మిత్రులారా,
కిందటి వారం ..ఆ మాటకొస్తే కిందటి రెండు వారాలలో రెండు విశేషాలు జరిగాయి.....వాటిల్లో ఒకటి అనుకోని శారీరక ఇబ్బంది. మరొకటి భలే సరదా అయినదీ, చరిత్ర సృష్టించినదీ.
కాలిఫోర్నియా లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారి 6వ స్నాతకోత్సవాలు జూన్ 1, 2024 నాడు అత్యంత వైభవంగా జరగడం ప్రధానమైన విశేషం. ఇది చరిత్రాత్మకమైనది. ఎందుకంటే మన తెలుగు భాషా, సాహిత్యాల 2000 ఏళ్ళనాటి చరిత్రలో తొలి సారిగా ఒక విదేశం..అంటే అమెరికాలో 16
మంది తెలుగులో మాస్టర్స్ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ఆ 16 మందిలో నేనూ ఒకడిని.
సరిగ్గా 50 ఏళ్ళ క్రితం, 1974 లో బొంబాయి ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న నేను ఈ ఏడు 2024 లో తెలుగు లో M.A. పట్టా అందుకోవడం భలే సరదా అయిన సంగతి కాబట్టి మా కుటుంబం అంతా కలిసి ఈ స్నాతకోత్సవం లో పాల్గొనడానికి మాంచి ప్రణాళిక సిధ్ధం చేసుకున్నాం. మా నూతన పట్టభద్రులైన 16 మందిలో నేను అందరి కన్నా “పిన్న వయసు” వాడిని కాబట్టి ఈ స్నాతకోత్సవం లో వేలిడిక్టోరియన్ స్థాయి లో నన్ను మాట్లాడమని ఆ ఏర్పాట్లు కూడా ఆ విశ్వవిద్యాలయం వారు చేశారు.
కానీ అప్పుడప్పుడు మనం ఒకటి తలిస్తే పైవాడు మరొకటి తలుస్తాడు కదా!. అలాగ మేము మా హ్యూస్టన్ నుంచి కాలిఫోర్నియా బయలుదేరడానికి వారం రోజులు ముందు ఏమైయిందో, ఎందుకు అయిందో తెలీదు కానీ నా శరీరం లో ఎక్కడో ఒకానొక రక్తనాళానికి చిల్లు పడింది. అది నాకు తెలియగానే ‘ఇదెక్కడి గోలరా బాబోయ్” అని వెంటనే హాస్పిటల్ లో చేరిపోయాను. అక్కడ డాక్టర్లు, ఇతర సిబ్బందీ ఆ రక్తం గొట్టానికి రిపేరు చేసి, వారం రోజులలో మామూలు మనిషిని చేసి ఇంటికి పంపించారు....ఇదన మాట అనుకోని ఆ శారీరక ఇబ్బంది. దీని గురించి త్వరలోనే ‘హాస్య కౌముది” లో సరదాగా రాస్తాను.
ఇక స్నాతకోత్సవానికి కాలిఫోర్నియా వెళ్ళడం అసాధ్యం అని తేలిపోయింది. అప్పుడు మా సహాధ్యాయులు, ఆ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు “మీరు రాలేకపోతే కనీసం మీ సందేశాన్ని వీడియోలో పంపిస్తే అది ప్రసారం చేస్తాం” అని ఎంతో గౌరవంగా సూచించారు. ‘భలే” అనుకుని నేను అప్పుడే కొనుక్కుని సిధ్ధం చేసుకున్న ఆ గ్రాడ్యుయేషన్ గౌనూ, టోపీ పెట్టుకుని మా ఇంట్లోనే కూచుని నా ప్రసంగం రికార్డ్ చేసి పంపించాను. అందులో మిగతా విషయాలతో పాటు ఆ విశ్వవిద్యాలయం లో తెలుగు శాఖని పటిష్టం చేయడానికి, వంగూరి సంస్థ ఆశయాలు అయిన భాష, సాహిత్యాల పురోభివృధ్ధికి మా వంతు సహాయంగా లక్ష డాలర్ల కనీస విరాళం తో Vanguri Foundation of America Endowment Fund for Telugu Studies అనే పేరిట ఒక ధార్మిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాను. దానికి అందరూ నుంచుని తప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. మన సనాతన భారతీయ భాషా, సాహిత్య, సాంస్కృతిక, సంగీత, నాట్య సంపదలని, కళారూపాలని స్నాతకోత్తర స్థాయిలో అధ్యయన అవకాశాలని కల్పిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ, ఇతర వ్యవస్థలని మనం అందరం బలోపేతం చేయ్యాలి కదా! మీరూ, నేనూ ..ఇలా అందరం తలో చెయ్యీ వేసి ప్రోత్సహిస్తేనే కదా భావి తరాలకి మన సాంస్కృతిక ఆస్తిత్వాన్ని అందజేయగలిగేది.
