నాయనార్ల పరమ పావన గాధలు

925 views
Skip to first unread message

Subrahmanyam Gorthi

unread,
Nov 3, 2014, 11:49:04 PM11/3/14
to babasatsang
భగవాన్ శ్రీ రమణ మహర్షి - తమను 63 నాయనార్ల చరిత్రలు ఎంతగానో ఉత్తేజము, ప్రభావితము  చేసాయని చెప్తారు.

కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క నాయనారు సంగ్రహ చరిత్ర పోస్టు చేసుకుని, చదువుకోవడానికి ప్రయత్నిద్దాము.
మొదటగా ఈ రోజు శ్రీ తిరు నీలకంఠ నాయనార్ సంగ్రహ చరిత్ర:






Thiru_Neelakanta_Nayanar.jpg

Subrahmanyam Gorthi

unread,
Nov 4, 2014, 4:02:08 PM11/4/14
to babasatsang
ఇలయాన్‌కుడి మారనాయనార్







మూలము: http://www.telugubhakti.com/telugupages/Nayanars/Nayanars.htm

Subrahmanyam Gorthi

unread,
Nov 5, 2014, 1:56:56 PM11/5/14
to babasatsang
మయిపోరుల్ నాయనారు


Subrahmanyam Gorthi

unread,
Nov 6, 2014, 11:48:56 AM11/6/14
to babasatsang
విరాల్ మిండ నాయనారు




​​మూలము: http://www.telugubhakti.com/telugupages/Nayanars/Nayanars.htm

Subrahmanyam Gorthi

unread,
Nov 7, 2014, 2:56:44 PM11/7/14
to babasatsang
అమర్నీతి నాయనారు


అమర్నీతి నాయనారు చోళరాజ్యమున ప్రసిద్ధినందిన పజైయ్యరాయికి చెందిన వైశ్య కులజుడు. అ గ్రామం చాలా సారవంతమైనది. చుట్టూ తోటలతో లతలతో పచ్చగా శోభాయమానంగా ఒప్పుతూండేది. అమర్నీతి నాయనారు బంగారం, రత్నాలు, పట్టు వస్త్రముల వ్యాపారి. విదేశాలనుండి వస్తువులను తెప్పించి వ్యాపారం చేస్తుండేవాడు. ఆయన ఆర్జన ఎంతో నీతిమంతముగా ఉండేది. వ్యాపారం కలిసి రావడంతో మంచి ధనవంతుడయ్యాడు. వ్యాపారము చేస్తున్నా, ఇహలోక వ్యాపకాలున్నా, నాయనారు మనసు శివుని మీదే వుండేది. పరమశివ భక్తుడు. శివభక్తులను తన గృహమునకు పిలిచి వారిని అర్చించేవాడు. వారలకు కౌపీనము, దుస్తులు మొదలగునవి ఇచ్చి, షుష్టుగా భోజనము పెట్టి, ఏమైనా కానుకలు ఇచ్చి, వారు సంతసించునట్లుగా చేసి సాగనంపేవాడు.
 
పండుగలలో పబ్బాలలో తిరునల్లూరు దేవాలయమునకు దైవ దర్శనమునకు వెళ్లేవాడు. అక్కడ శివుని ముందు భావయుక్తంగా పంచాక్షరిని జపిస్తూ శివుని అర్చించేవాడు. కొన్నాళ్లకి పండుగలకు మాత్రమే తిరునల్లూరు దేవాలయమునకు వెళ్ళటంతో సంతృప్తినందక - ఆ వూరిలోనే నివసిస్తే - నిరంతరము శివ దర్శనము చేయవచ్చని, శివభక్తుల సేవకు వీలవుతుందని తలచి - తిరునల్లూరుకు తన బంధువులతో సహా వెళ్లి, అక్కడే స్థిరపడి - దైవదర్శనమునకు వచ్చెడి  శివభక్తులకు వుండుటకు వీలుగా ఒక మఠం కట్టించాడు. ప్రతి దినము వారిని తన ఇంటికి పిలిచి, వారలకు కౌపీనము మొదలగునవి ఇచ్చి సంతసింపజేసేవాడు.

నాయనారు భక్తితత్పరతకు పరమశివుడు పరవశించి పోయాడు. ముఖ్యముగా కౌపీనములను ఇచ్చుచుండుట, శివభక్తులయెడ వాత్సల్యము, ఔదార్యము శివుని ఆకర్షించినవి. అతని ఔదార్యాన్ని అందరిచేత ప్రశంసింపజేయాలని, అతనికి తన శుభాశీస్సులను ఇయ్యటానికి శివుడు నిశ్చయించాడు. అందుకని ఒకరోజున బ్రహ్మచారి వేషంతో జటతో, విభూతి పుండ్రములు, భుజం మీద దండంతో శివుడు
అమర్నీతి నాయనారు  మఠంకి విచ్చేశాడు. బ్రహ్మచారి దండానికి చివర 2 కౌపీనములు, విభూతిసంచి కట్టబడి వున్నాయి. ఆయన ముఖం తేజోవంతంగా ఉంది. కళ్లు ప్రకాశమానంగా వున్నాయి. ఠీవిగా మఠంలోకి ప్రవేశించాడు. అమర్నీతి నాయనారు పరమానందంతో అతిథిని ఆహ్వానించి అర్చించాడు. బ్రహ్మచారి - అమర్నీతి నాయనారుతో, "మీరు మహాత్ములు. ప్రతి ఒక్కరు మీ దానాలకి, ముఖ్యముగా కౌపీనముల దానాలకు మిమ్మలను అభినందిస్తున్నారు. మీ దర్శనానికి వచ్చాను." అని అన్నాడు. అమర్నీతి నాయనారు - బ్రహ్మాచారిని తన వద్దనుండి బిక్షను స్వీకరించవలసిందిగా అర్థించాడు. బ్రహ్మచారి ఒప్పుకొని, "నేను నదికెళ్లి స్నానము చేసి నిత్య కర్మానుష్టానము చేసి వస్తాను. వర్షము వస్తోంది. వర్షమునకు నా కౌపీనములు తడిసిపోయాయి. అందుకని ఈ పొడి కౌపీనమును జాగ్రత్త పరచండి. నేను వచ్చి తీసుకుంటాను. అది చాలా విలువైంది, ప్రత్యేకమైనది గూడ. అందుచే దానిని భద్రముగా ఉంచండి" అని చెప్పి స్నానానికి నదికి వెళ్లాడు.

బ్రహ్మచారి నదికి వె
ళ్లాడు. అమర్నీతి నాయనారు ఆ కౌపీనమును భద్రపరిచాడు. పరమశివుడు దానిని మాయం చేశాడు. బ్రహ్మచారి స్నానము చేసి వచ్చి, తన పొడి కౌపీనమును ఈయమని కోరాడు. తన రెండో కౌపీనము వానకు తడిసిపోంది. అందుకని పొడిదానిని అడిగాడు. అమర్నీతి నాయనారుకు  తాను భద్రపరచినచోట కౌపీనము కనిపించలేదు. అంతటా వెదికాడు. ఎక్కడా కనిపించలేదు. అందుకని వణుకుతూ బ్రహ్మచారికి ఇంకొక కౌపీనముతో నిలబడి పరిస్థితిని చెప్పాడు. బ్రహ్మచారి నాయనారు మాటలను అంగీకరించలేదు. వినలేదు. నాయనారు చాలాధనము దానికి బదులుగా యిస్తానన్నాడు. బ్రహ్మచారి, "ధనాన్ని నేనేమి చేసికొంటాను? అవసరం  లేదు, నా అవసరం కౌపీనము మాత్రమే" అన్నాడు. బ్రహ్మచారి ఇంకా ఇలా అన్నాడు. "మీకు కౌపీనము కనిపించనిచో, నా ఇంకో కౌపీనమునకు సరితూగే వేరొక కౌపీనమును ఈయండి" అన్నాడు. అమర్నీతి నాయనారుకు కొంచెం స్వస్థత కలిగింది. వెంటనే త్రాసును తెప్పించాడు. బ్రహ్మచారి కౌపీనమును ఒక తక్కెటలో ఉంచాడు. రెండో తక్కెటలో తాను ఇవ్వదలచిన కౌపీనమును పెట్టాడు. బ్రహ్మచారి కౌపీనమే ఎక్కువ బరువు చూపింది. అమర్నీతి నాయనారు ఏమిపెట్టినను బ్రహ్మచారి కౌపీనమే బరువుగా కనిపించింది. అమర్నీతి నాయనారుకు ఆశ్చర్యము కలిగింది. ఇదంతా శివలీలయని గ్రహించాడు. తన సంపద యావత్తు బ్రహ్మచారి కౌపీనమునకు సరితూగలేదు. పరమ శివుని కౌపీనము వేదమును తలపింపజేస్తుంది. దాని పోగులు శాస్త్రాలు.

అమర్నీతి నాయనారుకు ఏమీ పాలుపోలేదు. బ్రహ్మచారి కాళ్లమీద పడ్డాడు. "స్వామీ! నన్ను, నా భార్యను, నా పుత్రుని గూడ మీ కౌపీనమునకు సమమవుతాయేమో తూచండి" అని అర్థించాడు. బ్రహ్మచారి అందుకు అంగీకరించాడు. అమర్నీతి నాయనారు తన కుటుంబముతో సహా తక్కెటలో కూర్చుంటూ, "నేను శివభక్తులను భక్తితో, చిత్తశుద్ధితో, సేవించుచున్నట్లయితే, ఈ త్రాసు ఇప్పుడు సరితూగుగాక" అన్నాడు. త్రాసు ఆశ్చర్యకరంగా సరితూగింది. అమర్నీతి నాయనారు పుణ్యం బ్రహ్మచారి కౌపీనమూనకు తుల్యమయింది. అచ్చట చేరిన ప్రజలందరూ ఆశ్చర్య చకితులయ్యారు. వారు అమర్నీతి నాయనారు పాదములపైబడి ప్రశంసించారు. దేవతలు  ఆ  కుటుంబముపై పారిజాత సుమ వృష్టి కురిపించారు. బ్రహ్మచారి అంతర్థానమైనాడు. పార్వతీపరమేశ్వరులు వృషభ వాహనముపై ప్రత్యక్షమై, నాయనారును అనుగ్రహించారు. పరమేశ్వరుడుఅమర్నీతి నాయనారును ఉద్దేశించుచు, "నీ కౌపీన దాతృత్వము, శివభక్తుల నిరుపమాన సేవ మమ్మల్ని అలరించాయి. నీవు, నీ భార్య, నీ పుత్రుడు - ముగ్గురూ నా లోకంలో శాశ్వతంగా నివసించండి" అన్నారు. శివానుగ్రహం వల్ల తక్కెడ దివ్యవిమానంగా మారి, అమర్నీతి నాయనారును, అతని భార్యను, మఱియు అతని పుత్రుని శివలోకానికి చేర్చింది.
***


Subrahmanyam Gorthi

unread,
Nov 8, 2014, 1:28:11 PM11/8/14
to babasatsang
ఎరిపాత (భక్త) నాయనారు


చోళరాజ్యంలో ప్రధాన పట్టణమైన కరువూరులో ఎరిపాతనాయనారు జన్మించారు. అది చాలా పవిత్ర పుణ్యస్థలం. ఆ పట్టణము ప్రక్కనుంచి అంబరావతి నది పారుతూ వుంటుంది. ఆ నదికి యిరువైపులా ఋషులు తపస్సు చేస్తూ భక్తి తరంగాలను ప్రసరితం చేస్తూ వుంటారు. అచ్చట ప్రఖ్యాతి నొందిన పశుపతీశ్వరుని దేవాలయముంది. పశుపతీశుడు రాజుకు శాంతి సుఖ సంతోషాలనిచ్చే ఇష్టదైవము. ఎరిపాత నాయనారు పశుపతినాధుని అనుదినము గొల్చేవాడు. శివభక్తులకు సేవచేసి, వారికి రక్షకుడుగా ఉండుట ఆయన ధ్యేయము. ఒక గొడ్డలిని పుచ్చుకుని తిరిగేవాడు. శివభక్తులకెవరికైనా  హాని తలపెడితే భక్తులకు సహాయముగా గొడ్డలిని చూపి హానిచేయువారిని శిక్షించేవాడు. ఇది శివుని పని అనే భావనతో చేస్తుండేవాడు        
 
ఆ వూళ్లోనే శివకామి ఆండార్ అనే ఇంకో శివభక్తుడున్నాడు. శివుని నియమముతప్పక అర్చించేవాడు. ప్రాతఃకాలమున అనుష్టానములు అయన తర్వాత పూలను సేకరించడం, వానిని మాలలుగా గ్రుచ్చి దేవునికి సమర్పించడం అతని దైనందిన కార్యక్రమమయింది.

ఒక మహానవమి రోజూన అందరూ ఆనందోత్సాహితులై  యున్నప్పుడు శివకామి ఆండార్ ఎప్పటిలాగే పూలసజ్జ పుచ్చుకుని త్వరిత గతిని వెళ్తున్నాడు. ఆ క్షణంలోనే మావటివాళ్లు రాజగారి ఏనుగును నదిలో స్నానము చేయించి ఏనుగుతో తిరిగి వస్తున్నారు. దానిమీద ఇద్దరు మావటివాళ్లు ఉన్నారు. ముగ్గురు దానికి సహాయ రక్షకులుగా  ఉన్నారు. ఎందుకనో దానికి మదమెక్కి మనుష్యులను తరుముట మొదలుపెట్టింది. వాళ్లంతా ఇటూ అటూ పరుగిడ మొదలు పెట్టారు. ఆ ఏనుగు శివకామి ఆండార్  దెసకు పరుగెత్తి శివకామి ఆండార్‌ను చేతిలోని పూలబుట్టను అతని నుంచి లాక్కుని నేలమీద విసిరేసి వెళ్లిపోయింది. పూలన్నీ విరజిమ్మబడ్డాయి. శివకామి ఆండార్‌కు మతి తప్పింది. దేవుని అర్చనకై తాను సేకరించిన పూలన్నీ నేలపాలయ్యాయి. ఏనుగును తరిమాడు. తరుముతూ వయసు మళ్లినవాడు  అవడంవలన, అలసి నేలమీద పడ్డాడు. బిగ్గరగా ఏడ్చాడు. శివా శివా అని బాధతో అరిచాడు.

ఎరిపాతనాయనారు  ఆ బాటన పోతున్నాడు. శివకామి ఆండార్ దీనమైన ఆక్రందన అతనికి వినిపించింది. ఎరిపాతార్ - ఏనుగెక్కడ? అని ప్రశ్నించాడు. శివకామి ఆండార్ చూపిన దెసకు పరుగెత్తి, వీరభద్రావతారము దాల్చి, ఏనుగు మీద తన గొడ్డలిని విసిరి ఏనుగును చంపేశాడు. మావటివాళ్లు అతనిమీదకు దండెత్తగా, వాళ్లని గూడ అంతమెందించాడు.

ఏనుగు చంపబడిందన్న వార్త రాజుగారి చెవినపడింది. ఆయన వెంటనే సైనికులతో గుఱ్ఱం మీద వచ్చాడు. ఏనుగును ఎవరు చంపారో తెలియలేదు. అందుకని ఏనుగును ఎవరు  చంపారు? అని గట్టిగా అరిచాడు. కొందరు ఎరిపాతార్‌ను చూపారు. శివయోగి ఇంకను రౌద్రముగా యున్నాడు. శివయోగిని చూడగానే రాజుగారి కోపము చల్లారింది. ఇది ఒకవేళ శివయోగి పనయితే, దానికి తగిన కారణముంటుంది. బహుశా తనను తాను రక్షించుకొనుటకు ఈ పనిచేసి  వుండవచ్చును  అనుకున్నాడు. ఎరిపాత నాయనార్‌తో ఇట్లా అన్నాడు. "స్వామీ ఏనుగును మీరు చంపారని అనుకోలేదు. ఏనుగు, మావటివాండ్రు మీకు అపకారము చేసి వుంటారు. వారికి తగిన శిక్షను మీరు ఇచ్చారు." ఎరిపాతర్ జరిగినది చెప్పాడు.

"ఏనుగు, మావటివాండ్రు శివాపరాధమొనరించారు. అందుకు దానిని, వాళ్లను చంపాను" అన్నాడు. 'శివాపరాధం' అన్న మాట వినగానే రాజుగారి మనసులో వేదన కలిగింది. ఎరిపాతార్ కాళ్లమీద పడ్డాడు. "స్వామీ! వాళ్లు చేసిన అపరాధానికి మీరు విధించిన శిక్ష స్వల్పము. మీ పవిత్రమైన ఆయుధము (గొడ్డలి) తో నన్ను చంపవద్దు. ఇదిగో నా కత్తి. దీనితో నా తలను నరకండి" అని ప్రార్ధించాడు.

