పదోతరగతితో పోస్టల్ కొలువు
పోస్టుమెన్ 132, మెయిల్ గార్డు 4 ఖాళీలు
ప్రభుత్వోద్యోగం చాలామంది కల. అందులోనూ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మరీ ఆకర్షణ. ఆ కలను కేవలం టెన్త్ అర్హతతోనే సాకారం చేసుకునే అవకాశం వచ్చింది. పోస్టల్శాఖ నుంచి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. రాత పరీక్షలో ప్రతిభను ప్రదర్శిస్తే ఆశించిన ఉద్యోగాన్ని అందుకోవచ్చు.
పదితోనే పదిలమైన కెరియర్కు బాటలు వేస్తోంది తపాలాశాఖ. కొత్తగా అమల్లోకి వచ్చిన వేతన నిబంధనల ప్రకారం పోస్టుమెన్, మెయిల్ గార్డు ఉద్యోగాలకు రూ. 21,700 మూలవేతనం లభిస్తుంది. దీనికి అదనంగా కరవుభత్యం, ఇంటిఅద్దె భత్యం... మొదలైనవన్నీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. కాబట్టి ఎలాంటి చిన్న గ్రామంలో పోస్టింగ్ వచ్చినప్పటికీ ప్రతి నెలా పాతికవేల రూపాయల వేతనం కచ్చితంగా పొందగలరు. అన్నింటికంటే ముఖ్యంగా ఒత్తిడి, పనివేళలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అనుభవంతో శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. ఖాళీలను రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా భర్తీచేస్తారు. ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి.
అర్హత సాధించాలంటే!
పార్ట్ ఎ, బిలు కలిపి ఓసీలైతే 10, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు 8 మార్కులు సాధించాలి. అలాగే పార్ట్ సిలో రెండు విభాగాలూ కలిపి ఓసీలైతే 10, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు 8 మార్కులు సాధించాలి. ఇలా విభాగాలవారీ మార్కులు సాధించడంతోపాటు మొత్తం ప్రశ్నపత్రం నుంచి ఓసీలు 40, ఓబీసీలు 37, ఎస్సీ, ఎస్టీలు 33 మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. అనంతరం అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు. ఎంపికైనవాళ్లు రెండేళ్లు ప్రొబేషన్లో కొనసాగుతారు. ఆ తర్వాత శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఉద్యోగంలోకి చేరిన మొదటి నెల నుంచే రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్సులూ కలిపి ప్రారంభం నుంచే దాదాపు రూ.25 వేలకు తగ్గకుండా వేతనంగా పొందవచ్చు.
ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు: 136 (పోస్టుమెన్-132, మెయిల్గార్డ్-04)
డివిజన్ల వారీ పోస్టుమెన్ ఖాళీలు: హైదరాబాద్ సిటీ-23, హైదరాబాద్ సౌత్ ఈస్ట్-30, సికింద్రాబాద్-15, సంగారెడ్డి-04, మెదక్-03, ఆదిలాబాద్-09, హన్మకొండ-07, కరీంనగర్-08, ఖమ్మం-11, మహబూబ్ నగర్-01, నల్గొండ-01, నిజామాబాద్-05, పెద్దపల్లి-06, సూర్యాపేట-04, వనపర్తి-01, వరంగల్-04.
డివిజన్లవారీ మెయిల్గార్డ్ ఖాళీలు: హైదరాబాద్ ఆర్ఎంఎస్ డివిజన్-04.
అర్హత: పోస్టుమెన్, మెయిల్ గార్డు రెండు పోస్టులకూ పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు.
వయసు: 21.04.2018 నాటికి 18 - 27 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తులు: ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి.
నియామకం: పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.వంద అభ్యర్థులందరూ చెల్లించాలి. పరీక్ష ఫీజు రూ.400. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
* ఆన్లైన్లో ప్రాథమిక వివరాల నమోదుకు చివరి తేది: 21.04.2018
* హెడ్ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించడానికి చివరి తేది: 25.04.2018
* ఆన్లైన్లో తుది దరఖాస్తుకు చివరి తేది: 28.04.2018
వెబ్సైట్: www.telanganapostalcircle.in/ www.indiapost.gov.in
పరీక్ష విధానం వంద మార్కులకు ఆప్టిట్యూడ్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. |