానికీ మధ్య కొన్నేళ్ల పాటు సంబంధం
లేకుండా ఉండవచ్చునన్న నాల్గవ నిబంధనను చేర్చారు. ఈ రెండు మార్పులు చేయడంలో
కచ్చితంగా కుట్ర ఉందని, తెలుగు, కన్నడ భాషలకు ఆ ప్రతిపత్తి రాకుండా
ఉండటానికి ఈ మార్పులను చేశారని వెల్లడైంది. తమిళానికిచ్చినట్లే తమకూ ఈ
హోదాను ఇవ్వాలనీ, పరిశోధనకు, భాషాభివృద్ధికి వారికివ్వాలని నిర్ణయించినట్లే
అన్ని సౌకర్యాలను, సహాయాలను తమకూ ఇవ్వాలని, తెలుగు, కన్నడ భాషా ప్రజల
నుంచి ఉద్యమం బయలు దేరింది.
2005 నవంబరు 25న కేంద్ర ప్రభుత్వం
'సంస్కృతాన్ని' కూడా క్లాసికల్ భాషగా గుర్తిస్తూ మరొక హడావిడి ప్రకటన జారీ
చేసింది. నిజానికి భారతదేశ రాజ్యాంగం ప్రకారం 8వ షెడ్యూలులో 22 భాషల్ని
సమానంగా గుర్తించారు. వీటిలో హిందీని అధికార భాషగా అంగీకరించాలని రాజ్యాంగం
నిర్ణయించింది. అన్నిటినీ జాతీయ భాషలుగా గుర్తించాలనే డిమాండు నాటికీ
నేటికీ అలాగే కొనసాగుతూనే ఉంది. 2004 అక్టోబరు 12న తమిళానికి 'క్లాసికల్'
ప్రతిపత్తినివ్వడానికి నిర్ణయించేందుకే భారతీయ భాషల్లో కొత్తగా 'క్లాసికల్
భాషలు' అనే వర్గీకరణను కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత గాని వారికి
గుర్తురాని అంశం ఏమిటంటే గత 60 ఏళ్లుగా సంస్కృతం, అరబిక్, పర్షియన్,
పాళీ, ప్రాకృత భాషలు క్లాసికల్ భాషలుగా గౌరవిస్తున్న సంప్రదాయం ఉందని, ఆ
భాషల్లో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం
సందర్భంగా సన్మానాలు జరుగుతున్నాయని. తమిళానికి ప్రాచీన భాష హోదా ఇచ్చి,
సంస్కృతానికి ఇవ్వకపోవడం పట్ల కినిసిన పండితులు ఒత్తిడి తేగానే ఉలిక్కిపడిన
కేంద్ర ప్రభుత్వం సంస్కృతాన్ని కూడా 'క్లాసికల్'గా గుర్తిస్తూ 2005
నవంబరు 25న ప్రకటించింది. ఈ పరిణామాలతో ఆత్మరక్షణలో పడ్డ కేంద్రంపై తెలుగు,
కన్నడ భాషోద్యమకారుల ఒత్తిడి పెరిగింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ
చట్ట సభల తీర్మానాలతో కేంద్రంపై ఒత్తిడిని పెంచాయి. దాంతో కేంద్రం గౌరవంగా
బయటపడే ప్రయత్నాలు చేసి, ద్రావిడ విశ్వవిద్యాలయంలోనూ, సిఐఐఎల్ (మైసూరులోని
భారతీయ భాషల కేంద్ర సంస్థ)తోనూ సదస్సుల నిర్వహణ చేయించి, సమ్మిళిత
అభిప్రాయాల సేకరణ చేసి చివరకు 2008 అక్టోబరు 31న మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్,
కర్ణాటక రాష్ట్రాల ఆవిష్కరణ దినోత్సవం రోజున రెండు భాషలకూ క్లాసికల్
ప్రతిపత్తిని ప్రకటించింది.
ఆశించని ఈ పరిణామం ద్రావిడ భాషాధిపత్య
వర్గాల అవకాశాన్ని దెబ్బతీసింది. నిజానికి డిఎంకె పార్టీ 2004లో తమ ఎన్నికల
వాగ్దానాల పత్రంలోనే తాము అధికారంలోకొస్తే కేంద్రాన్ని ఒప్పించి తమిళానికి
క్లాసికల్ భాషా ప్రతిపత్తిని సాధిస్తామనీ, తర్వాత తమిళాన్ని రెండవ జాతీయ
భాషగా ప్రకటనను తెప్పిస్తామని వాగ్దానాలను గుప్పించింది. అన్నాడిఎంకెపై
పైచేయి సాధించడంలో ఇదొక అంశం వారికి. ఎన్నికల తర్వాత కేంద్రంలో యుపిఎ
ప్రభుత్వంలో డిఎంకె చేరడానికి ఒక షరతుగా కనీస ఉమ్మడి కార్యక్రమంలో
తమిళానికి 'క్లాసికల్' హోదానిస్తామనే అంశాన్ని పెట్టించుకున్నారు. ఆ
తర్వాత కొద్ది నెలల్లోనే కమిటీని వేయించి, దాని ద్వారా 'క్లాసికల్ భాష'
ప్రకటనను అదే ఏడాది నవంబరు 12నే ప్రకటింపజేసుకున్నారు. దాని ప్రకారం
గుర్తింపే కాకుండా, తమిళ భాషా కేంద్ర సంస్థనూ, పరిశోధన కేంద్రాన్ని
స్థాపించుకోవడానికి, అంతర్జాతీయ, జాతీయస్థాయిల్లో గుర్తింపు, గౌరవాన్ని
పొందే పధకాలను; రూ.100 కోట్ల కేంద్ర సహాయాన్ని పొందుతారు. కేంద్రీయ
విశ్వవిద్యాలయాల్లో తమిళ పీఠాలు ఇంకా ఎన్నో ఆ రకంగా ప్రత్యక్ష, పరోక్ష
