అలా ఉన్నట్టి గర్భిణీ స్త్రీ తన గర్భమందున్నటువంటి జీవులను జఠరాగ్ని యొక్క ఆధారముగా పోషిస్తూఉంటుంది. ఎందుకంటే ఆవిడ తినేటటువంటి ఆహారం చేతనే లోపల ఉన్నటువంటి శిశువులు పోషించబడతూ ఉంటాయి. అలాగే హిరణ్యగర్భుని యొక్క అగ్ని తత్వ ప్రభావం చేతనే ఆ లోపల ఉన్నటువంటి జీవులన్నీ పోషింపబడుతూ ఉంటాయి. సమస్త జీవులను తన లోపలికి ప్రళయకాలంలో సంగ్రహించి, వాటిని కొద్ది కాలం తన వద్దనే వుంచుకొని, తిరోధాన అనుగ్రహము అనేటటువంటి పద్ధతిగా వాటిని కొంతకాలం తనలో ఉంచుకొని, మరల సృష్టి ప్రారంభకాలంలో వాటిని యధాతథముగా ‘యుగవత్‘ సృష్టిగా విడుదల చేశాడు.
అంటే సృష్టి ద్వివిధంబులు. క్రమసృష్టి, యుగవత్ సృష్టి. యుగవత్ సృష్టి అనే దానికి నాంది పలుకుతున్నారు గర్భిణీ స్త్రీ అని చెప్పడం ద్వారా. అంటే అర్ధం ఏమిటి? అంటే మానవులు మానవులనే కంటున్నారు. ఏ జాతికి, ఏ రకమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు, ఆ రకమైన వారికే జన్మనిస్తున్నారు కదా! ఇది సృష్టి ధర్మం కదా! అట్లే 84 లక్షల జీవరాసులకు సంబంధించినటువంటి మూల స్థానములు, ఆధారబీజములు ఈ హిరణ్య గర్భ స్థానంలో ఉన్నాయి.
మరల పునః సృష్టి కాలంలో 84 లక్షల జీవరాసులు విడుదల చేయబడ్డాయి. అపుడేమైందట?- జీవరాసులంతా ఒకే సారి ఉద్భవించాయి. మీ డార్విన్ థీరీ ఇక్కడ పోయిందన్నమాట. అంటే క్రమశః అమీబా నుండి మానవుడు పుట్టి, వరుసగా అన్ని జన్మలు ఎత్తుకుంటూ, అన్ని జన్మలు పోగొట్టుకుంటూ ఎప్పటికో పరిణామ కాలంలో మానవుడు వచ్చాడు. పరిణామ కాలంలో కోతి నుండి మానవుడు వచ్చాడు. “అలా రాలేదు” అంటుంది బ్రహ్మాండ పురాణం. ఈ హిరణ్యగర్భుడు విడుదల చేసేటప్పుడు ఏక కాలంలో అందర్నీ విడుదల చేసాడు.
గర్భిణీ స్త్రీ ఎట్లా అయితే తన రూపము కలిగినటువంటి శిశువులను తానెలా కన్నదో, అట్లే ఆ దైవీ సృష్టి కూడా దైవీ మానవుడు కూడ అదే కాలంలో ఉద్భవించాడు. ఆ సృష్టి యొక్క ప్రారంభ దశనే హృద్దైవ (హృదయ) కాలమని అన్నారు. కాబట్టి అక్కడ ఉన్న మానవులంతా ఎవరు అంటే దైవీ మానవులు. అందరికీ దైవత్వం సాధ్యమై ఉన్నటువంటి వారు. అందరికీ తమ గర్భ స్థానము అయినటువంటి, తమ ఆధారమైన స్థానము అయినటువంటి హిరణ్మయకోశమే, హిరణ్యగర్భుడే, అక్షరుడే ఆధారమైనటువంటి వాడు.
ఆ అక్షర స్థితి తెలిసినటువంటి వారు. వారు క్షర పురుష స్థితికి పడిపోయినటువంటి మన లాంటి కలియుగ పురుషులు కాదు. ఈ కలియుగంలో శరీరం నేననేటటువంటి అభిమానబలం బలపడి పోవటం వలన, తాదాత్మ్యతా బలం బలపడిపోవటం వలన, కేవలం శరీర భావం మాత్రమే మిగిలి వుండటం వలన, క్షర పురుష స్థితికి దిగజారి పోయినటువంటి బౌద్ధిక మనస్తత్వము ఉండటం చేత వీళ్ళు క్రమానుగతిలో క్రింద నుండి పైకి తెలుసుకోవలసినటువంటి అగత్యం ఏర్పడి అక్షర పురుష స్థితికి ఎదగడానికి నానా తంటాలు పడుతువున్నారు. బ్రహ్మనిష్టులవడానికి, బ్రహ్మఙానం పొందడానికి జీవితకాలం సరిపోవడం లేదు.