ఎరిపాతార్ ఆ మాటలు విని నిశ్చేష్టితుడయ్యాడు. తనుగూడ పశ్చాత్తాపమూతో  బాధపడ్డాడు. మహాపవిత్రుడైన రాజుగారికి నేనెంత వేదనను కలిగించాను? రాజు ఎంత ఉన్నతుడు? అనుకొని రాజుగారు తన్ను తాను అంతమొందించికొను నేమోయని రాజు వద్ద నుండి కత్తిని లాక్కున్నాడు. రాజుగారి దుస్థితికి  ఎరిపాతార్ తానే   కారణమని  తలచి, తనకు తానే శిక్ష విదించుకోదలచి, తన కంఠంను ఖండించుకోబోయాడు. రాజుగారు తన మూలాన ఇంకో ఘాతుకము జరగబోతూందని - ఎరిపాతార్ చేయిని, కత్తిని గట్టిగా పట్టుకొని కంఠం ఖండించుకోకుండా ఆపాడు.

పరమశివుని లీల పూర్తయింది. అశరీర వాక్కు వినిపించింది. "మహానుభావులారా! ఇదంతా పశుపతీశ్వరుని లీల. ప్రపంచమునకు ఈ భక్తుల మహాభక్తి తత్పరత తెలియ గలందులకు ఇది జరిగింది." తక్షణమే ఏనుగు, మావటివాళ్లు పునర్జీవితులయ్యారు. శివకామి ఆండార్ సజ్జ పూలతో నిండిపోయింది. అందరూ ఆశ్చర్యచకితులై పశుపతీశ్వరుని గొప్పతనాన్ని ఆనందంతో భక్తినిరతితో కీర్తించారు.

ఎరిపాతార్ ఖడ్గమును రాజుగారి పాదాలముందు పెట్టి సాష్టాంగపడ్డాడు. రాజుగారు కూడా ఎరిపాతార్ కాళ్లకు మ్రొక్కాడు. ఇద్దరు ఆనందంతో ఒకరి  నొకరు కౌగలించుకున్నారు. ఎరిపాతార్ రాజుగారిని ఏనుగునెక్కించి సాగనంపాడు. తన స్థానానికి తాను వెళ్లాడు. శివకామి ఆండార్ పూలసజ్జతో ఆలయంలోకి వెళ్లాడు.

ఎరిపాతార్ ఈవిధముగా శివ భక్తులను సేవిస్తూ అంత్యమున శివసాయుజ్యము పొందినాడు.
***

Subrahmanyam Gorthi

unread,
Nov 9, 2014, 2:14:14 PM11/9/14
to babasatsang
ఎనాది నాథనాయనారు


ఎనాది నాథనాయనారు గౌడ కులస్థుడు. చోళ సామ్రాజ్యంలో ఐనానూరులో జన్మించాడు. ఆవూరు అరిసోల్ నదీ ప్రవాహము ఒడ్డున కుంభకోణమునకు వాయువ్యదిశలో ఉంది. చాలా సారవంతమైన ప్రదేశము.

ఎనాదినాథర్ అచంచల శివభక్తుడు. శివభక్తిలో మాయిపోరూల్ నాయనారును మించిపోయాడు. శివ భక్తులనే కాదు, మనుజులు ఫాలమున విభూతిరేఖలు మూడు ధరించిన చాలు, వారిని ఎన్నోవిధాల గౌరవించేవాడు. అపరిమిత భక్తసేవా తత్పరుడు. అవసరమైతే తన ప్రాణాలనైనా త్యజించుటకు సిద్ధపడేవాడు. త్యజించాడు కూడా.

కత్తిసాములో ఎనాదినాథర్ సుప్రసిద్ధుడు. రాజకుమారులను ఖడ్గవిద్యలో ప్రవీణులుగా నొనరించేవాడు. ఈ విద్యకు గురువైనందుకు ఆదాయముకూడా వచ్చేది. ఆ వచ్చినదంతా శివభక్తుల సేవకై వెచ్చించేవాడు. ఈ విద్యలో అందరిచేత ప్రశంశలను అందుకున్నాడు. ఇది కొందరిలో అసూయ ద్వేషాలను రేకెత్తించింది.

అట్లా అసూయ, ద్వేషము పెంచుకున్నవారిలో అతిసూరన్ అనేవాడు ఒకడు. ఎనాదినాథర్ మీద కార్పణ్యము పెంచుకున్నాడు. అతనికి ఖడ్గవిద్య అంతగా రాదు. అతని పేరుకు ("అతిసూరన్" అంటే "మహా సూరుడు" అని అర్ధం) తగడు. అంత శరీర ధారుఢ్యము కూడా లేదు. కానీ, ఎనాది నాథర్‌తో పోరి జయించాలనుకున్నాడు. 

ఒక రోజున తన మనుషులు, బంధువులతో నాయనారు ఇంటిపై దండెత్తి, ఇంటి ముందు నిలబడి పోరుకు రమ్మని పిలిచాడు. నాయనారు పోటికి సిద్ధపడ్డాడు. అక్కడ నున్న పొద దగ్గర పోరాడుదాము, అక్కడికి నాయనారును రమ్మన్నాడు. అతిసూరన్ బంధువులంతా ఆ పొద చాటున దాగున్నారు. నాయనారు పొద దగ్గఱ పోటీకి సిద్ధమైనాడు. ఈ లోగా నాయనారు స్నేహితులు వచ్చి అతనికి రక్షణగా నిలిచారు. ఉభయులకు పెద్దపోరాటమే జరిగింది. చాలామంది నిహతులయ్యారు. అతిసూరన్ పారిపోయాడు.

మఱునాడు అతిసూరన్ మఱల సందేశము పంపాడు. "ఇతరుల సాయము లేకుండా పోరాడదాము. మన మూలాన్న ఇతరులు హతులవుతున్నారు. అందుకని ఒక ఏకాంత ప్రదేశమున మనమిద్దరమే బలాబలాలు తేల్చుకుందాము." అని కబురు పంపాడు.

ఎనాదినాథర్ ఒప్పుకున్నాడు. మఱునాడు ప్రొద్దున్నే అతిసూరన్ తన ఫాలభాగంమీద  3 విభూతి రేఖలు ఉంచుకుని, అవి కనబడకుండా కవచము అడ్డు పెట్టుకుని నాయనారుపై పోరుకు దిగాడు.

ఎనాదినాథర్ అతిసూరన్‌పై తన ఖడ్గాన్ని ప్రయోగించబోయాడు. ఆ క్షణమే అతిసూరన్ తన ముఖముపై ఉండే కవచాన్ని తొలగించాడు. నాయనారుకు అతిసూరన్ ఫాలముపై విభూతిరేఖలు కనిపించి, నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే ఖడ్గాన్ని క్రిందకు దించి, "అయ్యో ఎంత శివాపరాధము చేయబోయాను? అతను ఇప్పుడు శివభక్తుడైనాడు. అతనికి హాని చేయరాదు. నన్ను చంపాలన్న అభిలాషను అతిసూరన్ తీర్చుకోనీ" అని అనుకున్నాడు. అలా అనుకుని,తన చేతిలోని ఖడ్గాన్ని పారవేయబోయాడు. కానీ అంతలోనే, ఖడ్గాన్ని పారవేయాలి అన్న తన అలోచన మార్చుకుని - నేను ఖడ్గాన్ని పారవేస్తే నిరాయుధుణ్ణి చంపిన పాపము అతనికి అంటుకుంటుంది; శివభక్తునికి అటువంటి పాపము తగులనీయరాదు అనుకుంటూ ఉండగా అతిసూరన్ నాయనారును పొడిచి చంపేసాడు.

నాయనారు ఆత్మాహుతికి, మహాశివభక్తి తత్పరతకు, శివభక్తుల యెడ గౌరవము, అభినివేశము చూచి పరమేశ్వరుడు చలించిపోయాడు. ఎనాదినాథుని యెదుట ప్రత్యక్షమై, అతనిని తన లోకానికి తీసుకుని వెళ్లాడు.

Subrahmanyam Gorthi

unread,
Nov 10, 2014, 4:21:29 PM11/10/14
to babasatsang
ఇయర్‌పగై నాయనారు

"దాతయైనవాడు దారిద్ర్యమున నున్న
మానడు ఉపకరించు మార్గమతడు"
- కురాల్


దాతృత్వము విషయములో, 'ఇచ్చుటకు నాదగ్గర ఏమీ లేదు ' అన్న లేమిమాట ఉత్తములైనవారి వద్దనుండి  వినిపించదు అని కురాల్ చెబుతుంది. అటువంటి మహనీయులలో ఇయర్‌పగైనాయనారు ఒకరు. దాతృత్వము ఆయన నరనరాల్లో జీర్ణించుకు పోయింది. శివభక్తులను తన ఇంటికి పిలిచి, శ్రద్ధాభక్తులతో వారినర్చించి - వారు కోరినది తన దగ్గర ఉన్నది నంతోషముగా ఇచ్చెడివాడు. శివభక్తుడు అడిగినచో లేదనుమాట అతని నుండి వెలువడదు. వారి నంతోషమే పరమశివుని అనుగ్రహ విశేషమని తలచి, ఆప్రకారము నడచెడివాడు.

ఇయర్‌పగైనాయనారు కావేరీపూమ్ పట్టణ వాస్తవ్యుడు. వైశ్యకులజుడు. శివభక్తులందరూ ఆయనకు శివస్వరూపులే.

ఈ భక్తుని విషయమై పరమశివునికి సంతృప్తికలిగింది. ప్రపంచానికి ఇయర్ పగైర్ విశిష్టత తెలుపాలనుకున్నాడు. అందుకని ఒక బ్రాహ్మణ వేషములో త్రిపుండ్రములతో శైవాచార్యుడుగ నాయనారు ఇంటి ఎదుట నిలిచాడు. నాయనారు ఆయనను చూచి పరమానందముతో స్వాగతము చెప్పి, లోనికి గొనిపోయి, "ఊరకరారు
మహాత్ములు. మీరు వచ్చిన కారణము తెలుపగలరు!" అని నమ్రతతో బలికెను. బ్రాహ్మణుడు, "అయ్యా నీవు వున్న పదార్ధములతో అడిగినవారికి లేదనుకుండ ఇచ్చువాడవు. ఇది తెలిసికొని నిన్నొకటి కోరవచ్చితిని" అన్నాడు. నాయనారు విస్మయముతో, "సెలవిండు, తమరు ఏది కోరినను, నాదగ్గరున్నచో వెంటనే ఇచ్చెదను; కోరుకొనుడు" అనెను. బ్రాహ్మణుడు, "నీ భార్యను కోరివచ్చితిని" అని పలికాడు.

నాయనారు పరమశివుని మహాభక్తుడు. నాయనారుకు వచ్చినతని కోరిక మంచిదో చెడుదో అన్న ఆలోచన, తలంపు దరికి రానీయలేదు. శివభక్తుడు వచ్చాడు, అడిగాడు. అడిగినది తన దగ్గరున్నది ఇస్తానన్నాడు. అంతే, భక్తుని కోరికను తీర్చుటయే తన కర్తవ్యము. 'అటులనే ఇచ్చెదను' అని ఆ బ్రాహ్మణునికి మాటిచ్చి, ఈ సంగతి నాయనారు తన భార్య కెరింగించాడు. ఆమె ముందఱ నిశ్చేష్టురాలైంది. వెంటనే తేరుకొని, భర్త ఆఙ్ఞను పాటించుటే పతివ్రతా ధర్మమని - ఆ బ్రాహ్మణుని వెంట వెళ్లుటకు అంగీకరించింది. నాయనారు బయటకు వచ్చి, "నా దానమును పరిగ్రహించండి" అని ఆ బ్రాహ్మణుని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు నాయనారు యొక్క భార్య తరపు బంధువులు తననేమైనా జేయుదురేమోనని భయపడుచున్నట్లు నటించి - "మేము ఊరు దాటువరకు, మీ బంధువులు మమ్ములనుఅడ్డగించకుండ, నీవుకూడ నా వెంటరావలె"నని ఇయర్ పగైయారును కోరాడు. సరేనని బ్రాహ్మణుని కాపాడుటకు ఆ బ్రాహ్మణుడుతోను భార్యతోను కలిసి బయలుదేరాడు.

కొంత దూరము పోవుసరికి, ఆమె బంధువులు ఈ విషయమునుగూర్చి తెలుసుకుని, కోపోద్రిక్తులై బ్రాహ్మణుని చంపుటకు బయలుదేరారు. వచ్చి ఎదిరించారు. బ్రాహ్మణుడు భయపడ్డాడు. నాయనారు భార్య - "మీరు భయపడ వలదు - నాయనారు వారినందఱిని జయించును" అన్నది. బంధువులందఱు నాయనారుతో, "నీవు చేస్తున్నది, బ్రహ్మణుడు కోరినది మహా పాపము, అకృత్యము" అని వాదించారు. నాయనారు వినలేదు. అపకీర్తి, అపవాదులను భరించలేక ఆ బంధువులు, నీతో పోరాడుతాము, చావనైనా చస్తాము కానీ ఈ అపకీర్తి అపవాదులను భరించలేము" అనిచెప్పి పోరుకు సిద్ధమయారు. ఒక్క గడియలో నాయనారు బంధువులు చనిపోయారు. నాయనారు నిశ్చింతతో భార్యను, ఆగంతుకుని వెంట తీసికొని బయలు దేరాడు.

అలా కొంత దూరముపోగా, తిరుచ్చైకాడు దేవాలయము వచ్చింది. బ్రాహ్మణుడు  నాయనారును, "ఇంటికి తిరిగి వెళ్లుము" అని ఆదేశించాడు. నాయనారు  బ్రాహ్మణునకు నమస్కరించి వెనుదిరిగాడు.

ఇయర్ పగైయారు ఇంటిదెసగా కొంచెము దూరము వెళ్లాడోలేదో - బ్రాహ్మణుడు నాయనారును  బిగ్గఱగా పిలిచాడు. ఇంకెవరైనా అడ్డగించారేమో నని తలచి నాయనారు బ్రాహ్మణుడుదగ్గరకు వెంటనే వెళ్లాడు. అక్కడ నాయనారుకు ఆశ్చర్యకరముగ బ్రాహ్మణుడు అంతర్ధానమైనట్లు అనిపించింది. భార్య ఒక్కతే అక్కడ నిలుచుని వుంది. ఇంతలో పార్వతీపరమేశ్వరులు ఆకాశమున కనబడి, "మీ భక్తి తత్పరతకు ముగ్ధులమైనాము. భక్తులయెడ మీ సేవ అమోఘము. మీ ఇద్దరు కైలాసమునకు రండి" అని ఆహ్వానించారు. పార్వతీపరమేశ్వరులు అంతర్ధానమయ్యారు. నాయనారు తన భార్యతో కైలాసానికి చేరాడు. బంధువులుగూడ శివుని చూచిన విశేషమున వారు గూడ శివసాయిజ్యమందినారు. శివుని మీద పరాభక్తి సాకులను వెదుకదు. ధర్మాన్ని ఉల్లంఘింప జేయుదు. శివునికి శివభక్తులకు జోహార్లు.
***


మూలము: http://www.telugubhakti.com/telugupages/Nayanars/Nayanars.htm

Subrahmanyam Gorthi

unread,
Nov 11, 2014, 1:11:15 PM11/11/14
to babasatsang
కన్నప్ప నాయనారు

పోతప్పినాడు అనే రాజ్యంలో, ఉడుప్పూర్ గ్రామములో నాగడు అను ఒక బోయరాజు ఉండేవాడు. అతని భార్య పేరు దత్త. భార్యాభర్తలిద్దఱు సుబ్రహ్మణ్యస్వామి భక్తులు. స్వామి దయ వలన చాల కాలమునకు వారికి ఒక పుత్రుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బాలునకు "తిన్నడు" అని నామకరణము చేశారు.

శ్రీ కాళహస్తీశ్వర పురాణముననుసరించి తిన్నడు పూర్వజన్మములో అర్జునుడు. శివుని గూర్చి తపము చేసి, పాశుపతాస్త్రమును పొందినాడు. కానీ అప్పుడు పరమేశ్వరుడు బోయవానిగ అర్జునుని ముందరకు వచ్చినప్పుడు, అర్జునుడు శివుని గుర్తించలేకపోయాడు. ఆ కారణముచే, మరుజన్మలో అర్జునుడు బోయవాడుగా (తిన్నడుగా) జన్మించి, ఆ రూపంలో శివుని మెప్పించి, శివ సాయుజ్యాన్ని పొందాడు. 

నాగడు తిన్ననికి బోయలకు వలయు సకల విద్యలను నేర్పించినాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. చిన్నవాడుగా వుండగానే నాగడు తిన్నని రాజ్యాభిషిక్తుడుగా చేశాడు. బోయవాడుగా తన కులధర్మమును అనుసరించి వేటాడినా - తిన్ననికి అన్ని జీవులయెడల - వాత్సల్యము, ప్రేమాభిమానములు అభివృద్ధి నొందాయి. జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రుగ్మతతో ఉన్న జంతువులని వేటాడేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించాడు.  

