మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -6
16-అచ్చ తెనుగు కవి,మనువు పుట్టువు ,మెచ్చుల పచ్చ ముచ్చెలి కర్త , కవితా కళానిధి- శ్రీ నారు నాగనార్య
నారు నాగనార్య (జులై 3, 1903 - జనవరి 18, 1973) సాహితీవేత్త.
నారు నాగనార్య 1903 జూలై 3లో సుబ్బమ్మ నరసింహం దంపతులకు జన్మించాడు. తెలిక కులస్థుడు. స్వగ్రామం వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు సమీపంలో ఉన్న రాఘవరాజుపురం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అష్టావధాని అల్లాడి జగన్నాథశాస్త్రి వద్ద చంధస్సు, అలంకార శాస్త్రాలు నేర్చుకున్నాడు. జనమంచి శేషాద్రిశర్మ వద్ద శ్రీవిద్య ఉపాసనము చేశాడు. ఇతడు స్వాతంత్ర్యప్రియుడు. 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. పర్లపాడు సత్యాగ్రహాశ్రమములో నివసించి ఖద్దరు సేవ చేశాడు. 1923,1947లలో సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. 1949నుండి సాహిత్యంవైపు దృష్టి మరలించాడు. ఇతనికి వైద్యవిద్యలో ప్రవేశం ఉంది. రమణ మహర్షి పట్ల ఆకర్షితుడైనాడు. 1973 జనవరి 18న మరణించాడు.
ఇతనికి సంస్కృతాంధ్ర భాషలంటే అభిమానము. సుమారు 70 గ్రంథాలు రచించాడు. ఏకథాటిగా వందలకొద్దీ పద్యాలను అల్లగలిగే శక్తి ఉంది. అచ్చతెలుగు పై ఎక్కువ మమకారము ఉన్నవాడు. పెద్దన మనుచరిత్రను మనువుపుట్టువు అనే పేరుతోను, ముక్కు తిమ్మన పారిజాతాపహరణమును మెచ్చులపచ్చమ్రుచ్చిలి అనే పేరుతోను అచ్చతెలుగులో అనువదించాడు. ఇతని రచనలు గడియారం వేంకట శేషశాస్త్రి, జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ మొదలైన పండితుల మెప్పును పొందాయి.
· వీరపూజ
· శ్రీ పృథ్వీరాజవిజయము
· తిలోత్తమాసాహసికము
· మనువు పుట్టువు
· మెచ్చులపచ్చ మ్రుచ్చిలి
· శకుంతల
· ఊర్వశి
· వెన్నెల పెళ్ళి
· రామకత
· ఉషారాజ్ఞి
· ధ్యానమాలిని
· ప్రణయిని
· శ్రీ రమణాభ్యుదయము
· ఆర్యవాణి
· తెలుగుతల్లి శతకము
· సౌందర్యలహరి
· శ్రీ మలయాళ సద్గురు దండకం
· శ్రీ రమణానుగ్రహ స్తుతి
· కేనోపనిషత్తు
· యతిగీతం
· శ్రీ హృదయాభ్యుదయము
· శ్రీరామహృదయం
· లక్ష్మణహృదయం
· దేవయాని
· కష్టజీవి
· పరాధీన భారతం
· సత్యాన్వేషి
· ఉద్బోధ
· వెన్నెలపెండ్లి
· వసంతోదయం ...మొదలైనవి
పనిపాటు విడియూరు నాడుఁ దిరుగన్ బాల్వడ్డ బైరాగి పో
రనుతిండిన్ బ్రదుకంగలాడచటికాహా! వచ్చెనా! వచ్చి యే
మనిచెప్పెన్ మనయందగాఁడు బదులేమందించెఁగన్గీటి రు
క్మిణి యేమాడెను డాఁప కంతయును గూర్మింబల్కరాదే!చెలీ!