కానీ సృష్టి యొక్క ఆరంభ దశ కాలంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మ జ్ఞానం తో ఉండటం చేత, వారి లక్ష్యం పరమాత్మే అయి ఉన్నది. కాబట్టి వేదములుద్భవించినటువంటి కాలంలో, అందరూ కూడ బ్రహ్మజ్ఞానులే. అందువలన వారి యొక్క లక్ష్యం ఏమిటంటే పరమాత్మ. వారి లక్ష్యం ఏమిటంటే బయలు. వారి లక్ష్యం ఏమిటంటే తత్ స్థితి. ఆ రకంగా వాళ్ళు ఎవరైతే నిర్ణయాత్మకంగా, పరమాత్మ స్థితిని లక్ష్యించినటువంటి వారు వున్నారో, జన్మరాహిత్య స్థితిని సాధించినటువంటి వారు వున్నారో. అందుకనే తత్త్వశాస్త్రములన్నీ కూడ పరబ్రహ్మ నిర్ణయాన్ని, తదుపరి జన్మ రాహిత్యాన్ని లక్ష్యించే విధానాన్నే బోధిస్తూఉన్నాయి. ఉపనిషత్తులుగాని, లేదా వేదాంత విద్య గాని, బ్రహ్మ సూత్రాలు గాని ఇవన్నీ కూడ బ్రహ్మనిష్ఠని బలపరచి, అక్కణ్ణించి పరిణామము చెందేటటువంటి, చిట్టచివరి దివ్య యానాన్ని అందించేటటువంటి మార్గ దర్శక సూత్రాలుగా మనకు అందించారు.
అందువలనే ఈ హిరణ్మయకోశము, ఈ హిరణ్య గర్భస్థితి దివ్య యానమునకు ఆధార భూతమైనటువంటి స్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పక హిరణ్య గర్భస్థితిని అందుకోవలసిన అవసరం ఉన్నది సాధకులందరికి కూడా. ఋషులైపోతారు అన్నమాట.. ఎవరైతే ఈ హిరణ్యగర్భస్థితిని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడ బ్రహ్మనిష్ఠులై మహర్షులౌతారు. ఎందువల్లంటే ఈ హిరణ్మయకోశమే సర్వసృష్టికి ఆధారభూతమైనటువంటి స్థితి.
ఇక్కణ్ణుండి ఏం చెబుతున్నారు?- యజ్ఞంలో అంటే ఋత్త్విక్కులు యజ్ఞం చేసేటప్పుడు అరణిని మధిస్తారు. అంటే మన అగ్గిపుల్లల అగ్గిపెట్టె ద్వారా వచ్చినటువంటి అగ్ని పనికి రాదు అన్నమాట. అది స్వాభావికమైనటువంటి సృష్టిలో అగ్ని ఎలా అయితే సాధ్యమై ఉన్నదో, దానిని స్వీకరించాలి అనేటటువంటి నియమం ఉందన్నమాట. అందువలన అరణిని మధిస్తూ ఉంటారు. ఎక్కడైనా యజ్ఞం చేసే చోట మొట్టమొదట అంకురారోహణ తరువాత అక్కడ అరణిని మధిస్తూ ఉంటారు. అరణి అంటే అర్ధం ఏమిటంటే రావి, జువ్వి అనేటటువంటి కఱ్ఱలుంటాయి. ఈ రావి, జువ్వి అనే కర్రలు ఒకదానిపై ఒకటి పెట్టి, వాటిని పైన పెట్టి, మధిస్తారన్నమాట.