ఒక రోజున తిన్నడు వేటకు వెళ్లాడు. ఒక సూకరము (అడవిపంది) అతని వలనుంచి తప్పించుకొని పారిపోజూచింది. తన అనుయాయులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్లాడు. సూకరమునకు అలసట వచ్చింది. ఒక చెట్టు ముందర ఆగింది. తిన్నడు దానిని చంపాడు. ఆ ముగ్గురూ అలిసిపోయారు. దప్పికైంది. పందిని మోసుకొని స్వర్ణముఖీ నదీ తీరానికి చేరారు. కాళహస్తి పర్వతము, దేవాలయము కనిపించాయి. తిన్నడు ఆ పర్వతమెక్కి - ఆ దేవాలయమును చూడదలచాడు. "అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు - కుడుము దేవారు (అంటే పిలక ఉన్న దేవుడు)" అని నాముడు తిన్నడికి చెప్పాడు. కాముడు పందిని పచనము చేయ మొదలుపెట్టాడు. 

తిన్నడు ఆ పర్వతము ఎక్కడం ప్రారంభించాడు. ఆ పర్వతమెక్కుతుంటే, తిన్ననిలో మార్పు కానవచ్చింది. అది పూర్వ జన్మసంస్కార ఫలము. తనమీదనుంచి బరువు ఏదో తగ్గుతున్నట్లు నిపించింది. దేహ స్పృహకూడా మందగించింది. అక్కడి శివలింగమును చూడగానే, దానిమీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కౌగలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద భాష్పాలు రాలటంతో, శివునితో, "ఈశ్వరా! ఈ దట్టమైన అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా వున్నావు? నీకు ఆహరము ఎలా లభిస్తోంది? ఇప్పటినుండి నేనూ నీతోనే వుంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లున్నది. నేను ఆహారము తీసుకుని వస్తాను" అని పలికి, శివుని ఆకలిదీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు పచనము చేసిన పంది మాంసమును, తిన్నడు రుచి చూచి, అందులోనుండి, రుచిగా ఉన్నదానిని శివునికోసం వేరుగా ప్రక్కన ఉంచాడు. నాముడు తిన్నడితో, "ఈశ్వరునకు ఆహారమూ సమర్పించే ముందు, ప్రతిదినము నీటితో అభిషేకింపబడుతాడని, పూలతో పూజింపబడతాడని" చెప్పాడు. తిన్నడు అది విని, నదివద్దకు వెళ్ళి, నోటినిండా నీళ్లను పుక్కిలి బట్టి, తను సేకరించిన పూలను తలమీద వుంచుకొని, పచనము చేసిన మాంసమును చేతిలో ఉంచుకొని, విల్లు అంబులతో, తిన్నగా గుడికి వెళ్లాడు. అక్కడ, పుక్కిలిట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి అభిషేకమయింది. తన తల మీదవున్న పూలతో శివుని అలంకరించాడు. అదే శివునికి అర్చన అయింది. తర్వాత, తాను తెచ్చిన పందిమాంసమును దేవుని ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయింది. ఆ గుడి ద్వారము వద్ద, ఎవరిని, ఏ జంతువులను రానీకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయము, మరలా ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు.

తిన్నడి ప్రవర్తన చూచి, నాముడికి, కాముడికి మతిపోయింది. తిన్నడులో వచ్చిన మార్పును మతిభ్రమణమేమోనని భావించి, వారు వెంటనే వెళ్ళి, తిన్నడి తల్లితండ్రులకు జరిగిన విషయాలు వివరించి చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసికొని పోజూచారు. తిన్నడు తాను శివుని దగ్గరే వుంటాను అని వెళ్ళలేదు. 

తిన్నడు దేవునికి ఆహారము సేకరించటానికి వెళ్ళగా, ఆ సమయంలో, ఆలయ అర్చకుడు శివగోచారి, శివునికి ప్రతీరోజులానే అర్చన చేయడానికి వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రము చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆగమ శాస్త్రములో ఆ అర్చకుడు నిష్ణాతుడు. అందుకని అక్కడ వున్న మాంసము మొదలగువానిని తొలగించి మంత్ర యుక్తముగా సంప్రోక్షణ గావించి, మళ్ళీ స్నానము చేసి, మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖీ జలముతో అభిషేకము చేసి, పూలతోనలంకరించి, విభూతినలిమి, తెచ్చిన పళ్లు మధుర పదార్ధములతో నివేదన గావించి వెళ్ళాడు.

పూజారి వెళ్ళగానే, తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకు వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజాద్రవ్యమూలను తీసివేసి, తనదైన పద్ధతిలో పూజచేశాడు. ఈ విధంగా ఐదు రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖిస్తూ పరమశివుని ప్రార్ధించాడు. "ఈ ఘోర కలిని ఆపండి" అని ఎలిగెత్తి ప్రార్ధించాడు. శివుడు శివగోచారికి తిన్నడి భక్తి ప్రపత్తులను చూపించ దలచాడు. అర్చకునకు కలలో కనిపించి, "నీవు లింగము వెనుక దాగియుండు. బయటకు రాక, అక్కడ ఏమి జరుగుచున్నదో గమనించుము" అని ఆదేశించాడు.

ఆఱవ రోజున యథావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తుండగా దారిలో తిన్ననికి కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. శివునకు ఏదో ఆపద సంభవించిందేమోనని శంకించాడు. గుడికి పరుగెత్తుకుని వెళ్లాడు. వెళ్లి చూడగానే - శివుని  కుడికన్ను నుండి రక్తము బయటకి వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలోనుండి క్రింద పడిపోయాయి. బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పనిచేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు. కాని రక్తము ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. "కన్నుకు కన్ను" అను సిద్ధాంతము మనస్సులో స్ఫురించింది. వెంటనే బాణంతో తన కుడి కన్నును పెకలించి శివునికి పెట్టాడు. రక్తమాగిపోయింది. సంతోషించాడు. నృత్యము చేశాడు. నృత్యము చేస్తుండగా - ఇప్పుడు శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం గమనించాడు. భయము లేదు, మందు తెలిసిందిగా, కాని ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను గూడ తీసిన తరువాత, శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించడం ఎలా? అందుకని, గుర్తుకోసం, తన పాదాన్ని శివుని ఎమ కంటిపై బెట్టి, తన ఎడమ కన్నును పెకలించుకోబోయాడు.

​పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయి, తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు. "నిలువుము కన్నప్పా! కన్నప్పా! నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరతిశయ భక్తిని మునుపెన్నడు చూచి ఎరుగను. పంచాగ్నుల మధ్య నిలిచి తపమొనర్చిన మునుల ఆంతర్యముకన్న నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణానందము కలిగించినది నీవొక్కడివే కన్నప్పా!" అని ప్రశంసించాడు.

పరమేశ్వరుడు, "కన్నప్పా" అని మూడు మారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమూను మూడింతలుగా పొందాడన్నమాట. తన కన్నును ఈశ్వరునికి అర్పించినందులకు, తిన్నడు "కన్నప్ప" అయ్యాడు. కన్నప్ప నాయనారు అయ్యాడు. నేత్రేశనాయనారు అనునది సంస్కృత నామము.

శివుడు తన రెండు చేతులతో కన్నప్పను దగ్గరకు తీసికొని, తన అక్కున చేర్చుకున్నాడు. కన్నప్పకు మరలా ఇంతకు ముందులానే చూపు వచ్చింది. కన్నప్ప అప్పటినుండి, సాక్షాత్తూ శివ స్వరూపుడై జీవించాడు. శివగోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది.

ఈ కథలో ఒక దివ్యార్ధముకూడా దాగి ఉన్నది. కన్నప్పన్నాయనారు అన్ని దోషములను జయించగలిగాడు. కానీ అహంకారము మాత్రము ఇంకా మిగిలివుంది. అది గూడ తొలగిపోవాలి. అడవిపంది ఈ విషయాన్ని చూపుతుంది. ఆ పందిని తరిమి తరిమి వేటాడాడు. చంపగలిగాడు. అది చంపబడగానే అతనిలోని అహం నశించింది. తిన్ననిలో నిరతిశయ భక్తి పుంజుకుంది. దాన్ని వేటాడేటప్పుడు మంచి, చెడు అతనితోనే ఉన్నాయి. నాముడు - దేవుడుగూర్చి అభిషేకము, పూజ, నివేదనము మొదలగునవి తిన్ననికి చెప్పాడు. నాముడు - మంచికి ప్రతీక. కాముడు (చెడు) వెనకనుండి పోయాడు. మంచి సంస్కారాలతో కన్నప్ప శివుని దగ్గఱకు వెళ్లాడు. దేవుని చేరాలన్నచో తనొక్కడే ప్రయత్నించాలి. అందుకు శివుని పూజకు తనొక్కడే వెళ్ళాడు. నాముడు, కాముడు అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లారు. నాయనారు తల్లిదండ్రులు అంతర్లీనంగా దాగియున్న భవ బంధాలు. తిన్నని ఆపటానికి ప్రయత్నించారు. తిన్నడు ఆ భవ బంధములనుండి కూడా వైదొలగి, ఒక్కడుగా ఉండిపోయాడు. పరమశివుడు తన (లింగం) వెనుక పూజారిని దాగి యుండమన్నాడు. భక్తుడైన తిన్నడు పరమశివుని ముందర ఉన్నాడు. అంటే భక్తి - క్రియాకలాపాల కన్న మిన్న. తన కళ్ళని పెకలించి శివునికిచ్చుటలో, తిన్నని సంపూర్ణ శరణాగతి, ఆత్మ నివేదన గోచరిస్తుంది. అంతకన్న అనితరమైన భక్తి తత్పరత కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింప చేస్తుంది. చేయగలదు.


Subrahmanyam Gorthi

unread,
Nov 12, 2014, 1:48:14 PM11/12/14
to babasatsang
గుగ్గులు కలశ నాయనారు

చోళదేశమున తిరుక్కడవూరులో గుగ్గులు కలశ నాయనారు జన్మించాడు. ఆయన బ్రాహ్మణుడు. అచ్చట ఈశ్వరుని పేరు అమృతఘటేశ్వరుడు. దేవతలు, అసురులు అమృత కలశంతో ఆ ఊరు వచ్చారు. వారు ముదుగా స్నానము చేయుదము అనుకొన్నారు. ఆ కలశాన్ని నేలపై ఉంచి, నదికి స్నానమునకు వెళ్ళారు. వారు తిరిగి వచ్చి ఆ కలశమును తీసుకొందామంటే, నేలనుంచి అది పైకి రాలేదు. ఆ కలశం లింగంగా మారింది. అందుకని ఆ లింగాన్ని అమృత లింగం అంటారు. మార్కండేయుడు ఈ లింగము వద్దనే తపస్సుచేసి, తన 16వ ఏట అమరుడైయ్యాడు. ఇక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మన్. అభిరామ పట్టార్ అను భక్తుని ఎడల ఆ అమ్మవారు విశేషమైన అనుగ్రహాని వర్షించారు. రాజుగారి ఆగ్రహము నుండి అతనిని తప్పించుటకు ఈమె అమావాస్యను పౌర్ణమిగా మార్చింది.

గుగ్గులు కలశ నాయనారు ఈ ఆలయమున శివునికి ప్రతిదినము గుగ్గిలముతో ధూపము వేయుచు పూజ చేసేవాడు. ఈ కారణముచే అతనికి గుగ్గులు కలశ నాయనారు అను పేరు వచ్చింది. గుగ్గిలముతో శివునికి ధూపమును సమర్పించుట గొప్ప సేవగా భావించాడు. అందువలన, చేతిలో ఒక చిన్నకుంపటి, అగ్ని, గుగ్గిలము పుచ్చుకొని నిరంతరము శివునికి గుగ్గిలము ధూపము వేయుచు అర్చిస్తూ గడిపేవాడు.

ఈ భక్తుని సేవా విశేషము, అతని శివార్చన తపన పరమశివుని పరవశింప జేశాయి. అతని పరమ భక్తి విశేషాలు ప్రపంచానికి చూప నిశ్చయించాడు.

శివుని సంకల్పమున, నాయనారు కటిక పేదవాడయ్యాడు. ఆస్తి అంతా అమ్ముకోవలసి వచ్చింది. కుటుంబము పస్తుంటున్నది. అయినా నాయనారు తన గుగ్గిలం సేవలు మానలేదు. ఒక రోజున భార్య ఇలా అనుకుంది - "ఉన్న అన్నింటినీ అమ్మివేసుకున్నాము. ప్రతి స్త్రీ భర్త చనిపోవునంత వరకు అట్టేపెట్టుకోవలసిన మంగళ సూత్రము మాత్రము మిగిలి ఉంది. భర్త పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు." ఇలా ఆలోచించి, మెడలో  పుస్తెలకు బదులుగా పసుపు కొమ్ము ఉంచుకొని, తన బంగారు మాంగల్యమును భర్తకు
తీసి యిచ్చి - "దీనిని అమ్మి, ధాన్యము తీసికొని రండి" అని భర్తను ప్రార్ధించింది. అతడు అది పుచ్చుకొని అంగడికి బయలు దేరాడు. బజారునకు పోవుచుండగా ఒక వర్తకుడు గుగ్గిలము మూటలను భుజముల మీద నుంచుకొని విక్రయించుటకు ఎదురు వచ్చుచుండుట చూచి, నాయనారు - "ధాన్యము కొనుటకంటే దేవునిచేవకు ఉపయోగపడు గుగ్గిలము కొనుట చాలా మంచిది" అని, మంగళసూత్రమును అతనికిచ్చి, వర్తకునినుండి గుగ్గిలము మూటలను కొని, వాటిని ఆలయమునకు తీసికొని వెళ్లి, యథారీతిన గుగ్గిలము ధూపముతో తపోమగ్నుడయ్యాడు. 
 
క్షుద్భాధ తట్టుకోలేక నాయనారు యొక్క పిల్లలు అలసి పడుకున్నారు. ఝాము రాత్రి గడచినా భర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అప్పుడు నాయనారు భార్య దైవమును ప్రార్థింప మొదలిడింది. "తనకు అతి పవిత్రమైన మాంగల్యమును కూడా తన భర్త పిల్లల ఆహారము కొఱకు, పసుపుకొమ్ముతో సరిపెట్టుకొని ఇచ్చాను. అయినప్పటికీ, ఓ పరమేశ్వరా, ఇలా జరుగుతున్నదేమి?" అని ప్రార్థించింది. అమె ప్రార్థనకు, నాయనారు భగవత్‌ సేవ నిష్ఠకు, వారి మంచితనము, పవిత్రతకు పరమేశ్వరుడు చాలా సంతుష్టి చెందాడు. 

కురాల్‌లో: "పతిని దైవముగను వ్రతమున్న ఇల్లాలు - కురియుమన్న క్షణమె కురియువాన" అని కీర్తింపబడినయున్నది.

ఆమె కలలో శివుడు కనపడి, "నీకు సకల సౌభాగ్యాలు ఇస్తున్నాను" అన్నాడు. ఆమె మేల్కొనగానే ఆమె చకితురాలగునట్లుగా - వారి గృహము సకల సంపదలతో నిండిపోయింది. వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుని స్థుతించింది. ఆయనపై పాటలు పాడింది. మహానంద భరితురాలై వెంటనే వంట చేసి, తన బిడ్డలకు అన్నము పెట్టి, భర్త రాకకై వేచి ఉంది.

అక్కడ ఆలయములో, ఈశ్వరుడు నాయనారును "ఆకలిగొని యున్నావు, ఇంటికి పోయి భుజింపుము" అని ఆదేశించాడు. ఇంటికి పోగా అతనికి ఆశ్చర్యమైంది. "ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది?" అని భార్యనడిగాడు. అమె జరిగినదంతా చెప్పింది. అంతటి శివానుగ్రహమునకు, అక్కడకు చేరిన శివభక్తులతో కలిసి శివుని భహుధా కీర్తించాడు. నాయనారు ఈ సంపదను తనదిగా భావించలేక పోయాడు. "ఇదంతా శివునిది - దీనిని శివభక్తులకే వినియోగించాలి" అని అంటూ - వాని నిరంతర సేవ కొనసాగించాడు.

ఒక రోజున నాయనారు తిరుప్పనందాళ్ దేవాలయము సందర్శించుకుందామనుకున్నాడు. అరుణ సతీశుని దేవాలయము అక్కడ వున్నది. ఒక రాక్షసుని కుమార్తె తాటక, పుత్రునికై అచ్చట శివలింగాన్ని రోజూ అర్చించేది. ఒక రోజున ఆ లింగమును పుష్పహారముతో అలంకరిద్దామని పూలదండను ఎత్తి పట్టుకోబోయింది. ఆమె వస్త్రము నడుము నుంచి జారబోయింది. వస్త్రమును రెండు మోచేతులతో అదిమి పెట్టింది. అందుకని ఆమె చేతులు ఎత్తలేకపోయింది. ఆమెకు కలిగిన అసౌకర్యమును తొలగించుటకు, శివుడు ఒక ప్రక్కకు ఒరిగి (ఒంగి), ఆమె దండను స్వీకరించాడు. అప్పటినుండీ ఆ లింగము అట్లానే ఒరిగి ఉండిపోయింది. చాలామంది ఆ లింగమును సరిచేయ ప్రయత్నించారు. కానీ వీలుకాలేదు. రాజుగారు ఆ వంపుకు మోకులు తాళ్ళు కట్టించి, ఏనుగులతో లాగించారు. ప్రయోజనము కలుగలేదు. రాజుగారికి ఇక ఏమి చేయాలో పాలుపోలేదు.