దాసానిరంగు చీరన్
బాసి, వెలఁది మడుఁగుఁగట్టి - పంచల సొమ్ముల్
వేసి, కయిదమ్మిఁదునుకలు
సేసి,చెలిన్ గొదుకు బ్రదుకుఁ - జిడిముడి పడుచున్
నీరున్నకాఱు మబ్బున
జేరిన రిక్కవలె 'సత్య'- చెలువంబఱిపం
చారించి యలుకగీమున
దూరెను సకులలుగఁ జేయుదురుగద! యిట్టుల్
-మెచ్చులపచ్చ మ్రుచ్చిలి (అచ్చతెలుగు పారిజాతాపహరణము)నుండి
వాగర్ధంబులవోలె నిర్వురొకటై వైరి ప్రకాండంబును
ద్వేగాకంపిత దేహవల్లరులరీతిన్ స్వప్రతాపక్రియా
వేగోదీర్ణబల ప్రభంజనతఁ గల్పింపన్ సముద్దిష్ట దీ
క్షాగర్వంబున లేళ్లపై నుఱుకువ్యాఘ్రంబుల్ వలెన్ దూఁకినన్
బలవన్నాగవరంబేన్
జవిచీమల చేతఁజిక్కిచచ్చినయటులీ
బలియుఁడు మాచే సిలుఁగుల
గలఁగఁడె యిపుడొంటి పాటు గదిసినకతనన్
అనియుప్పొంగుతలంపులన్ బెనఁగు మిథ్యాపౌరుషోద్రేక సం
జనిత క్రోధ విఘూర్ణనోత్థచటులోచ్ఛాయ క్రియన్ బ్రాఙ్మనో
జనితాఖండజయేప్సితార్థ ఫలమిచ్చాస్ఫూర్తి నర్థించి, మిం
చిన వేగంబున వీరుపైఁగవిసి నిస్త్రింశోగ్ర ధారాహతిన్
-వీరపూజనుండి
గుత్తపు పట్టుఱైకబిగి కుట్టు పటుక్కునఁ బిక్కటిల్లి స్వా
యత్తముఁ దప్పిపోఁబ్రిదిలి యబ్బుర పుబ్బగు గబ్బిగుబ్బలు
వెత్తున నొత్తరించి వలపింపఁగవుంగిటనించి పల్లు కెం
పొత్తిలి మోవితేనెఁజవులూరఁగొనెన్ 'విధు'డా 'తిలోత్తమన్'
-తిలోత్తమాసాహసికమునుండి
పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు 1894 ఏప్రిల్ 7వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. గడియారం వేంకట శేషశాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. 1932లో అనిబిసెంట్ మున్సిపల్ పురపాలిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద యజుర్వేదం, ఉపనిషత్తులు, దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, ఉత్తర రామాయణ గ్రంథాలు, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, వాల్మీకి హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారు. నన్నయ్య భారతం, పోతన భాగవతం లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిని తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.
· ప్రొద్దుటూరు రాయల సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేశారు గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంలో శ్రీపాద తల్లావర్ఘుల వారిఎదుట గజారోహణ సత్కారం అందుకున్నారు.
· 1945లో అనంతపురంలోని హిందూపురం లలిత కళాపరిషత్తు సభ్యులు స్వర్ణ గండపెండేరం, సువర్ణ కంకణ బహుకరించారు.
· 1948లో మద్రాసు ప్రభుత్వం దశాబ్ద కాలపు ఉత్తమ సాహితీ గ్రంథంగా శివభారతాన్ని గౌరవించి ప్రథమ బహుమతితో సత్కరించారు.
· 1967లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డు అందజేసింది.
· 1968లో ప్రొద్దుటూరులో కనకాభిషేకం,
· 1974లో మరాఠా మందిర్ వారు శివాజి త్రిశత జయంతి ఉత్సవాల్లో భాగంగా బంగారు పతకాన్ని బహుకరించారు.
· 1976లో వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ను అందించారు.
· 1959 నుంచి 1968 వరకు శాసనమండలి సభ్యునిగానూ,
· 1969 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు
· కవితావతంస
· కవిసింహ
· అవధానపంచానన
· 18-మణిమేఖల,తిరుక్కురల్ అనువాదకుడు ,ఆంద్ర భాషా లక్షణ కర్త ,రాష్ట్ర పతి పురస్కారగ్రహీత ,కనకాభిషేకి ,కవితా తపస్వి అభినవ పోతనామాత్య ,ఆంద్ర కంబర్ –శ్రీ పూతలపట్టు శ్రీరాములు రెడ్డి
· ఆంధ్ర కంబర్గా ప్రసిద్ధి చెందిన పూతలపట్టు శ్రీరాములురెడ్డి (ఏప్రిల్ 5, 1892 - నవంబర్ 8, 1971) [1] ప్రముఖ తెలుగు కవి, అనువాదకులు.
