సినీ కళారంగ ప్రముఖుడు శిల్ప కళా రత్న,అపర అమరశిల్పి జక్కన్న –శ్రీ చిన్నాల రంగారావు
1914లో కృష్ణా జిల్లా మల్లవోలు లో జన్మించిన శ్రీ చిన్నాల రంగారావు తలిదండ్రులు వెంకయ్య వెంకమ్మ .ఉప్పు వీర వెంకయ్య వద్ద శిల్ప కళా వైదుష్యాన్ని నేర్చుకొని ,8వ ఏటనె గురువుతో కలిసి తెనాలి వెళ్ళి గురువు వద్దనే శిల్ప విద్యలో ఆరితేరాడు .1934లో గురువు గారి మరణం తర్వాత గురువు గారి బాధ్యత మీద వేసుకొని రాష్ట్ర రాష్ట్రేతర పండిత పామర జనాలను మెప్పిస్తూ ,గొప్ప అభిమానం సంపాదించాడు .అరణ్య ప్రాంతాలలో శిలలు ఎంపిక చేసే విషయం లో అక్కడి క్రూర మృగాల బారిన పడకుండా మాజీ మంత్రి ఆలపాటి వేంకట రామయ్య గారు ఈయన రక్షణ కోసం ఒక గన్ మాన్ ను ఏర్పాటు చేసి ,లైసెన్స్ ఇప్పించి ఒక గన్ ను కానుకగా ఇచ్చారు .
1942లో క్విట్ ఇండియా ఉద్యమం లో అసువులుకోల్పోయిన మృత వీరుల చిహ్నాన్ని తెనాలి పాత బస్ స్టాండ్ లో నెల కొల్పిన స్మారక చిహ్నాన్ని ,మృత వీరులను చూసి కన్నీరు కారుస్తున్న భారత మాత విగ్రహాన్ని కళాశిల్పి చిన్నా రంగారావు రూపొందించి అందరి ప్రశంసలు అందుకొన్నారు .ఈ స్తూపాల ఆవిష్కరణకు వచ్చిన తమిళనాడుమాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్ మహాశిల్పి రంగా రావు కు ‘’శిల్ప రత్న ‘ బిరుదు ప్రదానంచేసి ,గండ పెండేరం తొడిగి ఘనంగా సత్కరించి చరిత్ర సృష్టించారు .తెనాలి పాత శివాలయం ప్రాంగణం లో నవగ్రహాలను మలిచి ప్రతిష్టింప చేశారురంగారావు.
కర్నాటకలో హోస్పేట లో గోపాల కృష్ణ దేవాలయం ,కొడంగల్ లో వెంకటేశ్వర దేవాలయం లలో దేవతా శిల్పాల నిర్మాణం నభూతో న భవిష్యతి .ఆరు దశాబ్దాల పాటు తెనాలిలో సోదరుడురాఘవయ్య, సోదర కుమారుడు సుబ్బారావు లసహాయ సహకారాలతో శిల్ప శాల నిర్వహించి దేశ వ్యాప్త కీర్తి గడించారు రంగారావు.శిల్ప విద్యనూ నేర్పుతూజీవన భ్రుభ్రుతి కూడా కల్పించారు .శిల్ప విగ్రహా లతోపాటు కంచు ,పంచ లోహ విగ్రహాలనిర్మాణం లోనూ రాణించారు .మకర తోరణాలు ,వాహనాలు,సింహ తలాటాలు , బంగారం వెండి రాగి ఇత్తడితో చేసి అందరికి దగ్గరయ్యారు.పుత్ర సంతానం లేని రంగారావు అన్నకుమారుడు సుబ్బారావు ను దగ్గరకు తీసి శిల్ప విద్యలో నిష్ణాతుడిని చేశారు .నిర్జీవ శిలా ,లోహాలను సజీవ మూర్తులుగా మలచి భక్తులచేత నీరాజనాలు అందుకోనేట్లు చేసిన అపర జక్కన శిల్పి చిన్నాల రంగారావు .ఈ అపర అమర శిల్పి జక్కన రంగారావు 83 వ ఏట మార్చి 24 1997 న అమర జీవులయ్యారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-24-ఉయ్యూరు .