ఆ పైనించి ఒక కఱ్ఱ ఉంటుంది, క్రింద ఒక కఱ్ఱ లో ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. దాంట్లో, వడ్రంగి బర్మా తిప్పినట్లుగా, అది బాగా బలవత్తరంగా తిప్పుతారు. ఆ రాపిడి వలన ఈ కఱ్ఱ కఱ్ఱ రాపిడి వలన, రెండు కఱ్ఱలలో కూడ ఆంతర్భూతమై ఉన్నటువంటి అగ్ని ఉత్పన్నమౌతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి అగ్నిని జాగ్రత్తగా ఆ దూది ద్వారా మండించి, ఆ దూది ద్వారా మండినటువంటి అగ్ని ని ఇతరితర హవ్య ద్రవ్యాలను మండింపచేసి, అట్టి అగ్నిని తీసుకు వచ్చి, యజ్ఞాన్ని ప్రారంభిస్తారు.
ఈ రకంగా ఋత్త్విక్కులు అరణి చేత మంధించబడినటువంటి అగ్నిని ఎలా అయితే వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇది ఎప్పటినుండీ ప్రారంభమైంది?- ఋగ్వేదకాలం నుండి ప్రారంభమైంది. కృతయుగ కాలం నుండి ఈ యజ్ఞ విధానం ప్రారంభమైంది. కాబట్టి అప్పటినుండి అనుచానంగా, సాంప్రదాయంగా, గురుశిష్య పారంపర్యంగా ఈ అరణి ద్వారా అగ్నిని మంధించేటటువంటి, అగ్ని ద్యోతక విధానాన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాము. ఏమిటి అసలీ అరణి? దీనిలో ఉన్న తాత్త్విక దృక్పథమేమిటి?- అంటే ఆ రెండు భాగములు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రింది భాగమేమో జీవాత్మ, పై భాగమేమో పరమాత్మ. పరమాత్మ యొక్క ప్రభావం చేత జీవాత్మ నడుపబడుచున్నది. పరమాత్మ- జీవాత్మ ఏదైతే ప్రత్యగాత్మ – పరమాత్మ వున్నాయో ఈ రెండింటి మధ్యలో అగ్ని ఉన్నది. అగ్ని చేతనే సర్వ సృష్టి పోషింపబడుచున్నది. సర్వ సృష్టి సృష్టించబడుచున్నది. సర్వ సృష్టి లయింపబడుచున్నది. పునః ప్రాదుర్భవించేది కూడ ఆ అగ్ని వలనే. కాబట్టి అట్టి అగ్ని స్థానమును, అట్టి అగ్ని యొక్క స్థితిని తెలుసుకోవలసినటువంటి అవకాశం అవసరం అందరికీ ఉన్నది. దీనికి అందుకంటే చయన విద్య, అగ్ని విద్య అని కొన్ని నామాంతరములు కూడ ఉన్నాయి.
సాధకుడు తన లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని మితాహారముతో పోషించుకోవాలి. అధికమైన ఆహారాన్ని తినకూడదు. ఎవరైతే అధికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారో, వారు శరీరభావాన్ని, శరీర తాదాత్మ్యతను సులభంగా పొందుతారు. కారణం భోజనం ఫుల్లుగా [full] తిన్న తరువాత నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర అనేటటువంటి మత్తు శరీరభావం చేతనే కలుగుతుంది. ప్రతిరోజు రాత్రి పూట పోయే నిద్ర కూడ శరీర తాదాత్మ్యతాప్రభావం చేతనే ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బ్రహ్మనిష్ఠులై ఉన్నారో, ఎవరైతే జీవన్ముక్తులై ఉన్నారో వారికి నిద్ర అనేది ఉండదు. వారు ఎపుడూ తురీయనిష్ఠలో ఉంటారు.
అట్టి తురీయనిష్ఠ యందు శరీరమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు ఉన్నప్పటికీ, తాను విలక్షణుడైఉండుటచేత, తాను సాక్షీ భూతుడై ఉండుటచేత, తాను సాక్షీ మాత్రుడై ఉండుటచేత, సదా హిరణ్మయకోశమందు రమించేటటువంటి లక్షణం కల్గి ఉండుట చేత, సదా అగ్ని దీప్తిని కలిగి యుండుట చేత, సదా స్వయం ప్రకాశాన్ని కల్గి ఉండుట చేత ఆ సుషుప్త్యావస్థ యొక్క చీకటిని, అజ్ఞానాంధకారాన్ని తాననుభవించడు. దీనికొక ఉపమానం ఉంది. ఎట్లా అంటే సూర్యునియందు చీకటి ఉండే అవకాశం ఉందా? అంటే ప్రళయకాలంలో తప్ప సూర్యుని యందు చీకటి ఏర్పడదు.- విద్యా సాగర్ గారు