ఈయన 1892 ఏప్రిల్ 5లో లక్ష్మమ్మ, పెద్దబుచ్చిరెడ్డి దంపతులకు చిత్తూరు జిల్లా పూతలపట్టు గ్రామంలో జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్య పాఠశాలలో చదువుకొన్నాడు. తరువాత స్వయంకృషితో ఆంధ్ర, తమిళ, సంస్కృత సాహిత్యాలు చదువుకున్నాడు. ఇతని తండ్రి హరికథలను చెప్పేవాడు.
మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన విద్వత్ పరీక్షలోఉత్తీర్ణులై తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్ర్రారంభించాడు.[2] విద్యాబోధన చేస్తూ రచనా వ్యాసంగాన్ని సాగించాడు. బమ్మెర పోతన వలెనే భక్తిరస ప్రధానమైన రచనలపై మొగ్గుచూపాడు. తమిళంలో ప్రసిద్ధిచెందిన కంబ రామాయణం, తిరుక్కురళ్, శాండియార్, శిలప్పదిగారం, మణిమేఖల కావ్యాలు తెలుగులోకి అనువాదం చేసి కవిపండితుల మెప్పు పొందాడు. ఇవికాక కుమార సంభవం కావ్యాన్ని తెలుగుసేతను గావించాడు. తెలుగు సందేశం, నీతి నిధి, సుభాషిత భండారం, చిత్తూరు మండల ప్రశస్తి మొదలైన ఇరవై పద్యకావ్యాలు రచించారు. వీరు 8 వరకు గద్య రచనలు కూడా చేశారు. వానిలో సుజ్ఞాన బోధిని, సురాభాండేశ్వరం, విశ్వామిత్ర చరిత్రం, బాల వినోదిని గ్రంథాలు ప్రముఖమైనవి. వీటిలో సంతృప్తిచెందక, ఆంధ్ర భాషా లక్షణ లక్షణం, తెలుగు లక్షణం (3 భాగాలు) నిర్మాణ కలనం (3 భాగాలు), విద్యార్థి కోశం వంటి లక్షణ గ్రంథాలను కూడా రచించి లాక్షణికులుగా ప్రసిద్ధిపొందాడు.
ఇతడు 1971 నవంబర్ 8 తేదీన మాణించాడు.
వేలాదిమంది శిష్యులు, మిత్రులు, బంధువులు, అభిమానులు కలసి ఇతని సేవలకు గుర్తింపుగా వీరి కాంస్యవిగ్రహాన్ని పూతలపట్టు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు.
1. విద్వత్కవికులతిలక
2. సాహిత్య రత్నాకర
3. కవితాతపస్వి
4. అభినవ పోతనామాత్య
5. మహాకవి
6. ఆంధ్ర కంబర్
· పూతలపట్టు గ్రామ ప్రజలచే పల్లకీ ఊరేగింపు
· ఆంధ్ర నలంద గుడివాడ వారిచే బంగారు పతకం
· తమిళనాడు కారక్కుడిలో జరిగిన కంబకవి వార్షికోత్సవంలో కనకాభిషేకం
· ఆంధ్ర కళాపరిషత్ అధ్యక్షుడు 1953లో
· సెనేట్ సభ్యుడు - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి.
· సభ్యుడు - ఆంధ్ర సాహిత్య అకాడెమీ, హైదరాబాదు
· రాష్ట్రపతిచే మంజూరైన గౌరవ వేతనం మరణించేదాకా.
1. కంబరామాయణం[3] (2 సంపుటాలు) (తమిళం నుండి అనువాదం)
2. నాలడియారు (తమిళం నుండి అనువాదం)
3. పెరియ పురాణము (తమిళం నుండి అనువాదం)
4. శిలప్పదికారము (అందియకత) (తమిళం నుండి అనువాదం)
5. మణిమేఖల (తమిళం నుండి అనువాదం)
6. సూక్తిసుధ
7. తెనుగు సందేశము
8. త్రివర్గము
9. నీతిగుచ్చము
10. కుమారసంభవము (సంస్కృతం నుండి అనువాదం)
11. ప్రశ్నోత్తర రత్నావళి (సంస్కృతం నుండి అనువాదం)
12. సురాభాండేశ్వరము (1953) [4] ఇది చిత్తూరు జిల్లా వాయల్పాడు తాలూకాలో కలకడ గ్రామంలో వెలసిన సురాభాండేశ్వరుడు గురించిన స్థలపురాణం.
13. భక్తిమాల (పెద్దపురాణము)
14. మధురకవితా సంహిత
15. త్రికటుకము
16. అభిదాన దర్పణము
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-22-ఉయ్యూరు
