తపస్సు అంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాల్లో చేరాలి అని కాదు. భగవంతుని కోసం నిరంతరం తపించటాన్నే ‘తపస్సు’ అంటారు. మనోవాక్కాయకర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు. నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు. ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్ధిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు. అట్లా తపస్సు చేయటం వలన మల విక్షేప ఆవరణలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి. శ్రవణం చేత మల దోషం, మననం చేత విక్షేప దోషం మరియు నిరంతర ధ్యానమనే నిధిధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. ఈ విధంగా మనస్సుని శుద్ధి చేసుకున్న వారికి పాపాలు క్షీణిస్తాయి. వసనాక్షయం జరుగుతుంది. పూర్వ జన్మ వాసనలు క్రమేపి తోలగుతాయి. ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన రూపం మనస్సుకు చేకూరుతుంది. శారీరకమైన ఆవేదనల్ని, ఇంద్రియలోలత్వాన్ని బుద్దిపుర్వకంగా నిగ్రహించుకోవటం వలన మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కాన శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి.
ప్రతి మానవుడు తానూ జీవించే విధానంలో, తన పరిసరాల్లో ఆ వాతావరణంను పెంపొందించుకోవాలి. తన ఇల్లే తనకు, తపస్సుకు కూడ అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి. మొదట తానూ మారాలి? ఎందుకు? ఎందుకంటే నిత్యమైన, శాశ్వతమైన దానిని తెలుసుకున్నాము మరియు జీవిత లక్ష్యము తెలుసుకున్నాము, అదియే మోక్షము. ఆ మోక్ష సాధన కోసం మారాలి. మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు ,ఉద్దేశించాడు) ఏర్పరచినాడు. మానవుడు దాన్ని మరచిపోయి జీవిస్తున్నాడు. అట్లా కాకుండా మానవుడు త్రికరణ శుద్దిగా తపస్సంపన్నుడు కావాలి.
మోక్షం అంటే మనస్సుని, శరీరాన్ని అత్మనుంచి శరీరం ఉండగానే, చైతన్యం ఉండగానే వేర్పాటు చేయడం అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమే కాని మరొకటి కాదు. అదే మోక్షం. ఆత్మానుభూతి, ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా వాళ్లవాల్లకు తగిన అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది. ఆత్మ అనే భగవంతునితో అనుసంధానమై అత్మసాధన కొనసాగిస్తూ జీవించటం నేర్చుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధాశక్తులు కలిగిన ప్రతివాళ్ళు దీన్ని అనుభూతి పొందుతారు. ఆ నమ్మకంతో, ఆ పట్టుదలతో, నిరంతర తపనతో, ఆత్మ జ్ఞానంకోసం నిరంతరం ఆత్మ మార్గంలో సాధన చెయ్యాలి.
తపస్సుల గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం :
- ఢంభము అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు ఐనవారు, శాస్త్రవిరుద్దముగా మనఃసంకల్పితమైన ఘోరతపస్సులు చేయుదురు. (17:5)
- దేవతలను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు అని చెప్పబడును. (17:14)
- ఉద్రేకము కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును కలుగాచేయునది, యదార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము మొదలగునవి యన్నియును వాచిక తపస్సుగ చెప్పబడుచున్నవి. (17:15)
- మానసిక ప్రశాంతత, శాంతస్వభావము, భగవచ్చింతన ,మనోనిగ్రహము, అంతఃకరణశుద్ది మొదలగునవి మానసిక తపస్సులుగా చెప్పబడుచున్నవి. (17:16)
- శారీరక, వాచిక, మానసిక తపస్సులకు ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినపుడు వాటిని సాత్విక తపస్సులు అని చెప్పబడును. (17:17)
- ఇతరుల నుండి సత్కారములను, గౌరములను, పూజలను అందు కొనుటకు, స్వార్ధ ప్రయోజనముల కొరకును, ఢంభముతో చేయబడునవియు, అనిశ్చితఫలములనుగాని, క్షణికఫలములను గాని ఇచ్చునవియు ఐన తపస్సులను రాజస తపస్సులు అందురు. (17:18)
- మొండిపట్టుదలతో మనోవాక్కయములకు బాధకలిగించునవియు, ఇతరులకు కీడు కల్గించుటకై చేయబడునవియు, ఐన తపస్సులను తామసమని అందురు. (17:19)
ఓం నమో పరమాత్మయే నమః