ఈ సంగతి గుగ్గులు కలశ నాయనారుకు తెలిసింది. అచ్చటికి వెళ్ళి, "నేనుకూడా కొంచెము ప్రయత్నించెదను" అని, ఆ శివలింగము వంపును తాడుతో బిగించి, ఆ తాడు కొసను తన మెడకు కట్టుకుని, శివధ్యానము చేస్తూ లాగాడు. అలా చేసిన తోడనే, లింగము వంపు సరి అయ్యి యధాస్థితికి వచ్చింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు.

రాజు దానిని చూచి, "ఈతడు భక్తి అనే త్రాడుతో ఇట్లు చేయగలిగాడు" అని అర్ధమై, నాయనారును ఎంతగానో గౌరవించి, అనేక విధముల కీర్తించాడు. నాయనారు భక్తి ప్రపత్తులు అంతటా వెల్లడయ్యాయి.

కొన్ని దినములకు, వాగేశ నాయనారు, జ్ఞాన సంబంధ నాయనారు అచటికి వచ్చారు. గుగ్గులు కలశ నాయనారు వారిద్దరినీ అనేక విధముల సేవించి, జీవించియున్నంత కాలము శివసేవలో గడిపి, అంత్యమున శివ సాయుద్యమును పొందినాడు.

Subrahmanyam Gorthi

unread,
Nov 13, 2014, 8:45:47 AM11/13/14
to babasatsang
మనకంచార నాయనారు

చోళరాజ్యంలో కంచరూరు ఒక సారవంతమైన ప్రాంతము. అక్కడి వారందరూ మంచి శివభక్తులు. పరమ శివభక్తుడైన మనకంచార్‌నార్ గూడ ఆ వూరి వాడే. వెల్లాల కులస్తుడు. వంశపారంపర్య సేనాధిపతి. ఆ ఊరి ప్రజలందరికి మనకంచార నాయనారు మీద గౌరవము మెండు. ఇతడు సుందరమూర్తి  నాయనారు సమకాలీకుడు. శివభక్తులను కొలుచుట, గౌరవించుట శివుపూజ పద్ధతులలో అత్యుత్తమమైనదిగా నాయనారు భావించేవాడు. మనుష్యుల చూపులనుబట్టి, వారి మనస్సులలోని భావాలను గుర్తించి, వాటికి అనుగుణంగా, ఎదుటివారు ఏమీ అడుగకుండానే వారిని సేవించేవాడు. 

నాయనారుకు చాలాకాలము సంతానము లేదు. తీవ్రమైన తపస్సు చేసి శివుని మెప్పించి ఒక కుమార్తెను వరంగా పొందాడు. ఈ దైవ దత్తమైన కుమార్తె జననమును దాన ధర్మములతో ఎంతో వేడుకగా జరిపాడు. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. ఇయర్‌కాన్‌ కాలికమార్‌తో వివాహము నిశ్చయించాడు. అతను గూడ మంచి శివభక్తుడు. వివాహమునకు సుమూహూర్తముకూడా  నిశ్చయించారు. వివాహమునకు అంతా సిద్ధము చేశారు.

పరమశివుడు నాయనారు మీద విశేష అనుగ్రహమును చూపదలచాడు. పరమ తేజోవంతుడయిన ఒక మహావ్రతుడుడి రూపంలో నాయనారు ఇంటికి విచ్చేసాడు. ఆ మహావ్రతుడు ముఖం నిండా విభూతి పూసుకుని ఉన్నాడు. అతని పొడవాటి జటాజూటమును ఎముకల దండలతో అలంకరించుకుని ఉన్నాడు. కేశములతో చేయబడిన యజ్ఞోపవీతమును (జంధ్యమును) మెడలో ధరించియున్నాడు. మనకంచార నాయనారు  - మహదానందముతో ఆ మహాత్ముడిని ఇంటిలోనికి ఆహ్వానించాడు. గృహమంతా అలంకరించి యుంచుటకు కారణాన్ని అడిగాడు. నాయనారు తన కుమార్తె వివాహము ఆరోజున  జరగనున్నది అని పలికి, తన కుమార్తెను పిలిచి ఆ మహావ్రతుని పాదములకు నమస్కరింపమన్నాడు. ఆ మహావ్రతుడు ప్రణమిల్లుచున్న ఆమెయొక్క కేశసంపదను చూచి, నాయనారుతో, "మహాత్మా, మీ కుమార్తె కేశ సంపదను చూచి నాకు పరమానందమైనది. వాటితో ఒక చక్కటి పంచవటిని (ఐదు పోగుల యజ్ఞోపవీతమును) తయారుచేసుకోవచ్చును" అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే, నాయనారు ఒక కత్తితో తన కుమార్తె కేశ సంపదను ఖండించి,  ఆ మహావ్రతునకు వాటిని దానము చేసాడు. ఆరోజే ఆమెకు వివాహమన్న సంగతి కూడా నాయనారు తలచలేదు. తనకు ఒక్కతే కుమార్తె అని, ఆ ఒక్క కుమార్తెను అందవిహీనురాలుగా చేస్తున్నట్లుగా గూడ భావించలేదు. పరమశివుడు వీరి భక్తితత్పరతకు పరమానంద భరితుడయ్యాడు. తాను, పార్వతీదేవితో కలసి, నిజస్వరూపముతో అచ్చట ప్రత్యక్షమయ్యారు.

మహావ్రతుని రూపంలో ఉన్న ఆగంతకుడు మాయమయ్యాడు. ఇదంతా శివలీల. పెండ్లికుమారుడు అతని బృందము వచ్చి జరిగినదంతా చూచారు. కేశవిహీనయైన పెండ్లి కుమార్తెను స్వీకరించుటకు కొంచెము సందేహించాడు. ఈ విషయం పరమశివునికి అర్ధమైంది. పెండ్లి కుమార్తెను ఈశ్వరుడు ఆశీర్వదించాడు. వెంటనే ఆమె కేశసంపద యథాస్థితికి వచ్చింది. నాయనారు కుటుంబము యావత్తు మహదానంద భరితులయ్యారు. నాయనారు తన కుమార్తె వివాహమును ఎంతో ఘనంగా జరిపించాడు.
***


Subrahmanyam Gorthi

unread,
Nov 14, 2014, 8:49:36 AM11/14/14
to babasatsang
అరివత్తయ నాయనారు

యుక్తరీతి ధర్మ యుక్తుడై గృహమేధి
యఙ్ఞ యాగ ఫలములనుభవించు
బ్రతుక వలసినట్లు బ్రదికినచో నింట
మింట సురలు బిలిచి మెత్తు రతనిని ( కురాల్ )

చోళరాజ్యములో, కావేరీ నదీతీరమున, కన్నమంగళము అనే గ్రామము సిరిసంపదలతో విలసిల్లుతూ ఉండేది. ఆ గ్రామంలో తాయనార్ (అరివత్తయ నాయనారు) అనే ఒక మహాశివభక్తుడు తన భార్యతో కలిసి నివశించేవాడు. ఆ గ్రామంలో గల మహా ధనికులైన కొద్ది కుటుంబాలలో వీరిదీ ఒకటి. వారికి అనేక ఎకరాల పంటభూమి ఉండేది. అంతటి ధనవంతుడైనప్పటికీ, తాయనార్ ఎంతో వినయశీలతతో నడచుకుంటూ, ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవాడు. అతని భార్యకూడా చాలా ఉత్తమురాలు. వారిద్దరూ కలసి నిరంతరమూ భగవంతుని నిష్కామముగా సేవించేవారు. వారి పొలములో పండిన బియ్యములోనుండి అత్యున్నతమైన నాణ్యత కలిగిన బియ్యాన్ని ఈశ్వరునికి నివేదిమచడం కోసమని వారు వేరుగా పెట్టి ఉంచేవారు. ఆ దంపతులు ప్రతిరోజు ఆ నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని, తోటకూర కూరతో పాటుగా, క్రమం తప్పకుండా శ్రద్ధాభక్తులతో పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించేవారు.

పరమేశ్వరుడు నాయనారు భక్తిని పరీక్షించ దలచాడు. ఈశ్వర సంకల్పము వలన నాయనారు ఆర్ధిక స్థితి నానాటికీ క్షీణించసాగింది. కొద్ది కాలంలోనే అతని సంపదలన్నీ కరిగిపోయి, ఘోర దరిద్రం అతనిని వరించింది. అంతటి ఆర్ధిక దుస్థితిలోకూడా, వారు ఈశ్వరుని సేవించే విధానములో కించిత్తు అయినా మార్పు రాలేదు. ఈశ్వరునికి ఎప్పటిలాగే నాణ్యమైన బియ్యాన్ని కొని, తమకోసం మాత్రం అతి తక్కువ ధరకు లభించే నాసిరకం బియ్యాని వాడుకునేవారు. అంతటి కష్టాలలోకూడా వారు ఎంతో స్థైర్యంతో ఇంతకు ముందువలెనే తృప్తితో జీవించేవారు. అలా మరికొంత కాలం గడిచేసరికి, ఆ గ్రామంలో ఇంతకు ముందెన్నడూ ఎరుగని ఘోరమైన కరువు తాండవించింది. తాయనార్ కుటుంబమునకు వారి కనీస అవసరాలు తీర్చుకోవడంకూడా ఎంతో కష్టమయ్యింది. ఒక్కొక్కసారి చాల రోజులవరకూ తినడానికి ఏమీ లేక, కుటుంబమంతా ఆకలితో పస్తులుండవలసి వచ్చేది. తాయనార్ వలే అతని భార్యకూడా మహాశివభక్తురాలు అవ్వడంవలన, ఆమె ఇష్టపూర్వకంగానే తన వంటిపై నగలను, ఇంటిలోని విలువైన వస్తువులను తన భర్తకి అమ్మివేయడానికి ఇచ్చి, అలా వచ్చిన డబ్బులతో ఈశ్వరునికి నైవేద్యాన్నిమాత్రం ఇంతకు ముందు వలెనే సమర్పిస్తూ ఉండేవారు.

ఒకనాడు తాయనార్, అతని భార్య - ఒక గిన్ని నిండా అన్నము మఱియు తోటకూర, వెన్న, నెయ్యి, పెరుగులను శివునకు నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేసుకున్నారు. వారికి దగ్గరలోగల కన్నతన్‌గుడి అనే గ్రామంలోని శివాలయానికి  తమ ప్రయాణం మొదలుపెట్టారు. (కన్నతన్‌గుడి తంజావూరు జిల్లాలో కలదు. అది తాయనార్ పుట్టిన ఊరు). అంతకు ముందు ఎన్నో రోజులులుగా తిండి లేకపోవడం వలన, దంపతులిద్దరూ చాలా బలహీనంగా వున్నారు. ఆకలి దప్పికలతో బడలిపోయి ఉన్నారు. తాయనారు నడుస్తూవుండగా దారిలో  హఠాత్తుగా తూలి పడిపోయాడు. అతని చేతులోని అన్నము మరియు ఇతర సంభారాలన్నీ నేలపాలయ్యాయి. దేవుని కోసమని తీసుకుని వెళుతున్న నివేదనలు నేలపాలవడంతో తాయనారుకు మతి పోయినట్లయింది. తన అజాగ్రత్త వలన
నే దేవుని యెడల మహాపరాధం జరిగిందని భావించాడు. దుఃఖంతో కుమిలిపోతూ, తాను చేసిన తప్పిదమునకు ప్రాయశ్చిత్తముగా ప్రాణత్యాగము చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. తీవ్రమయిన ఉద్వేగముతో తనవద్దనున్న కొడవలిని పైకిత్తి, తన కంఠాన్ని ఖండించుకోబోయాడు. అలా కంఠమున ఖండించుకోబోయిన క్షణములోనే, హఠాత్తుగా అచట నేల రెండుగా చీలిపోయి, అందులోనుండి రెండు చేతులు పైకి వచ్చి, తాయనార్ చేతిని పట్టుకొని ఆపాయి. పరమదయాళువైన ఈశ్వరుడు పార్వతీ సమేతముగా తన దివ్య వాహనముతో ఆ దంపతులకు ప్రత్యక్షమయ్యారు. ఆ దంపతుల నిష్కామ భక్తికి పార్వతీపరమేశ్వరులు ఎంతగానో పరవశించి, వారిరువురిని ఆశీర్వదించారు. ఆ దంపతులిరువురూ వారి అసమానమైన భక్తి తత్పరత వలన మోక్షమును పొందారు.  
****

Subrahmanyam Gorthi

unread,
Nov 15, 2014, 10:19:32 AM11/15/14
to babasatsang
ఆనయ నాయనారు

తమిళనాడులో తిరుచినాపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రములలో తిరుమంగళము ఒకటి. ఇక్కడ ఆలయంలో కొలువైయున్న ఈశ్వరుని పేరు - సామవేదేశ్వరుడు, ఆమ్మవారి పేరు - లోకనాయకి. ఈశ్వరుడు పరుశురాముడిని మాతృహత్యా పాతకము నుండి విముక్తి కలిగించినది ఈ ప్రదేశములోనే. అంతేగాక, ఆ భార్గవ-రాముడికి పరశువును (గండ్ర గొడ్డలిని) ప్రసాదించి, పరుశు-రాముడిగా జేసినదికూడా ఈ సామవేదేశ్వరుడే.

అట్టి మహిమాన్వితమైన గ్రామములో ఆనయారు అని పిలవబడే ఒక పశువుల కాపరి ఉండేవాడు. "ఆనయారు" అంటే "గోసంరక్షకుడు" అని అర్ధం. ఆయన శివభక్తాగ్రేశ్వరుడు. ఎలప్పుడూ విభూతిని ధరించేవాడు. శివభక్తుల కులము, మతము మున్నగునవేమీ పట్టించుకొనక, వారిని బహుప్రీతిగా సేవించేవాడు. వేణుగానంలో పంచాక్షరీ మంత్రమును మిళితం చేసి వాయిస్తూ, పరమశివుని మీద తనకుగల భక్తిని వ్యక్తపరుచుకునేవాడు. ఈ విధమైన పంచాక్షరీ మంత్రధ్యాన సాధనద్వారా పరమేశ్వరుని పొందాలన్నది అతని ధ్యేయము.

ఒక రోజున ఆనయారు ఒక తంగేడు వృక్షము క్రింద కూర్చుని, పరవశముతో పంచాక్షరీ మంత్రాన్ని వేణువు మీద పాడుతున్నాడు. ఆ గానము వీనులవిందుగా సాగింది. ఆవులు, దూడలు చెవులు నిక్కరించుకొని వినడానికి మూగాయి. చెట్లమీద పక్షులు ఆ నాదంలో మునిగిపోయి, ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి. నెమళ్లు పురివిప్పి గమకంగా నృత్యము చేసాయి. లేళ్లు, సర్పములు, సింహములు, ఏనుగులు, పులులు ఆ పంచాక్షరీ గానమునకు మంత్రముగ్ధులై ఆ వేణుగానాన్ని ఆలకిస్తూ నిలిచిపోయాయి. తక్కిన జంతువులన్నీకూడా అవి ఉన్నచోటనే అలానే తన్మయత్వంతో నిలిచిపోయాయి. నదుల ప్రవాహములుకూడా కదలకుండా ఉండిపోయాయి. సముద్ర తరంగాలు ఆ గానమును వినడానికై మంద గమనమును పొందాయి. ఆ గానామృతాన్ని గ్రోలడానికి దివ్యలోకములనుండి విద్యాధరులు, కిన్నెరలు, దేవతలు మొదలగు వారందరు తమ తమ వాహనములలో భూమిపైకి దిగివచ్చారు. 

