ఇప్పటివరకు అంతర్జాతీయ ఇంటర్ నెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత బిగ్ డీల్ ఒకటి జరిగింది. మొబైల్స్ లో ఇటీవల బాగా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న వాట్స్ యాప్ ను దాదాపు లక్షా పద్దెనిమిది వేల కోట్లతో ఫేస్ బుక్ కొనేస్తోంది. ఈ డీల్ మొత్తం విలువ దాదాపు రూ. 1,18,200 కోట్లు!! ఈ విషయాన్ని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బెర్గ్ ప్రకటించాడు. ఈ మొత్తంలో కొంత భాగాన్ని ఫేస్ బుక్ స్టాక్ గాను, మరికొంత మొత్తాన్ని నగదుగాను చెల్లిస్తున్నట్లు తెలిపాడు.
ఈ ప్రపంచం మరింతగా కనెక్ట్ కావాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే వాట్స్ యాప్ ను కొంటున్నామని జుకెర్ బెర్గ్ చెప్పాడు. జనం తమకు కావల్సింది ఏదైనా ఇందులో షేర్ చేసుకోవచ్చన్నాడు. దీని సాయంతో ప్రపంచం నలుమూలల ఉన్నవాళ్లు ఈ యాప్ ను ప్రతిరోజూ ఉపయోగించుకోడానికి వీలుంటుందని వివరించాడు. ఫేస్ బుక్ మార్కెట్ విలువలో ఈ డీల్ మొత్తం 9 శాతం మాత్రమే. మొత్తం 1900 కోట్ల డాలర్ల డీల్ కు తోడు, వాట్స్ యాప్ వ్యవస్థాపకులు, ఉద్యోగులకు మరో 300 కోట్ల డాలర్ల నియంత్రిత స్టాక్ కూడా ఇస్తారు. ఫేస్ బుక్ లోనే స్వతంత్రంగా వాట్స్ యాప్ కూడా ఉంటుందని జుకెర్ బెర్గ్ అంటున్నాడు. తమ భాగస్వామ్యం వల్ల బేసిక్ ఇంటర్ నెట్ సేవలు ప్రతి ఒక్కరికీ మరింత అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపాడు. వాట్స్ యాప్ ను 2009లో ప్రారంభించారు. అమెరికాకు చెందిన బ్రియాన్ యాక్టన్, ఉక్రెయిన్ కు చెందిన జాన్ కౌమ్ దీన్ని స్థాపించారు. అప్పట్లోనే వీళ్లు గూగుల్, ఫేస్ బుక్ వద్దకు వెళ్లి అడిగినా.. వాళ్లు నిరాకరించారు.