నిరంతర ఆర్థిక వనరుల తోడ్పాటు, రాజకీయ ప్రాబల్యం వీళ్ళాశించారు. తెలుగు,
కన్నడాలు పోటీకి వస్తాయని, కేంద్రాన్ని ఒప్పిస్తాయని వారు ఊహించలేదు. దీంతో
డిఎంకె అభిమాని అయిన న్యాయవాది ఆర్.గాంధీ చేత మద్రాసు హైకోర్టులో
వ్యాజ్యం వేయించారు. 'క్లాసికల్ భాష' హోదాకు కావలసిన అర్హతలు ఆ రెండు
భాషలకూ లేవనేది ఆ వ్యాజ్యంలో ఒక అంశం కాగా, వారికి గుర్తింపు ఇస్తే
'తమిళభాష'కున్న ప్రత్యేకత పోతుందనేది మరొక అంశం. ఈ రెండు అంశాల మీద మద్రాసు
ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 'క్లాసికల్ భాషలను' గుర్తించడానికి
కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ నిర్ణయాలే తుది నిర్ణయాలనీ, వాటిపై ఏదైనా
చెప్పవలసివస్తే వారికే చెప్పుకోవాలని స్పష్టం చేసింది. ఇతర భాషలకు ఇచ్చే
గుర్తింపు వల్ల తమిళానికి ఖ్యాతి తగ్గుతోందనే మాట తప్పు అనీ, ఏ భాషా ఖ్యాతి
అయినా, ఆ భాషా ప్రజల కృషి, తీరుతెన్నులు, అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది
తప్ప ఒక దానివల్ల మరొక భాష ఖ్యాతి ఎప్పుడూ దెబ్బతినదని స్పష్టం చేసిన
న్యాయమూర్తులు 'అన్ని భాషలూ దేవాలయాల వంటివే'ననే సూక్తితో తమ తీర్పుకు ఒక
ఔన్నత్యాన్ని, శాశ్వతత్వాన్ని కలిగించారు.
ఇక్కడ మనం గమనించవలసింది
ఒకటే! ప్రజాస్వామ్యంలో భాషల గుత్తాధిపత్యం చెల్లదు. ఇప్పుడు ప్రపంచీకరణ
విధానాల దాడిలో నలిగిపోతున్న భారత్ వంటి దేశాల్లో ఇంగ్లీష్ భాషా
సామ్రాజ్యవాదం పాలన, విద్యావ్యవస్థల్ని దురాక్రమణ చేస్తోంది. మన
ప్రభుత్వాలు కూడా ప్రపంచీకరణ మాయలో కొట్టుకుపోతున్నాయి. ఇటువంటి సమయంలో
దేశీయ భాషలన్నిటినీ ప్రజా భాషలుగా గుర్తించి, అభివృద్ధి పరచుకోవడం మన
కర్తవ్యం. అదే భాషా జాతుల వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి,
ప్రజాస్వామ్యాన్ని జాతీయతను కాపాడుకోవడానికి దారి తీస్తుంది.ఇప్పుడు
మద్రాసు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వల్ల గెలిచింది ప్రజల భాషలు.
ఓడింది భాషోన్మాదం. దీన్ని తెలుగు వాళ్లం ముఖ్యంగా గమనించాలి. ఈ వ్యాజ్యంలో
తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరెంత వాదించారు. ఎవరు ఏ దశలో
ప్రవేశించారు అన్న చర్చకు మనం తావివ్వకూడదు. విశిష్ట భాష (క్లాసికల్
లాంగ్వేజి) కేంద్ర సంస్థను మా రాష్ట్రానికే తెచ్చుకుంటామనీ రెండు రాష్ట్రాల
బాధ్యులు పరస్పరం ప్రకటనివ్వడం మనకేమేలు చేకూర్చదు. ఉభయ రాష్ట్రాల
ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని తమ మాతృభాష 'తెలుగు'ను విశిష్ట భాషగా పెంపుదల
చేసుకునేందుకు సమిష్టిగా ఆలోచించి చర్యల్ని చేపట్టాలి. రెండు రాష్ట్రాలైనా
రెండూ తెలుగు రాష్ట్రాలే. ఏ ఇతర భాషకూ లేని ప్రత్యేకమైన బాధ్యత మనకు
మరొకటి ఉంది. అసమగ్రంగా, అసమంజసంగా జరిగిన భాషా రాష్ట్రాల ఏర్పాటు
వల్లగాని, అనేక చారిత్రక, సామాజిక కారణాల వల్ల గాని ఇప్పుడు రెండు తెలుగు
రాష్ట్రాల్లో కలిపి 9 కోట్ల మంది తెలుగువారుంటే, బయట మరో 9 కోట్ల మంది
తెలుగువారు ఉన్నారు. వీరందరూ తెలుగు అభివృద్ధినే కోరుకుంటున్నారు. కనుక
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కలిసి సమిష్టి వ్యూహంతో తెలుగు
భాషాభివృద్ధికై కృషి చేయడానికి ఇదొక మంచి అవకాశం.
- డా॥ సామల రమేష్బాబు
తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు
98480 16136
reachout | ఒక విశ్వాన్ని ఊహించండి, ఎక్కడయితే ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని అందరితో పంచుకోగలడో, ఆ విశ్వాన్ని ఊహించండి. అటువంటి విశ్వాన్ని నెలకొల్పడమే మా సంకల్పం. |