సమస్త ప్రకృతిని తన్మయత్వంలో ముచెత్తిన ఆనయారు భక్తిరస గాన ప్రవాహము - సామవేదేశ్వరుడయిన పరమశివుని కూడా పరమానందంలో ఓలలాడించింది. ఈశ్వరుని హృదయం ఆనయారు భక్తి తత్పరతలో కరిగిపోయింది. అంతట పార్వతీ పరమేశ్వరులు ఇరువురు ఆనయారు ఎదుట ప్రత్యక్షమయి, ఆశీర్వదించి, ఆనయారును ఆదరముతో కైలాసమునకు తీసుకొని వెళ్లారు.     
****


Subrahmanyam Gorthi

unread,
Nov 15, 2014, 11:30:24 PM11/15/14
to babasatsang
మూర్తి నాయనారు


మూర్తి నాయనారు పాండ్యరాజ్యపు రాజధానియైన మధురైలో, ఒక వైశ్య కుటుంబములో జన్మించాడు. అతను చిన్ననాటినుండీ పరమశివుని మహాభక్తుడు. పార్వతీ పరమేశ్వరులను - శ్రీ చొక్కలింగ పెరుమాన్ (శ్రీ సోమసుందరేశ్వరుడు) మఱియు శ్రీ అంగాయర్‌కన్ని (మీనాక్షీ దేవి) యొక్క మూర్తుల రూపములో అర్చించేవాడు. మూర్తి నాయనారు అనునిత్యము చందనమును సిద్ధము చేసి, దానిని పరమేశ్వరుని లింగమునకు క్రమం తప్పక సమర్పించేవాడు. ఆ విధంగా పరమేశ్వరునికోసం చందనమును సిద్ధము చేయడములో మూర్తి నాయనారు అనిర్వచనీయమైన ఆనందమును పొందెడివాడు. అలా చందనార్చన చేయడం ఒక వ్రతంగా పెట్టుకొన్నాడు.

ఒకసారి కర్ణాటక రాజు మధురపై దండెత్తి పాండ్య రాజును ఓడించి, పాండ్య రాజ్యమునకు రాజయ్యాడు. ఆ రాజు జైన మతస్థుడు. శైవ మతాన్ని దేశమునుండి సమూలంగా తుడిచివేయాలని సంకల్పించి, శివభక్తులందరినీ తీవ్రముగా హింసించుట మొదలుపెట్టాడు. రాజ్యంలోని ప్రజలందరినీ జైనమతము స్వీకరించమని నిర్భందించేవాడు. మూర్తి నాయనారును గూడా బాగా హింసించాడు. కాని నాయనారు ఈశ్వర ఆరాధనను వీడలేదు. మొక్కవోని ధైర్యముతో రోజూ చందనముతో శివార్చన చేసేవాడు.

నాయనారును బలవంతంగానైనా జైన మతంలో కలుపుకోవాలనే ఉద్దేశ్యముతో, ఆ రాజు, ఊరిలో ఎవ్వరూ మూర్తి నాయనారుకు చందనము అమ్మకూడదని కట్టడి  చేశాడు. ఈ అస్తవ్యస్త పరిస్థితికి నాయనారు చింతించి, ఈశ్వరుని, "ఓ దయాసాగరా! ఈ రాజ్యాన్ని ఒక కర్కోటకుడు పరిపాలిస్తున్నాడు. నీ భక్తులను స్వేచ్చగా జీవించనీయకుండా చేస్తున్నాడు. మాకు శివభక్తుడైన రాజును ఎప్పుడు అనుగ్రహిస్తావు? ప్రజలందరూ రాజునే అనుసరిస్తారు గదా. అందుకని శివభక్తుడైన రాజునే మాకు అనుగ్రహించు" అని ఎలుగెత్తి ప్రార్ధించాడు.

ఒకరోజు నాయనారు చందనము కొఱకు ఆ పట్టణములో అన్నిచోట్ల తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఎవరూ అతనికి చందనము అమ్మలేదు. భగ్న హృదయుడై దేవాలయమునకు వెళ్లాడు. ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. చందనమునకు ప్రత్యామ్నాయముగా తన చేతులను గంధపు సానమీద అరుగదీయసాగాడు. కొంతసేపటికి ఎముకలు బయటపడి అవి కొంతవరకు అరిగిపోయాయి. రక్తము ఆలయమంతా చిమ్మింది. శివుడు అతని అచంచలమైన నిష్టకు చలించి పోయాడు. నాయనారుకు  ఒక అశరీరవాణి ఇలా వినిపించింది: "మహాత్మా, మీ నిరతిశయ భక్తికి చాల సంతోషించాను. నీ సాహసము ఇక చాలును, ఆపివేయుము. నీ కష్టములు అన్నీ త్వరలో తొలగిపోగలవు. నువ్వే త్వరలో రాజువు అగుదువు. అప్పుడు నీవు న్యాయబద్ధంగా, చాకచక్యముతో చిరకాలము రాజ్యపాలన కావించుము. అటు పిమ్మట నీవు నా సన్నిధిని చేరెదవు."

ఆ అశరీరవాణిని విని నాయనారు ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణములో తన చేతులకు అయిన గాయములన్నీ మాయమయ్యి, ఇంతకు పూర్వమువలే తిరిగి యథాస్థితికి వచ్చాయి. నిజానికి నాయనారు తాను రాజును కావాలని కోరుకోలేదు; అది దైవ సంకల్పము.

అదే రోజు రాత్రి, ఆ కర్కోటక రాజు అకస్మాత్తుగా మరణించాడు. మరునాడు, క్రొత్త రాజును ఎన్నుకొనడానికి, ఆ దేశ ఆచారమును అనుసరించి, మంత్రులందరు పట్టపుటేనుగునకు ఒక పూలమాల ఇచ్చి, ఆ పట్టణములో దానిని విడిచిపెట్టారు. ఆ ఏనుగు ఎవరి మెడలో ఆ పూలమాల వేస్తే అతను రాజువుతాడు. ఆ ఏనుగు నేరుగా ఒక దేవాలయమును సమీపించింది. మూర్తి నాయనారు అప్పుడే శివుని అర్చించుటకు అచ్చటకు వచ్చాడు. ఏనుగు నాయనారుకు ఎదురేగి, తన మోకాళ్లపై నిలబడి, నాయనారు మెడలో ఆ పూలమాలను వేసింది. రాజ్యములోని ప్రజలందరూ అనందముతో ఈ దృశ్యమును తిలకించుచుండగా, ఏనుగు నాయనారును తనపై ఎక్కించుకొని, రాజ భవనమునకు తీసుకుని వెళ్ళింది.

రాజ్యములోని ప్రజలు మఱియు మంత్రులు నాయనారును తమకు రాజుగా ఉండవలిసినదని ప్రార్ధించారు. వారి ప్రార్ధనను మన్నించి, రాజుగా పట్టాభిషక్తుడు అవడానికి అంగీకరిచాడు. అయితే, విలాసవంతములయిన రాచ మర్యాదలన్నింటినీ మాత్రం సున్నితముగా తిరస్కరించాడు. జటలు కట్టిన తన కేశములే నాయనారుకు మణిమయ కిరీటము. శరీరమునిండా ధరించిన రుద్రాక్షలే అతనికి స్వర్ణాభరణములు. సభలోని వారందరూ నాయనారుయొక్క వినయ శీలతను, ఈశ్వరునిపై వానికి గల నిర్మల భక్తిని వీక్షించి, అంతటి మహాభక్తుడు తమకు రాజుగా లభించినందుకు ఎంతగానో పొంగిపోయారు. అప్పటినుండి, నాయనారుయొక్క ఆజ్ఞలను మంత్రులు అక్షరాల అమలు చేయసాగారు. నాయనారుయొక్క ధర్మ పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారు. రాజ్యమంతా సుభిక్షంగా ఉన్నది. ఈ విధముగ అనేక సంవత్సరములు ప్రజారంజకముగా రాజ్యపాలన గావించి, అంత్యమున నాయనారు శివ సాయిజ్జమును పొందినాడు.
****

Subrahmanyam Gorthi

unread,
Nov 17, 2014, 3:07:37 PM11/17/14
to babasatsang
మురుగ నాయనారు

శైవాగమ శాస్త్రాల్లో పరమశివునికి కుసుమార్చన, పుష్పమాలాలంకరణ, పంచాక్షరీ మంత్ర మననము - ఉత్కృష్టమైన శివపూజ అని చెప్పబడింది. పంచాక్షరి మహిమాన్వితమైన మంత్రము. ఈ మంత్రరాజము యజుర్వేదంలోని మధ్యకాండ అయిన శ్రీ రుద్రాధ్యాయి మధ్యలో ప్రసాదింపబడినది. పంచాక్షరి జపము చేయువాడు పునర్జన్మ రాహిత్యుడు అవుతాడు.

ఈ విధమైన శివ పూజలో మురుగనాయనారు నిమగ్నుడై ఉండేవాడు. తిరుపుకలూరులో జన్మించాడు. ఈ ఊరిలో ఇంకా కొంతమంది నాయనారులు ప్రసిద్ధులయ్యారు. అనుదినము సూర్యోదయం ముందరే నిదుర లేచి, స్నానము చేసి, ఫాలమున విభూతి నలముకొని, నిత్యానుష్టానము చేసి, పూల సజ్జతో తోటకు వేళ్లేవాడు. అక్కడ పంచాక్షరీ మంత్రమును జపిస్తూ పూలను సేకరించి, వివిధ మనోహరమైన పూల మాలలను గ్రుచ్చి ఆలయమున మహాదేవునికి సమర్పించేవాడు.

ఒక దినమున తిరు జ్ఞాన సంబంధారు ఆ ఊరు వచ్చాడు. మురుగ నాయనారు ఆ శివభక్తుని తన ఇంటికి ఆహ్వానించి, మనసారా పుజించాడు. జ్ఞాన సంబంధ నాయనారు మురుగ నయనారుని చూచి ముచ్చట పడ్డాడు. అతనిని తన ప్రాణ సఖునిగా స్వీకరించాడు. జ్ఞాన సంబంధారు వివాహ మహోత్సవానికి హాజరుయ్యే భాగ్యము నాయనారుకు కలిగింది. ఆ వివాహ మహోత్సవమునకు కారణము - సంబంధారు తొలుత వివాహము నిరాకరించినాడు. కాని అచటనున్న బ్రాహ్మణులు అందరును సంబంధారుకు నమస్కరించి, "దేవరవారు వేదాగమము స్థాపనకు అవతరించారు. వేదాగమము ప్రకారము వివాహము చేసికొనుట ధర్మమన్నారు." దానికి అడ్డు చెప్పలేక జ్ఞాన సంబంధ నాయనారు వివాహమునకు అంగీకరించాడు. తిరునల్లూరు నంబండారు నంబి కుమార్తెతో వివాహమయింది. కళ్యాణమయిన తర్వాత సంబంధారు దేవుని నుతింపగా, పరమశివుడు, "నీవును, నీ భార్యయు, నీ పెండ్లికి వచ్చిన భక్తులును మీ ఎదుటనున్న జ్యోతిలో ప్రవేశింపుడు" అని ఆనతిచ్చాడు. చూడగా ఎదుట శివ సన్నిధి మొదలు ఆకాశము వరకు జ్యోతి కనిపించింది.

అప్పుడు భార్యా సమేతముగా శ్రీజ్ఞాన సంబంధారు ప్రధముడుగా అచ్చట గల భక్తులు మురుగ నాయనారుతో సహా ఆ జ్యోతిలో ప్రవేశించి శివ సాయుజ్యమును పొందారు.

సంబంధారు యెడ మురుగ నాయనారు భక్తి ప్రపత్తి సంబంధారును స్నేహితునిగా చేసినది. ఆ స్నేహము మురుగ నాయనారు ముక్తికి దారితీసింది.

అందుకనే కురాల్‌లో ఇలా చెప్పబడింది :
వినయవంతుడైన విక్రమవంతుడు
శత్రువులను మిత్రులుగ జేయు
మంచి చెడ్డలరసి మంచిచేయువారె
వలయు కార్యమునకు బలముగాను
పనితనమ్ము తెలిసి ప్రతిబంధములకోర్చు
సాహసుండె కార్య సాధకుండు
****


మూలము: http://www.telugubhakti.com/telugupages/Nayanars/Nayanars.htm

Subrahmanyam Gorthi

unread,
Nov 18, 2014, 4:26:55 PM11/18/14
to babasatsang
 రుద్రపశుపతి నాయనారు

రుద్ర పశుపతి నాయనారు చోళరాజ్యంలోని తిరుతలైయూర్ అనే గ్రామలో ఒక శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. అతడు - రుద్రుడు - పశుపతినాథుని పరమ భక్తుడు. శివపంచాక్షరి మహామత్రము మననము, మఱియు రుద్రాధ్యాయ పారాయణలతో పశుపతినాథుని స్థుతించడములో అతడు వర్ణనాతీతమైన ఆనందమును అనుభవించెడివాడు.

మానవులను సంపూర్ణముగా పునీతులను చేయగల మంత్రరాజములలో రుద్రాధ్యాయము అతి ప్రధానమైనది. అటువంటి రుద్రాధ్యాయ పఠనమును తన సాధనా మార్గముగా చేసుకున్నాడు - రుద్ర పశుపతి నాయనారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా, తెల్లవారు ఝామున మఱియు సాయంత్ర సమయాలలో నదిలో స్నానమాచరించి, ఆ నదిలోనే కంఠం లోతు వరకు నీటిలో నిలుచుని, పరిపూర్ణమైన భక్తి విశ్వాసములతో రుద్రాధ్యాయమును పఠించేవాడు. పరమశివుడు నాయనారు యొక్క నిరుపమాన భక్తి ప్రపత్తులకు పరమానంద భరితుడయ్యాడు. అట్టి తపోమయమైన జీవిత విధానము మఱియు సాటిలేని భగవత్ భక్తి ఫలితముగా శివుడు - రుద్ర పశుపతి నాయనారుకు మోక్షమును అనుగ్రహించాడు.

****

Subrahmanyam Gorthi

unread,
Nov 20, 2014, 10:08:37 PM11/20/14
to babasatsang
తిరునాలై పోవార్ నాయనారు (నందనారు)

తిరునాలై పోవార్ నాయనారు (నందనారు) కావేరీ నదీతీరములో ఉన్న అధనూర్ అనే గ్రామంలో, ఒక హరిజను కుటుంబములో జన్మించాడు. ఎనిమిది సంవత్సరాల వయస్సులో అతను గ్రామంలోని ఒక వేద పండితుని పొలములో పని చేయడం ప్రారంభించారు.వేద పండితుడు చక్కటి వాక్ వైభవము కలవాడు. ఆయన, వారి గ్రామములో ఉన్న ఆలయాలలో శివుని యొక్క మహిమనుగూర్చి తరచుగా ప్రవచనములు ఇస్తూ ఉండేవాడు. నందనారుపండితుని యెడల, మఱియు ఆయన భార్య యెడల అమితమైన అభిమానము, గౌరవములను కలిగియుండెడివాడు. ఆ వేద పండితునకు పిల్లలు లేరు; ఆ దంపతులు ఇరువురుకూడా నందనారును తమ సొంత పిల్లవానివలే అప్యాయముగా చూసుకునేవారు. అందుకు కృతజ్ఞతగా, నందనారు వారి పొలములో ఎంతో కష్టించి పనిచేసి, అ కుటుంబానికి నమ్మిన బంటువలే ఉండేవాడు. నిమ్న కులములో పుట్టి పెరిగినందువలన, నందనారు మాట్లాడే భాష మొరటుగా యాసతో ఉండేది. కానీ ఆ బ్రాహ్మణ దంపతులిరువురు నందనారు యొక్క వేష భాషలను పట్టించుకొనక, అతని నిజాయితీని, త్రికరణశుద్ధిని గమనించి, వానిని ఎంతో ఇష్టపడేవారు.

నందనారుకు ప్రతిరోజు సాయంత్రం తన యజమానిని కలిసి, ఆ రోజంతా పొలములో ఎమేమి పనులు చేసారో తెలియజేయడం అలవాటు. ఒకరోజు నందనారు తన పొలం పనులను ముగించుకుని, ఎప్పటిలాగే యజమాని ఇంటికి వెళ్ళేసరికి కొద్దిగా ఆలస్యమయినది. అతనికి తన యజమాని, ఇంటిలో ఎక్కడా కనిపించలేదు. ఆ పండితుని భార్య నందనారును భోజనము చేసి ఇంటికి వెళ్ళిపొమ్మన్నది. తరువాత రోజు వచ్చి యజమానిని కలుసుకోవచ్చునని ఆవిడ చెప్పింది. కానీ నందనారుకు అలా వెళ్ళిపో
డం ఇష్టం లేదు. యజామాని ఇంటికి వచ్చేవరకూ అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. చివరికి యజమాని భార్య, నందనారుతో, ఆయన దగ్గరలో ఉన్న శివాలయములో ప్రవచనము చెబుతున్నారని, ఆయన ఇంటికి వచ్చేటప్పడికి ఆలస్యము అవుతుంది కాబట్టి, వారిని అక్కడే శివాలయము వద్ద కలుసుకుని, అచ్చటినుండి, తన ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పినది. నందనారు బెరుకుగా శివాలయము వద్దకు వెళ్ళాడు. ఆ రోజులలోని కట్టుబాట్లను అనుసరించి, అలయములోనున్న గ్రామస్థుల మధ్య తాను యధేచ్చగా తిరుగకూడదని అతనికి తెలుసు. అప్పట్లో కొద్దిమందిలో వర్ణ వ్యవస్థ వెర్రి-తలలు వెయ్యడమువలన, నిమ్న కులములకు చెందినవారిని ఎవ్వరినీ ఆలయములలోనికి ప్రవేశించనిచ్చేవారు కాదు. అందువలన, నందనారు అక్కడకు వచ్చిన జనులకు దూరముగా నుంచుని, తన యజమాని యొక్క ప్రవచనమును ఎంతో శ్రద్ధతో వినసాగాడు. తన యజమాని యొక్క ప్రవచనము, ఆయన జ్ఞానము నందనారును ఎంతగానో కదిలించివేశాయి. ఆ ప్రవచనము వినడముతోనే, ఆయనపై నందనారుకు గల పూజ్య భావము ద్విగుణీకృతమైనది.

