విరాట పర్వంలోని పంచమాశ్వాసంలో అనావృష్టి, కరువు, వర్షాల ప్రస్తావన ఉండటం
వల్లే వర్షాలు పడనప్పుడు ప్రజలు విరాట పర్వం చదవడం ఆనవాయితీగా వస్తోందని
నా అభిప్రాయం . ఉత్తరగోగ్రహణంలో విజయం సాధించామన్న సమాచారం తెలుసుకున్న
మత్స్య దేశాధిపతి విరటుడు ఆ ఆనంద సమయంలో కంకుభట్టు (ధర్మరాజు)తో
జూదమాడేందుకు ఉపక్రమిస్తాడు. ఆ సమయంలో సైరంధ్రి (ద్రౌపది) కూడా
అంతఃపురంలోనే ఉంటుంది. తన కుమారుడైన ఉత్తరుని పరాక్రమం వల్లే ఉత్తర
గోగ్రహణం లో కౌరవులు ఓటమి పాలయ్యారని విరటుడు కంకుభట్టుతో అంటాడు.
విరటుని అభిప్రాయంతో కంకుభట్టు ఏకీభవించడు. బృహన్నల (అర్జునుడు) గొప్పతనం
వల్లే విజయం సంభవించి ఉంటుందని అంటాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం
జరుగుతుంది. విరటుడు ఆగ్రహావేశుడై తన చేతిలోని సారెతో కంకుభట్టు నుదిటిపై
బలంగా కొడతాడు. కంకుభట్టు నుదిటి నుండి రక్తం చిందుతుంది. అక్కడే ఉన్న
సైరంధ్రి వారిద్దరినీ సమీపించి పక్కనే ఉన్న బంగారు కలశం లోని నీటితో
కంకుభట్టు నుదిటిని తుడిచి రక్తం స్రవించకుండా చీరకొంగుతో గాయాన్ని
అదిమి పడుతుంది. అలా ఎందుకు చేశావని విరటుడు కంకుభట్టును ప్రశ్నిస్తాడు.
అప్పుడు సైరంధ్రి ..
"విమల వంశంబున బుణ్యవృత్తమున వరలు నీతని రక్తంబు వసుమతీశ !
ధరణిపై ఎన్ని బిందువుల్ దొరగె నన్ని వర్షములు గలుగు నిందనా వర్ష భయము
"
అని అంటుంది.
- కల్మశంలేని వంశంలో మంచి నడవడికతోనూ ధర్మంగా జీవించే ఇతడి రక్త
బిందివులెన్ని భూమి మీద పడితే అన్నేల్లు ఈ దేశంలో అనావృష్టి కలుగుతుందని
పై పద్యం అర్థం .
ధర్మపరులైన వారిని హింసిస్తే ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తాయనే
హెచ్చరికను ఈ సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవచ్చు.
విరాటపర్వం చదవడం ద్వారా ప్రజల్లో ధర్మనిరతి పెరుగుతుందని, తద్వారా
ప్రకృతి పులకించి వర్షాలు కురుస్తాయనే సందేశం విరాటపర్వంలో ఇమిడి ఉందని
భావించవచ్చు.
-తవ్వా ఓబుల్ రెడ్డి