PATTUDALA MUNDU TALAVANCHINA PEEDARIKAM

1 view
Skip to first unread message

Govardhan Gajara

unread,
Mar 21, 2018, 3:46:08 AM3/21/18
to Muchivolu-all, Muchivolu-rss
పట్టుదల ముందు తలవంచిన పేదరికం 
టెట్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన నిరుపేద 
ప్రభుత్వ బడుల్లో చదువు, మధ్యాహ్న భోజనమే ఆధారం 
సీతానగరం మండలం వెలంపేటకు చెందిన సుబ్రహ్మణ్యం ఘనత 
సీతానగరం, న్యూస్‌టుడే: చిన్నప్పటి నుంచి కష్టాలతో సహజీవనం చేశాడు... ఆకలితో అలమటిస్తూ, ప్రభుత్వ బడుల్లోని మధ్యాహ్న భోజనంతో కడుపునిపుకునేవాడు. తండ్రి కాయకష్టం చేస్తే ఇల్లు గడవని పరిస్థితులను అధిగమించేందుకు తల్లి సైతం కూలి పనులకు వెళ్లాల్సిన దయనీయ స్థితిని కళ్లారా చూశాడు. పేదరికంపై విజయం సాధించాలని పట్టుపట్టాడు. ఆ దిశగా వేసిన అడుగుల్లో తొలి విజయం సాధించాడు. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో 141 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి తనను చిన్నప్పటి నుంచి వెంటాడుతన్న పేదరికానికి తొలి సవాల్‌ విసిరాడు సీతానగరం మండలంలోని వెలంపేటకు చెందిన యాండ్ర సుబ్రహ్మణ్యం. ఇతని తల్లిదండ్రులు యాండ్ర పుల్లారావు, అన్నవరం కూలి పనులు చేస్తూ కొడుకును ప్రభుత్వ బడిలో చదివించారు. పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజన పథకంతోనే కడుపు నింపుకొంటూ పట్టుదలతో చదదివాడు. సీతానగరంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశాడు. 2013-15లో రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఈ శిక్షణ పూర్తి చేసేందుకు, తండ్రి పుల్లారావు తెచ్చే కూలి డబ్బులు సరిపోకపోవడంతో, తల్లి వ్యవసాయ కూలీగా మారింది. డీఎడ్‌ అంటే తెలియని ఆ తల్లిదండ్రులకు ప్రస్తుతం టెట్‌లో సాధించిన రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకు వచ్చిందంటే అవునా... అన్నట్లు ఆ తల్లిదండ్రులు అమాయకంగా ప్రశ్నించారు.

ఇంటి వద్దే రేయింబవళ్లు చదువులు..! 
పోటీ పరీక్షలంటే కోచింగ్‌ సెంటర్లు, ప్రత్యేక గదుల మధ్య పుస్తకాలతో కుస్తీ పట్టడం సహజం. కానీ సుబ్రహ్మణ్యం మాత్రం ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. పుస్తకాలకు డబ్బులు లేని దుస్థితిలో తనకు తెలిసిన ఉపాధ్యాయుల నుంచి పుస్తకాలు సేకరించి నిరంతరాయంగా శ్రమించాడు. పగలు చెట్లకింద్ర, రాత్రివేళ విద్యుత్తు సరఫరా లేని సమయాల్లో కొవ్వొత్తి వెలుగుల్లో తన లక్ష్యసాధనకు కృషి చేశాడు. ఈ సందర్భంగా ఆయనను ‘న్యూస్‌టుడే’ పలకరించగా కాయకష్టం చేసి తనను చదివించిన తల్లిదండ్రుల శ్రమ వృథాకానీయనన్నాడు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే వారికి తెలియదన్నాడు. డీఎస్సీలోనూ విజయం సాధించి తల్లిదండ్రులను కంటికిరెప్పలా చూసుకుని, వారి రుణం తీర్చుకుంటానని తెలిపాడు.


Reply all
Reply to author
Forward
0 new messages