తన యజమాని యొక్క ప్రవచనమును నాయనారు ఎంతో శ్రద్ధాశక్తులతో విన్నాడు. ఆనాటి ప్రవచనములో చిదంబరములోని నటారాజుయొక్క గొప్పదనమును గూర్చి ఆ పండితుడు ప్రసంగించాడు. నటరాజస్వామి వైభవాన్ని ఎంతో రసవత్తరముగా వర్ణించి, తన ప్ర
చనము చివరిలో, "మన కంటితో చిదంబరములోని నటరాజస్వామిని చూడకుండా చనిపోతే, ఈ జన్మంతా వ్యర్ధమైనట్లే!" అని చెప్పి, ప్రవచనాన్ని ముగించాడు. ఆయన పలికిన ఆ ఆఖరి మాటలు నందనారు హృదయములో ధృఢంగా నాటుకు పోయాయి. ప్రవచనము పూర్తి అయిన పిమ్మట, యజమాని ఇంటికి వచ్చేలోపలే, నందనారు మరలా యజమాని ఇంటి వద్దకు వచ్చి, అక్కడే ఆయనకోసం వేచి చూస్తూ ఉన్నాడు. అంత పొద్దుపోయేవరకు తనకోసం వేచి చూస్తున్న నందనారుని చూసి, విషయమేమిటని యజమాని ప్రశ్నించాడు. నందనారు జరిగి విషయము చెప్పి, చిదంబరములోని నటరాజస్వామిని గూర్చి తనకు కలిగిన అనేక ప్రశ్నలతో తన యజమానిని ముంచెత్తాడు. ఆ ప్రశ్నలను విన్న యజమాని, కొంచం ఆశ్చర్యపోయాడు కానీ, వాటిని గూర్చి పెద్దగా పట్టిచుకొనలేదు. ముందుగా భోజనము చేసి, ఆ రాత్రికి అక్కడే నిద్రించమని నందనారుతో చెప్పాడు. కానీ నందనారు యజమాని చెప్పినట్లు భోంచేసి నిద్రించే స్థితిలో లేడు. యజమాని యొక్క సలహాను పట్టించుకొనక, నటరాజస్వామి గురించి తిరిగి అనేక ప్రశ్నల వర్షం కురిపించాడు. అప్పుడు ఆ యజమాని అతని ప్రశ్నలకు క్లుప్తముగా సమాధానములు చెప్పి, "శివ చిదంబరం" అనే మూల మంత్రాన్ని జపించుకుంటూ ఉండమని, అలా చేస్తే అతనికి నటరాజస్వామి ఆశీస్సులు లభిస్తాయని చెప్పి, అతనిని ఆ రాత్రికి ఇంటికి పంపించివేసాడు.

నందనారు ఏదో తెలియని ఉద్విగ్నతతో ఉన్నాడు. ఆ రాత్రంతా నిద్రపోకుండా, తన యజమాని ఉపదేశించిన మూల మంత్రాన్ని నిర్విరామంగా జపిస్తూనే ఉన్నాడు. అతనిలో క్రొత్తగా కలిగిన ఈ ఉత్సాహం, అతనిని తెల్లవారక మునుపే పొలానికి వెళ్ళేలా చేసింది. తెల్లవారే సమయానికి, ఆ రోజు చేయవలసిన పొలం పనులన్నీ పూర్తిచేసి, తన యజమాని వద్దకు వెళ్ళి, తాను త్వరగా ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని కోరాడు. నందనారు ప్రవర్తనలో ప్రస్పుటముగా కనిపిస్తున్న మార్పును చూచి, యజమాని ఆశ్చర్యపోయాడు. నందనారును ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పి పంపించివేసాడు. నందనారు ఇంటికి చేరుకుని, తన కుటీరములో, యజమాని ఉపదేశించిన "శివ చిదంబరం" అను మంత్రాన్ని అనేక గంటల తరబడి తన్మయత్వముతో జపిస్తూ ఉండిపోయాడు. ఈ విధంగా మరో రెండు రోజులపాటు అప్రయత్నముగా ఆ మంత్ర జపమును చేస్తూనే ఉండిపోయాడు. ఆ తరువాత మంత్ర జపమునుండి లేచేసరికి, తనని చూచినంత మాత్రముననే గుర్తించగలిగేటంత స్థాయిలో, ఇంతకు ముందెన్నడూ లేని ఒక దివ్యమైన మార్పు అతనిలో  కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అతని పూర్వపు స్వభావానికి భిన్నముగా, అతని వదనములో శాంతి, స్థిత ప్రజ్ఞతలు తొణికిసలాడాయి. నందనారు మాట్లాడే భాషలోకూడా అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇంతకు మునుపు మొరటుగా యాసతోకూడి ఉండే తమిళము మాట్లాడేవాడు; కానీ ఇప్పుడు అతను సంగముల కాలములో మాట్లాడుకునే శుద్ధ తమిళములో మాట్లాడం మొదలుపెట్టాడు. నందనారులో వచ్చిన ఈ అద్భుతమైన మార్పును చూచి, ఆ గ్రామస్థులందరూ నిశ్చేష్టులైపోయి, వారు గబ గబ పరుగెత్తుకుంటూ అతని యజమాని వద్దకు వెళ్ళి, నందనారులో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పును గూర్చి ఆయనకు విన్నవించారు. ఆయన నందారును తక్షణమే తనవద్దకు తీసుకుని రమ్మని ఆ గ్రామస్తులను ఆదేశించారు. నందనారు తన యజమాని వద్దకు వచ్చాడు. నందనారులో వ్యక్తమవుతున్న దివ్య తేజుస్సును చూచి, అతని యజమానికూడా ఆశ్చర్యానికి లోనయ్యాడు. అప్పటికే నందనారు తన యజమానినే తన ఆచార్యునిగా హృదయ పూర్వకముగా స్వీకరించి యున్నాడు. అందువలన, ఆయన వద్దకు రాగానే, వారి పాదములపై బడి, తాను చిదంబరము వెళ్ళి, అక్కడ ఉన్న నటరాజస్వామిని దర్శించుకునేందుకు తనకు అనుమతిని ఇవ్వవలిసినదని అర్ధించాడు.

నందనారు చిదంబరము వెళ్ళడానికి ఆ వేద పండితుడు అంగీకరించలేదు. అంత కఠినముగా ఆయన అలా నిరాకరించడానికి గల కారణమేమో తెలుపమని ఆ పండితుని భార్య, నందనారు అక్కడ లేని సమయంచూచి, తన భర్తను అడిగింది. ఆ వేద పండితుడు ఎంతో బాధతో, నందనారు చిదంబరం ప్రయాణమే అతని యొక్క చిట్ట చివరి ప్రయాణము అవుతుంది అని వివరించాడు; ఒక్కసారి ఆ గ్రామాన్ని విడిచిపెట్టి నందనారు చిదంబరము వెళ్ళాక, ఇక మరలా అతను ఎన్నడూ ఈ గ్రామానికి తిరిగి రాడని, అతనితో కలిసి ఉండే అవకాసం మనకు ఇక ఉండదని చెప్పాడు. నందనారుపై ఆ పండితునకుగల అంతులేని ప్రేమాభిమానములు, మమకారములే ఆయనను - నందనారు చిదంబరము వెళ్ళడానికి నిరాకరించేలా చేసాయి. ఆయన నంనారును పిలిచి, అతనిని వెంటనే, తమకు గల 120 ఎకరముల భూమిని సాగు చేయడానికి అనుకూలముగా తయారుచేయమని ఆదేశించాడు. ఆ పొలమంతటిలో పంట పండించి, ఆ పంటను ఇంటికి చేర్చాక, నందనారు తన చిదంబర ప్రయాణమును నిరభ్యంతరముగా ప్రారంభించవచ్చునని చెప్పాడు. తన యజమాని ఆదేశమును విన్న నందనారు, పొంగుకొస్తున్న ధుఃఖంతో హతాసుడయ్యాడు. నీరులేక బీడుభూమిగా ఎండిపోయి ఉన్న ఆ పొలాన్ని చూచి, కన్నీరు కార్చాడు. ఈ జీవితము క్షణ భంగురమైనది అని గుర్తు తెచ్చుకుని, వీలైనంత త్వరగా చిదంబరమునకు ప్రయాణమును ప్రారంభించాలని తన మనసులో బలంగా కోరుకున్నాడు.

ఆ నాటి రాత్రి, కైలాశములోని పరమశివుడు, తన భూత గణములను, నందీశ్వరుని పిలిచి, ఆ రాత్రికి రాత్రే వారందరూ వెళ్ళి, ఆ 120 ఎకరముల పొలములో పంట పండించమని, వారు అలా చేస్తే, నందనారు చిదంబరమునకు వెంటనే బయలుదేరి, ఆరుద్ర నక్షత్ర దర్శనము రోజునకు చిదంబరమునకు చేరుకోగలడని చెప్పాడు. తెల్లవారే సరికి, ఆ వేద పండితుడు కోరుకున్నట్లుగానే, పొలంలో పంటంతా సిద్ధముగా ఉన్నది! పంట ధాన్యం తమ ఇంటి వెనుక భాగాని చేర్చబడి ఉండడం చూచి, ఆ దంపతులిద్దరూ నిర్ఘాంతపోయారు. కొద్ది క్షణాలలోనే ఈ విషయం ఆ గ్రామమంతా ప్రాకిపోయినది. ఈ వింతను ప్రత్యక్షముగా చూడడానికి, గ్రామస్థులంతా ఆ పండితుని ఇంటి దగ్గర గుమిగూడారు. అంతకు ముందు అనేకమార్లు, ఆ పండితునకు నందనారుపై గల వాత్సల్యమువలన, అతనిని గాఢముగా ఆలింగనము చేసుకోవాలని అనిపించేది. కానీ అలా అనిపించిన ప్రతీసారి, నందనారు తక్కువ కులమునకు చెందినవాడు అన్న అలోచన కలిగి, ఆ పండితునికి ఉన్న ఆ కొద్దిపాటి అహంకారమే తాను అలా చెయ్యకుండా అడ్డుపడుతూ ఉండేది. ఈసారి మాత్రం ఆ పండితుడు కుల మతాల గురించి, ఎక్కువ తక్కువుల గురించి అలోచించే స్థితిలో లేడు. ఆ పండితుడు నందనారు ఉన్నచోటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆ పిల్లవాని పాదములపైబడి, పైకి లేచి నిలబడి, అతనిని గాఢంగా కౌగలించుకున్నాడు. నందనారు కూడా తన యజమాని, గురువు అయిన ఆ వేద పండితుని పాదములపై బడి, ప్రణామములు అర్పించి, మరుక్షణమే, తన గురువు అనుమతితో చిదంబర యాత్రకు శ్రీకారం చుట్టాడు.

నాయనారు తన చిదంబర ప్రయాణాన్ని దగ్గరలోనున్న తిరుప్పన్‌గూర్ అనే గ్రామం గుండా కొనసాగించాడు. ఆ గ్రామం నందనారు జన్మస్థలమైన అధనూర్ గ్రామమునకు 8 కిలోమీటర్ల దూరములో ఉన్నది. అచ్చటి శివాలములోని శివ పార్వతుల పేర్లు - "శివలోకనాథన్" మఱియు "సౌందర్యనాయకి". తాను తక్కువ కులమనకు చెందినవాడినన్న ఆత్మన్యూనతా భావము నందనారులో లోతుగా పాతుకునిపోయి ఉండడము వలన, అతడు ఆలయములోనికి ప్రవేశించడనికి ఇష్టపడలేదు. అందువలన, గుడి బయటనే నిలబడి, అక్కడినుంచే శివుని దర్శించుకోవడానికి ప్రయత్నించాడు; కానీ ఆ ఆలయములోని నందీశ్వరుని విగ్రహము బాగా పెద్దదిగా ఉండడము వలన, అది శివుని దర్శించుకోవడానికి అడ్డముగానుండి, నందనారుకు శివలింగ దర్శనము కాలేదు. శివలింగ దర్శనము కాకపోవడముతో, నందనారుకు ధుఃఖము పొంగుకొచ్చి, వెక్కి వెక్కి ఏడ్వసాగాడు. ఈశ్వరుడు నందనారు బాధ పడటం చూడలేకపోయాడు. వెనువెంటనే, శివుడు నందీశ్వరునితో, "నందనారుకు శివలింగ దర్శనమయ్యేటట్లుగా నీవు కొద్దిగా ప్రక్కకు (కుడివైపునకు) జరుగుము" అని అదేశించాడు. నందీశ్వరుడు ఈశ్వరాజ్ఞను శిరసావహించాడు. నందీశ్వరుడు ప్రక్కకు జరగడముతో నందనారుకు తృప్తిగా బయటనుండే ఈశ్వర దర్శనమైనది. ఆనాడు తిరుప్పన్‌గూర్‌లో జరిగిన ఈ అత్యద్భుతమును, నేటికీ మనం అచటి శివాలయములో దర్శించుకొనవచ్చును.



(తిరుప్పన్‌గూర్ శివాలయములో కుడివైపునకు జరిగి ఉన్న నందీశ్వరుడు)
ఈ ఆలయముయొక్క వీడియోను ఇక్కడ చూడవచ్చును: http://youtu.be/JygVxvlwAtU

నందనారు ఇక అక్కడినుండి బయలుదేరి, మార్గమధ్యములో వచ్చే ప్రముఖ దేవాలయములన్నింటినీ దర్శించుకుంటూ, తన ప్రయాణమును కొనసాగించాడు. చివరికి చిదంబరము పొలిమేరలను చేరుకున్నాడు. చిదంబరం కంటబడడంతోనే నందనారు ఆనందానికి ఇక అవధులు లేవు. నటరాజస్వామి విభూతులను, ఆయన చేసే ఆనంద తాండవమును స్మరిచుకుంటూ ఆనందముతో ఉప్పొంగిపోయాడు. ఆ పవిత్ర భూమిపై సాష్టాంగపడి, చిన్న పిల్లవానివలే పరవశముతో పొర్లు దండాలు పెట్టాడు. ఆ పుణ్యక్షేత్రము యొక్క గొప్పతనాన్ని తలచుకుంటూ, చిదంబరము చుట్టూ అనేక ప్రదక్షిణలు చేసాడు. దూరమునుండి ఉవ్వెత్తున ఉన్న చిదంబరేశ్వరుని ఆలయ-ధ్వజస్థంభం కనిపించగానే, ఇక అనందం పట్టలేక, శివ నామాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తూ, నృత్యం చేయసాగాడు. నందనారు ప్రయాణము మొదలుపెట్టినప్పటినుండీ, తాను తక్కువ కులమునకు చెందినవాడిని అన్న విషయమును తలుచుకుని బాధపడుతూ ఉండేవాడు. ఆ ఆత్మన్యూనతా భావము అతనిని వెంటాడుతూ ఉండడము వలన, చిదంబరేశ్వరుని ఆలయములోనికి ప్రవేశించుటకు సంకోచించి, ఆ గుడి బయటనే ఉండిపోయాడు. కానీ మరో ప్రక్క, ఈశ్వర దర్శనము చేసుకొనక పోవడముతో అతని హృదయం బాధతో బరువెక్కింది. ఆలయమునకు కొన్ని గజముల దూరములో కూర్చుని, తన దురవస్థను తలుచుకుని, ధుఃఖించసాగాడు. నందనారు ఎన్నో రోజులుగా ప్రయాణము చేస్తూ ఉండడము వలన, అలసిపోయి, కొద్దిసేట్లో ఆ ఆఱుబయట ప్రదేశములోనే, నిద్రలోనికి జారుకున్నాడు.