ఆసక్తి ఉన్న వారు నా ప్రసంగం ఈ క్రింది లంకె లో చూడవచ్చును.
సుమారు 2:30 గంటలు సాగిన ఆ స్నాతకోత్సవం మొత్తం ఈ క్రింది యూ ట్యూబ్ లింక్ లో చూడవచ్చును.
M.A పట్టాలు అందుకుని చరిత్ర సృష్టించిన నా సహాధ్యాయులు 15 మందీ ఎవరంటే..... ప్రముఖ రచయిత్రి కొమరవోలు సరోజ (కెనడా), అమెరికాలో పలు నగరాల నుంచి అమృతవల్లి కవి, భాస్కర్ రాయవరం, వేణు ఓరుగంటి, కిరణ్ సింహాద్రి, మధు కిరణ్ ఇవటూరి, పావని తణికెళ్ళ, ప్రసాద్ జోస్యుల, రామారావు పాలూరి, శ్రీ గౌరి బానావత్తుల, శ్రీని రామనాధం, సుమలిని సోమ, సువర్ణ ఆదెపు, వేణుగోపాల నారాయణ భట్ల, విద్యాధర్ తాతినేని. మాకు అసమానమైన పాండిత్యమూ, బోధనా పటిమలతో రెండేళ్ళు పాఠాలు చెప్పి, పరీక్షలు పెట్టి, పరిశోధనలు చేయించి, థీసిస్ లు రాయించి పట్టాలు ఇప్పించిన ఆచార్యులు సి. మృణాళిని, పాలెపు వారిజా రాణి, అద్దంకి శ్రీనివాస్, లక్ష్మణ చక్రవర్తి, గురజాడ శ్రీశ్రీ, గంగిశెట్టి లక్ష్మీనారాయణ గార్లు. వీరిలో మృణాళిని గారు, వారిజా రాణి గారు భారత దేశం నుంచి వచ్చి ఈ స్నాతకోత్సవం లో పాలుపంచుకున్నారు.
ఈ M.A తెలుగు పట్టాలో నా పరిశోధనాంశం – బహుశా మీలో కొందరు ఊహించినట్టుగానే -
“అమెరికా తెలుగు డయస్పోరా కథలు-చారిత్రక, వస్తు విశ్లేషణ (Telugu Diaspora Short Story: Historical & Thematic analysis). నాకు మార్గదర్శకురాలు డా. సి. మృణాళిని గారు.
నా M.A. (Telugu) పట్టా, నా సిధ్హ్దాంత వ్యాసం (థీసిస్) అట్ట ఫొటోలు ఇక్కడ జతపరిచాను. తెలుగు మనకి ఏం చేసిందీ అనేకంటే మనం తెలుగుకి ఏం చేశాం అనుకునే సందర్భం ఇది.
ఈ స్నాతకోత్సవానికి కుటుంబ సమేతంగా వచ్చిన మా సహాధ్యాయులు, ఉపాధ్యాయులూ అందరూ ఒక ప్రత్యేక బస్ లో శాన్ ఫ్రాన్ సిస్కో నగర విహారం చేశారు. ఆ సరదాలు అన్నీ నేనూ, మా కుటుంబం మిస్ అయిపోయాం. ఆ స్నాతకోత్సవం ఫొటోలు, ఆఖర్న టోపీలు ఎగరేసే సరదా తతంగం వీడియో మొదలైనవి కొన్ని ఇక్కడ పెట్టాను. ఈ స్నాతకోత్సవం లో మా తెలుగు పట్టభదులతో పాటు కూచిపూడి నృత్యం, భరత నానాట్యం, హిందూస్తానీ సంగీతం, కర్నాటక సంగీతం, భరత నాట్యం విభాగాలలో సుమారు 40 మంది మాస్టర్స్, డిప్లమా లు అందుకున్నారు. అది కూడా చరిత్రలో ఒక మైలు రాయి.
ఈ బృహత్ విజయాలకి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ నిర్వహణలో అహర్నిశలూ చెమట ఓడ్చి నిస్వార్ధంగా పని చేస్తున్న స్ఫూర్తి ప్రదాత ఆనంద్ కూచిభొట్ల, శాంతి కూచిభొట్ల, రాజు చమర్తి, శ్రీదేవి గంటి, మమత కూచిభొట్ల..తదితరులకి నా వేనవేల ధన్యవాదాలు.
కొస మెరుపు ఏమిటంటే...... ఆనంద్ కూచిభొట్ల, స్నాతకోత్సవం లో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న ప్రముఖ వైద్యులు డా. ముక్కామల అప్పారావు (డిట్రాయిట్) గారు, డా. కేశవ రావు గారు మరొక మూడు రోజుల తర్వాత వేరే పని మీద హ్యూస్టన్ వచ్చి, నా మీద ఎంతో గౌరవంతో నన్ను పరామర్శించడానికి మా ఇంటికి వచ్చారు. వారి సహృదయతకి నా అభివందనలు. ఆ ఫొటో కూడా జత పరిచాను.