ఆనాటి రాత్రి నందనారుకు ఒక కల వచ్చింది. ఆ కలలో అతనికి ఈశ్వరుడు దర్శనమిచ్చి, అతనితో, "నీవు రేపు తెల్లవారు ఝామునే, నా ఆలయమునకు తూర్పున ఉన్న ముఖద్వారమునుండి ప్రవేశించి, త్వరగా వచ్చి నా దర్శనము చేసుకో" అని చెప్పాడు. కానీ నందనారు తనను తాను తమాయించుకొనలేక, బిగ్గరగా ఏడుస్తూ, "ఈశ్వరా, తక్కువ జాతిలో పుట్టిన నేను నీ ఆలయములోనికి ప్రవేశించేదెలా?" అని దీనముగా అడిగాడు. అప్పుడు ఈశ్వరుడు నందనారుతో, "అందుకు విచారించడమెందుకు? నీవు ఒక పని చేయి. నీవు రేపు ఉదయమే అగ్ని-స్నానమును చేసి, అటుపిమ్మట, బ్రాహ్మణులతో కలిసి, తూర్పు ద్వారమునుండి, నా కనక సభామండపమునకు రమ్ము" అని చెప్పి శివుడు అదృశ్యమైనాడు. నందనారు వెంటనే మేల్కొని, తనకు వచ్చిన కలను తలచుకుని సంతోష భరితుడయ్యాడు. అదేరోజు రాత్రి, పరమ శివుడు ఆ గ్రామములోని అనేకమందికి కలలో కనబడి, తనకు అత్యంత ప్రియమైన నందనారు అనే మహాభక్తుడు చిదంబరమునకు వచ్చియున్నాడని, అతని కొఱకు రేపు ఉదయమే ఆలయము యొక్క తూర్పు ముఖ ద్వారము వద్ద ఒక పవిత్రమైన అగ్నిని వ్రేల్చమని, అటు పిమ్మట, నందనారును సకల గౌరవ మర్యాదలతో ఆలయములోనికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళమని ఆజ్ఞాపించాడు.

మరునాటి ఉదయమే, ఆ గ్రామములోని వారందరూ ఆలయ తూర్పు ముఖద్వారము వద్ద సమావేశమై, పవిత్రమైన అగ్నిని సిద్ధము చేసి, నందనారు వద్దకు వెళ్ళి, ముందురోజు రాత్రి తమకు వచ్చిన కలనుగూర్చి అతనికి చెప్పారు. అది విన్న నందనారు, పరమ సంతోషముతో, వారు అచట ఏర్పాటు చేసిన పవిత్రాగ్ని చుట్టూ ప్రదక్షిణము చేసి, శివుని పాదపద్మములమీద తన దృష్టిని నిలిపి, శివనామాన్ని జపిస్తూ, ఆ అగ్నిలోనికి ప్రవేశించాడు. అచటకు చేరిన గ్రామస్థులందరూ ఇప్పుడేమి జరుగుతుందాయని, సంభ్రమాశ్చర్యములలో మునిగి తేలుతూ, ఉత్సుకతతో చూస్తూ ఉన్నారు. నందనారు ఆ అగ్నినుండి బయటకు వచ్చేసరికి అతని రూపూరేఖలు సమూలముగా మారిపోయి ఉన్నాయి! అందులోంచి వినూత్నమైన తేజంతో శరీరమంతా విభూతిరేఖలను అలుముకొని, యజ్ఞోపవీతంతో, జటాజూటముతో నందనారు బయటకు వచ్చాడు. నందనారును సగౌరవంగా దేవాలయంలోనికి తీసికొని వెళ్లారు. కనకసభలో నందనారు శివుని అర్చించాడు. అతని మనోనేత్రానికి గోచరించిన నటరాజుయొక్క ఆనంద తాండవాన్ని తనివితీరా వీక్షించి తన్మయుడయ్యాడు. ఇంతలో ఆ ఆలయములో హఠాత్తుగా మిరుమెట్లు గొలుపు ఒక వెలుగురేఖ మెరిసింది. నందనారు వెలుగులో అంతర్థానమయ్యాడు. నటరాజుస్వామిలో శాశ్వతముగా లీనమయ్యాడు.

***
ఆంగ్ల మూలము: http://indiatempletour.blogspot.com/2012/01/63-nayanmars-life-of-thirunalai-povar.html

Subrahmanyam Gorthi

unread,
Nov 21, 2014, 5:02:43 PM11/21/14
to babasatsang
తిరుకురిప్పు తొండనాయనారు


తొండైమండలం ఒక భాగ్యసీమ. దానికి కంచి ముఖ్యపట్టణము. ఆగమముల ప్రకారము ఇచ్చటనే పార్వతీదేవి శివుని గూర్చి తపమొనరించినది. ఇచ్చట శివుడు ఏకామ్రనాథుడుగా పిలువబడుతాడు.

తిరుత్తొండారు ఇచ్చటనే జన్మించినాడు. రజకుడుగా పుట్టాడు. శివధ్యానైక తత్పరుడు. శివభక్తులను ఆదరించేవాడు. సేవించేవాడు. వారి ముఖాల్ని చూచి, వారల అవసరములు గుర్తెరిగి వాళ్ళకు సహాయ మందించేవాడు. అందుకని అతనికి తిరుకురిప్పు తొండనాయనారు అని పేరు వచ్చింది. శివభక్తుల బట్టలను ఉతికేవాడు. శివుడు ఇతని భక్తికి మెచ్చి - అందరికి అతని విశేషము తెలియబరచాలనుకున్నాడు.

శివుడు ఒక పేదవానిగా రూపొంది, మెడకు రుద్రాక్షలతో, దేహమంతా విభూతి పుండ్రములతో, చిరిగిపోయిన దుస్తులతో తిరుత్తొండారుకు ప్రత్యక్షమయ్యాడు. అతనిని చూడగానే తిరుత్తొండారుకు మైకం కమ్మింది. తేరుకుని, అతనిని కొలిచాడు. అతనిని ప్రశ్నించాడు. "స్వామీ! మా ఇల్లు, మీ రాకతో పావనమయింది. ఎందుకని మీరు చిక్కిపోయారు? మీ దుస్తులను ఉతికి పెట్టనీయండి. మీకు సేవ చేయనీయండి" అని అర్థించాడు. ఆ శివ భక్తుడు ఒక షరతుతో ఆ బట్టలను ఉతుకుటకు అనుమతిచ్చాడు. ఆ షరతు: ఆ బట్టలు ఉతికి, ఆరవేసి తనకు సూర్యాస్తమయంలోపల అందజేయాలి. లేని యెడల బక్కచిక్కిన తను, చలికి చనిపోతాడు అని:"

తొండారు ఇందుకు అంగీకరించాడు. అంగీకరించే సమయానికి ఎండ బాగానే వుంది. వెంటనే ఆ బట్టలను ఉతికాడు. ఆరవేసే సమయానికి పెద్దవాన మొదలిడింది. సూర్యుడస్తమించే సమయం వచ్చింది. ఆ బట్టలు ఆరే పరిస్థితి కనబడలేదు. తొండారు తబ్బిబ్బయ్యాడు. శివభక్తునికి తాను సహాయము చేసే బదులు అతనిని కష్టాలపాలు చేసే స్థితికి వచ్చింది. ఈ పాపాన్ని తలుస్తూ ఆ బట్టలుతికే రాయికి తన తలను వేసి కొట్టుకున్నాడు. దేవుని ప్రార్థించాడు. పరిస్థితిని చూచి ఆక్రందించాడు.

శివుడు ఆ ఆక్రందనకి కరిగి ప్రత్యక్షమై తొండారును అభినందించి, భక్తికి మెచ్చుకొని - 'త్వరలో నన్ను చేరగలవు. నా దగ్గరే వుండగలవు' అని అనునయంగా పల్కాడు.

తొరుత్తొండారు పరవశించి, శివుని పాదములై బడి తన్మయత్వంతో శివుని నుతించాడు.

Subrahmanyam Gorthi

unread,
Nov 22, 2014, 9:27:28 AM11/22/14
to babasatsang
చండీశ్వర నాయనారు

చండీశ్వర నాయనారు పూర్వ నామము విచారశర్మ. 
చోళదేశమున తిరుచాయి జ్ఞాన నల్లూరులో యజ్ఞశర్మ పవిత్ర దంపతులకు జనన మందినాడు. ఆ గ్రామము వేద ఘోషలకు, తపస్సులకు, శివభక్తులకు నిలయము. విచారశర్మ కారణజన్ముడగుటచే ఐదు సంవత్సరముల ప్రాయము నిండక పూర్వమే వేద వేదాంగములయందు, ఆగమములందు అసమాన పండితుడైనాడు. ఏడవ సంవత్సరమున ఉపనయనము పిదప గురువు వద్దకు విద్యాభ్యాసమునకు పంపగా ఈ విషయము గురువుగారికి తెలిసినది. గురువు వేదములోని సంత ప్రారంభింపగా విచారశర్మ వేదములను ఏకరువు పెట్టాడు. పాఠము చెప్ప మొదలిడినంతనే శాస్త్రములన్నింటికి చింత చేశాడు. గురువు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇంతటి శిష్యునకు తాను గురువైనందుకు ఆనంద భాష్పాలతో గురువు విచారశర్మను కౌగలించుకున్నాడు.

గురువునకు సమిధలు తెచ్చుటకు వెళ్లుచుండగా, త్రోవలో ఒక ఆవుల మందను పశువుల కాపరిని చూచెను. ఒక ఆవు మందనుండి విడిపోగా పశువుల కాపరి దానిని పట్టుకొని కర్రతో చావుమోది పశువుల మందలో కలిపాడు. విచారశర్మ అదిచూచి " శివుని కారణమున గోవులు భూలోకంలో అవతరించాయి. దాని సర్వాంగములందు దేవతలున్నారు. పంచగవ్యము శివునికి అభిషేక ద్రవ్యము. గోమయము ఈశ్వర చిహ్నమగు విభూతి మూలము. ఓ అవివేకి! నీవు ఈ రోజు చాలా పాపము చేశావు. నీవు ఇక నుంచి గోవులను మేపవద్దు. నీ బదులు నే నా పనిని చేస్తాను" అన్నాడు.

యజమానుల అనుజ్ఞ పొంది గోవులను తోలుకొనిపోయి ఏపుగా పెరిగిన పచ్చిక బయళ్ళలో మేపసాగాడు. నిర్మలమైన ఏటినీళ్ళను వాటిచే త్రాగించాడు. చెట్లనీడలలో వాటిని విశ్రమింపచేశాడు. ఆవులు చక్కగా మేసి మనోహరముగా బలిసి నాలుగురెట్లు పాలీయసాగాయి. బ్రాహ్మణులకు సమృద్ధిగా క్షీరముండుటచే విచారశర్మ సంరక్షణకు ఆనందించారు. శివునికి క్షీరాభిశేకము చేయ మొదలిడారు.

గోవులు పాలను చాలా అధికముగా ఇచ్చుటతో, శివుని అమితంగా ప్రేమించే విచారశర్మ శివునికి పాలాభిషేకము చేయ నిశ్చయించాడు. నది ఒడ్డున అత్తివృక్షము క్రింద కూర్చొని మట్టితో ఒక దేవాలయము నిర్మించి, అందులో మట్టితోనే శివలింగమును ప్రతిష్ట చేసి పాలతో అభిషేకము చేయమొదలిడాడు. అత్తిపూలతో పూజించేవాడు. విచారశర్మకు, బ్రాహ్మణులకు గోవులు సమృద్ధిగా క్షీరము నిస్తున్నాయి.

ఒక రోజున విచారశర్మ ఈ విధంగా పూజచేస్తుండగా, ఒక గ్రామస్తుడు అటుగా రావడం తటస్థించింది. విచారశర్మ గోక్షీరమును మట్టిలో పోయుట చూచాడు. విచారశర్మ పాలను మట్టిలో పోసి దుర్వినియోగము చేయుచున్నాడని అభియోగము మోపాడు. బ్రాహ్మణులు అధికారికి ఫిర్యాదు చేశారు. విచారశర్మ తండ్రిని ఏకదత్తుని బ్రాహ్మణులు అందరూ మందలించడం జరిగింది. తండ్రి యజ్ఞశర్మ (ఏకదత్తుడు) స్వయముగా తన తనయుని గురించి తెలిసికొందామని కుమారుడుండుచోటికి వెళ్ళాడు. దూరము నుంచి విచారశర్మ పాలను మట్టిలోపోయుచుండుట చూచాడు. కుమారుడు తన కడుపున చెడబుట్టాడని, సరిగా ఏమి జరుగుచున్నది చూడక - విచారశర్మ ధ్యానములో నిమగ్నుడై యుండగా విచారశర్మను కర్రతో కొట్టాడు. పాలకుండను తోశాడు. విచారశర్మ కళ్ళు తెరచి తండ్రి శివాపరాధము చేశాడని ఒక కర్రను తీసికొని తన తండ్రి కాళ్లమీద కొట్టుటకు విసిరాడు. కర్ర గొడ్డలయి అయన కళ్ళను నరికివేసింది. తండ్రి చనిపోయాడు. ఇదంతా శివలీల. విచారశర్మను పరీక్షించుటకు జరిగింది. విచారశర్మ ఏమి జరిగినది జరుగుచున్నది గమనించలేదు. మళ్లీ ధ్యానములో నిమగ్నుడైపోయాడు.

పరమేశ్వరుడు విచారశర్మ శివదీక్షకు అమితంగా సంతోషించి పార్వతీదేవితో ప్రత్యక్షమయ్యాడు. శివుడు విచారశర్మను కౌగలించుకొని లాలించాడు. ఆ క్షణమే విచారశర్మ శివస్వరూపుడైనాడు. శివుడు తన మొడలోని హారమును తీసి విచారశర్మ మెడలో వేశాడు. విచారశర్మకు సారూప్యముక్తి లభించింది. శివుడు చెప్పాడు. "నీవు నీ తండ్రిగారి కాళ్లను నా కొరకు నరికావు. నేను ఈ రోజునుంచి నీకు తండ్రిని. నీకు చండీశ్వరతత్వము నిచ్చుచున్నాను. నీవు నాకు ఆహారము, పూలమాలలు, వస్త్రములు ఇచ్చి నన్ను అర్చించావు. ఈ రీతినే భక్తులు గూడ అర్చిస్తారు".

పరమశివునిపై అనితరభక్తిమూలాన్న తండ్రి హత్యాపాతకము అంటలేదు. శివుని మహాభక్తునిచే చంపబడ్డాడు కావున విచారశర్మ తండ్రికి గూడ శివసాయుజ్యమబ్బింది.

Subrahmanyam Gorthi

unread,
Nov 22, 2014, 10:02:20 PM11/22/14
to babasatsang
కారైక్కల్ అమ్మయ్యారు (కారక్కాల్ అమ్మ)


చోళదేశములో కరైకల్ అను గ్రామములో, వైశ్యకులంలో ధనదత్తుడను మంచి వర్తకుడున్ను, దనవంతుడును కలడు. సంతానలేమిచే భగవంతుని గూర్చి ధనదత్తుడు, అతని భార్య ప్రార్థించగా ఈశ్వర కృపచే ఒక కుమారై జన్మించినది. ఆమెకు పుణ్యవతి అని నామకరణం చేశారు. పుణ్యవతికి మొదటి నుంచి శివుడన్న, శివభక్తులన్నా ప్రీతి మెండుగా యుండేది. తండ్రి ఆమెను పరమదత్తునకు ఇచ్చి వివాహము చేసి, తమకు ఆమె ఒక్కతే పుత్రిక అగుటచే తమ ఇంటి ప్రక్కన ఒక మేడ కట్టించి ఆ దంపతులను ఆ మేడలో కాపురముంచారు. అల్లుడు పరమదత్తుడు గూడ మంచి వ్యాపారి. ఒక వ్యాపారమారంభించి విశేష ధనము ఆర్జింప సాగాడు. పుణ్యవతి భర్త ఐశ్వర్యమునకు మిడిసి పడక, గర్వపడక, శివుని పూజించుచును, శివభక్తులను ఆదరించుచును గడిపెను.

ఒక రోజున పరమదత్తుడు తమ ఇంటికి రెండు మామిడి పండ్లను పంపాడు. వానిని ఆమె జాగ్రత్త పరచుచుండగా ఒక శివభక్తుడు క్షుధార్తుడై డస్సి వచ్చాడు. అది భోజనమునకు వేళ. అందుచే పుణ్యవతి ఆయనను అర్చించి భిక్ష పెట్టినది. తన దగ్గర ఏమీలేక పోవుటచే భర్త పంపిన రెండు మామిడి పళ్లలో నొకదానిని ఆ భిక్షకుని కిచ్చినది. మధ్యాహ్నం అయింది. భర్త పరమదత్తుడు ఇంటికి భోజనానికి వచ్చాడు. పుణ్యవతి భర్తకు భోజనములో రెండవ మామిడి పండును వడ్డించింది. దానిని భుజించి ఇది చాలా మధురంగా వుంది రెండవది గూడ వేయుము అని భర్త అడిగాడు. పుణ్యవతికి పాలుపోలేదు. లోనికి బోయి పరమ శివుని ధ్యానించుట మొదలిడింది. పరమేశ్వరుడు కరుణించి ఆమె చేతిలో ఒక మామిడి పండును వచ్చునట్లు చేశాడు. ఆమె ఆశ్చర్యపడి, ఈశ్వరుని కృప అని యెంచి భర్తకు ఆ మామిడి పండును వడ్డించినది. భర్త దానిని గూడ భుజించి - ఇది ఇంకను విశేషముగా మధురముగా నున్నది. ఈ లోకమునకు సంబంధించినట్లుగా తోచదు. ఇది నీకు ఎట్లు వచ్చింది అని అడిగాడు. పుణ్యవతి జరిగినది నిజము చెప్పినది. భార్తనమ్మక - నీవు చెప్పినది నిజమైతే - ఆ పరమేశ్వరునే అడిగి ఇంకొక పండు తెమ్మనెను. పుణ్యవతి శివుని ప్రార్థించినది. వెంటనే ఇంకో మామిడి పండు - భర్త చూచుచుండగా - ఆమె చేతిలోనికి వచ్చింది. దానిని భర్త చేతిలో పెట్టింది. భర్త చూచుచుండగా ఆ పండు మాయమైపోయింది. పరమదత్తుడు విస్మయుడై ఈ పుణ్యవతి సామాన్య స్త్రీ గాదు. ఈమె ఒక దేవత. ఈమెతో కాపురం చేయటం పాపం అవుతుంది - అనుకొని ఆమెతో నుండ నిచ్చగించక విదేశవ్యాపారానికి వెళ్తున్నానని పడవనిండా సరుకులతో, ఆ వూరువిడిచి, పాండ్య దేశంలో ఒక పెద్ద పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వేరొక వైశ్యస్త్రీని పెండ్లాడాడు. ఒక కూతురు పుట్టింది. కుమార్తెకు మొదటి భార్యపేరు పుణ్యవతి అని పెట్టాడు.

పుణ్యవతి బంధువులు ఆమె భర్త వేరొక పట్టణంలో వుండుట చూచి - పుణ్యవతిని పల్లకిలో ఎక్కించుకొని పరమదత్తుని పట్టణమునకు తీసుకువెళ్ళి పరమదత్తుని ఇంటికి చేర్చారు. పుణ్యవతిని చూడగానే పరమదత్తుడు, తను అతని రెండవ భార్య, తన కుమార్తె తోను పుణ్యవతి కాళ్లపై పడి నమస్కరించాడు. భర్త భార్యకు నమస్కరించుట తప్పు అని అక్కడ పెద్దలు చెప్పారు. అతను ఆమెకు దూరముగా నుండుటకు, ఇప్పుడు ఆమె కాళ్లపై బడుటకు కారణమేమని ప్రశ్నించారు. అతను ఆమెను నేను ఒక దేవతగా నెంచుచున్నాను. భార్యగా పరిగణించలేక పోతున్నాను. ఆమె సామాన్య స్త్రీ గాదు. ఆమె మహిమ మీకు తెలియదు అని చెప్పాడు.

భర్త మానసిక స్థితిని అర్థము చేసుకుని పుణ్యవతి దేవుని పరమేశ్వరా నా భర్తగారి ఆనందము కొరకై సుందరిగా నండ కోరాను. భర్తనన్ను తిరస్కరించినారు గనుక నా అందమును తీసివేసి నాకు ప్రేత శరీరమును దయచేయుము అని ప్రార్థించినది. ఆమె అభ్యర్థన వెంటనే అనుగ్రహింపబడినది. ఆమె ప్రేత శరీరముతో ఆస్థి పంజరముతో నిలిచింది.


బంధువులరు ఆమె దేవతా స్త్రీయే నని నిశ్చయించుకొని వెళ్లిపోయారు. పుణ్యవతి ఇక్కడ నేనెందుకు అని కైలాసానికి బయలుదేరింది. కైలాసము సమీపిస్తుండగా ఈ కైలాస పర్వత భూమిమీద కాళ్ళతో నడువరాదు అని శిరముతో నడిచి శివుని సన్నిది చేరినది. మాతృమూర్తి పార్వతీ దేవి ఆమెను చూచి ఆశ్చర్యపడి - ఈ మహాత్మురాలి చరిత్రము చాలా విస్మయముగా వున్నది. ఆమెను గురించి చెప్పవలసినదని పరమశివుని ప్రార్థించినది. ఈమె మనలను రోజు వినితించు శీలవతి. ఆమె కోరి ఇట్టి దేహమును పొందినది అని ఆమె గూర్చి చెప్పాడు. ఇంతలో పుణ్యవతి ఆదిదంపతులను సమీపించి దేవా! నాకు పునర్జన్మ లేకుండునట్లు అనుగ్రహింపుము. ఒక వేళ పునర్జన్మ తప్పనిసరి అయిన నాకు మీ యెడల అచంచలమైన, నిర్మలమైన, శాశ్వతమైన, ఒడలు ఉప్పొంగు గాఢమైన, అనితరమైన భక్తి అనుగ్రహించండి. మిమ్ములను ఎన్నడూ మరువకుండులాగునా, మీరు నృత్యము చేయుచున్నప్పుడు మీ పాదముల చెంతనుండి మిమ్ములను కీర్తించులాగున, మీ అనుగ్రహ కృప నాపై నుంచండి అని వేడుకున్నది.

పరమశివుడు ఆమెకు 
ఆ వరము ఇచ్చి, దక్షిణదేశములో తిరువాలంగాడు వెళ్లి అక్కడ నివసించుచు నా నృత్యమును చూడుము అని ఆదేశించినాడు. ఆమె తిరువాలంగాడు శివుని సన్నిధిని శివుని కీర్తిస్తూ వుండినది.

Subrahmanyam Gorthi

unread,
Nov 23, 2014, 8:05:40 PM11/23/14
to babasatsang
పూసలార్‌ నాయనారు

పూసలారు తొండైమండలములోని తిరునిన్రావూరు బ్రాహ్మణుడు. ఆయన మానసికోపాసన మహోత్కృష్టముగా భాసించింది. బాహ్య విగ్రహారాధన కన్న మానసిక పూజ వెయ్యిరెట్లు అధికమైన మహాత్మ్యము కలది. మానసికోపాసన సమాధి స్థితిని, ఆత్మ దర్శనమును త్వరితము చేస్తుంది.

పూసలారు పరమశివునికి దేవాలయము నిర్మించదలచాడు. దానికొరకు ఆయన వద్ద ధనము లేకపోయింది. అందుచే మనోమందిరమును నిర్మించదలచి ఆ దేవాలయమునకు కా
లసిన సరంజామా అంతా మనసులోనే సేకరించి ఒక మంచి ముహూర్తాన శంఖుస్థాపన చేశాడు. మనోమందిరము పూర్తయింది. దేవుని ఆదేవాలయములో నిలుపుటకు ఒక స్థిరముహూర్తము నిశ్చయించాడు.

ఇలా వుండగా కడవ రాజుగూడ కంచిలో ఒక బృహదీశ్వరాలయము నిర్మించాడు. దైవ ప్రతిష్ఠకు ఒక ముహూర్తము నిర్ణయించాడు. కడవరాజు గూడా పరమశివభక్తుడు. కాకతాళీయంగా పూసలారు ముహూర్తము, కడవరాజు ముహూర్తము ఒకటే అయినవి. పరమశివుడు వూసలారు యొక్క భక్తి ప్రపత్తి - రాజుగారి భక్తిని మించిపోయిందని లోకానికి తెలియబరచ దలచాడు. అందుకని రాజుగారికి కలలో కనిపించి కంచిదేవాలయంలో దైవ ప్రతిష్ఠకు ఇంకొక ముహూర్తము నిర్ణయించవల్సినదినియు - ఆ సమయమునకు తానుమహాభక్తుడైన వూసలారు నిర్మించిన మందిరములో ప్రతిష్ఠకు వెళ్తునట్లుగాను చెప్పాడు.



రాజుగారికి ఆశ్చర్యమేసింది. నిద్రలేచి భగవంతుడు పేర్కొన్న భక్తుడైన పూసలారు దర్శనము చేసికొనుటకును, అతను నిర్మించిన దేవాలయం దర్శించుటకును తిరునిన్రావూరు వెళ్ళాడు. అక్కడ దేవాలయము వెదికాడు. కనిపించలేదు. పూసలారు గృహమునకు వెళ్ళి - ఆయనకు తన కలగూర్చి చెప్పి పూసలారు నిర్మించిన దేవాలయమును చూపమని అర్థించాడు. రాజుగారి కల వినగానే పూసలారు స్థబ్ధుడయ్యాడు. "నేనెంత సామాన్యుడను. దేవదేవుడు ఎంత ఔదార్యముతో నా మానసిక మందిరం నే తన మందిరంగా భావించ నిచ్చగించాడు? ఎంత కరుణామూర్తి. నన్ను నిజముగ ధన్యునిగా చేశాడు మహేశ్వరుడు" అనుకుని - రాజుగారితో "మహారాజా! దేవదేవుడు కరుణామయుడు. అది నా మానస మందిరమే" అని చెప్పాడు. రాజుగారికి పరమాశ్చర్యము వేసింది. పూసలారు అనితర భక్తికి ముగ్ధుడై ఆయన కాళ్లకు మొక్కాడు. పూసలారును అనేక విధముల అర్చించాడు. పూసలారు తాను అనుకున్నవిధంగా తమ మానస మందిరంలో దేవదేవుని వుంచాడు. ప్రతిష్ఠ చేసి - నిరంతరార్చన సలిపాడు. అంత్యమున పూసలారు నాయనారు పరమశివుని సాన్నిధ్యానికి చేరాడు.
***

Subrahmanyam Gorthi

unread,
Nov 24, 2014, 3:59:37 PM11/24/14
to babasatsang
పెరుమిజహలాయి కురుంబ నాయనారు

గురువు దేవుడే. సర్వము తానేయయిన వాడు. అందరిలో, నీలో, నాలో తనలో వున్నవాడు. ఎప్పుడును నిను విడిచి యుండనివాడు. మనల్ని పోషించువాడు. దేవుడు మనకు గురువు రూపంలో ప్రత్యక్షమవుతాడు. గురువును నమ్మి సేవించిన వారికి అష్టసిద్ధులు కరతలామలకము అవుతాయి. పెరుమిజహలాయి కురుంబనాయనారు గురుభక్తిలో అందరిని మించిపోయారు. ఆయనకు శివునిమీద, శివభక్తులమీద అపార భక్తితత్పతర వుంది. సుందరమూర్తి నాయనారు గూర్చి విన్నారు. మనసులో ఆయనే తన గురువు అని నిశ్చయించుకున్నాడు. ఆయనే తన శరణాగతి. మనస్సులో, ఆలోచనలలో, మాటలలో, చేతలలో అంతటా ఆయనకు సుందరమూర్తే. గురుకృపచే అన్ని సిద్ధులూ ఆయనకు లభ్యమయ్యాయి అయినా శివభక్తిలో, గురుభక్తిలో లీనమై పోయేవాడు.

ఈలోగా సుందరమూర్తి తిరువంచైకము వచ్చారు. ఇచ్చటనుండే అయన శివసన్నిదికి చేరుకున్నారు. కురుంబనాయనారు యోగదృష్టితో ఇది జరుగబోతుందని గమనించారు. గురువు వెళ్ళిపోయిన పిదప ఈ ప్రపంచంలో తానుండ దలచుకోలేదు. అందుకని శివయోగ ప్రక్రియలో నాయనారు తన దేహమును వీడి, సుందారమూర్తి నిష్క్రమణకు ఒక రోజు ముందరే తను శివసానిధ్యము చేరుకున్నాడు.
***
మూలము: http://www.telugubhakti.com/telugupages/Nayanars/Nayanars.htm

Subrahmanyam Gorthi

unread,
Nov 25, 2014, 2:03:55 PM11/25/14
to babasatsang
పూగజ్‌ తునాయి నాయనారు


పూగజ్‌ తునాయి నాయనారు శేరువిల్లివుత్తూరుకు చెందిన ఆది శైవస్థుడయిన ఋషి. పరమ శివభక్తి తత్పరుడు. దేవాలయ అర్చకుడు. శైవాగమాల ప్రకారము మంత్ర యుక్తముగా అభిషేకము, నిత్యార్చన నిష్టగా పట్టుదలతో చేయుట ఆయన నిత్యకృత్యము.

ఒకసారి దేశంలో కరువచ్చింది. ఆహారము కొనుటకు గూడ డబ్బు లేకపోయింది. ఆయనకున్న నిరంతర ధ్యాన తత్పరత, శివ సేవాతత్పరత ఆకలితో నకనకలాడుతున్నా - దేవాలయం విడిచి పోవుటకు ఆయన మనసంగీకరించలేదు. పూజచేస్తూనే వున్నాడు. బక్కచిక్కి ఆయన అస్తిపంజరము బయటపడ్డది. అయినా ఆ ప్రదేశాన్ని నాయనారు విడువలేదు. ఓపిక లేకపోయినా ఒకరోజున అభిషేకానికి దేవాలయానికి జలము తెచ్చి శివలింగానికి అభిషేకము చేస్తూంటే చేతిలోని కడవ జారి శివలింగముపై పడింది. నాయనారు మిక్కిలి అలసట మూలాన సృహకోల్పోయాడు. పరమ శివుడు ఆయన కలలో కనిపించి, కరువు సమసిపోయేటంత వరకు గుళ్ళో రోజు ఒక నాణెము విడిచి పెడతానని - దానితో ఆహారము తెచ్చుకుని తినమని ఆదేశించాడు. నాయనారు లేచి చూస్తే తన కల నిజమే ననిపించింది. ఎదురుగా ఒక నాణెం కనబడింది. ఈ విధంగా భగవంతుడు కరువు తీరేటంతవరకు సహాయము చేశాడు. నాయనారు విడువకుండ తన శివపూజను కొనసాగించి అంత్యమున శివసాయుజ్యమందినాడు.

***
మూలము: http://www.telugubhakti.com/telugupages/Nayanars/Nayanars.htm

Subrahmanyam Gorthi

unread,
Nov 26, 2014, 12:03:37 PM11/26/14
to babasatsang
నామినంది ఆడిగళ్ నాయనారు

చోళరాజ్యంలో ఏమాపెరూరు (ఇప్పుడు తిరుమప్పత్రు లేక నైప్పెరు) గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో నామినంది ఆడిగళ్ జన్మించాడు. ఈ ఊరు నుంచి తిరువారూరునకు 2 గంటల నడక దూరముంది. పరమశివుడే నామినంది రక్షకుడు. ప్రతిదినము తిరువారూరు వెళ్లి శివుని అర్చించి వచ్చేవాడు. మనుష్యునకు పరమశివుని పదకమలముల పూజయే సార్థకతని ఇస్తుందని తలచేవాడు. ఒక రోజున తిరువారూరు శివునికి ఏ విధమైన అర్చన చేసిన బాగుండునోనని ఆలోచిస్తే దేవునికి దీపారాధన ఉత్కృష్టమైనదని అనిపించింది.

సూర్యుడస్తమించబోతున్నాడు. పట్టణంలోనికి వెళ్లి దీపారాధనకు నెయ్యి తీసుకురావడానికి ఆలస్యమవుతుందని తోచింది. అందుకని దగ్గరలో నున్న ఇంటికి వెళ్లి శివునికి దీపారాధనకు కొంచెం నేయి ఇమ్మని ప్రార్థించాడు. ఆ ఇల్లు శివారాధనకు వ్యతిరేకులైన జైనుల ఇల్లని
అతనికి తెలియదు. వారు ఇతనిని హేళన చేశారు. చేతిలో అగ్నిని ఉంచుకొన్న పరమశివునికి దీపం పెట్టడం సూర్యుని ముందు దివిటీ అని వెక్కిరించి, నీవు దీపాలు వెలిగిగించ దలచుకుంటే నీళ్లతో దీపాలను వెలిగించాలని మొరటుగా జవాబు ఇచ్చారు. ఈ మాటలు వినగానే నంది ఆడిగళ్ కు చిన్నతనమనిపించినది. హృదయావేదన కలిగింది. దుఃఖిస్తూ గుడిలోనికి వెళ్లి దేవుని పాదాలమీద పడ్డాడు. దేవుని హృదయ విదారకంగా ప్రార్థించాడు. ఇంతలో ఒక అశరీర వాణి వినిపించింది. నీరు తెచ్చి ఆ నీటితో దీపాలు వెలిగించమన్న మాటలు వినబడ్డాయి. పరమానందభరితుడై నామినంది ఆడిగళ్, నీళ్ళతో దీపాలన్నీ వెలిగించాడు. ఈ అద్భుతాన్ని చూచి వెక్కిరించిన జైనులందరూ ఆశ్చర్య చకితులైయ్యారు. నంది ఆడిగళ్ - ఇలా - చాలారోజులు దీపాలను వెలిగించాడు.

చోళరాజు నామినంది ఆడిగళ్ గూర్చి చాలా గొప్పగా విన్నాడు. విని అతనిని ఆ ఆలయానికి అధికారిగా నియమించాడు. రాజు దేవునికి పంగుణి ఉత్తరం పండుగను ఘనంగా జరిపేవాడు. గంగను శిరసున ధరించిన శివుని మాటలుగా ఆపని చేయ నిశ్చయించి తన కలశంలో అంతటా నీరుని నింపి దీపారాధన కుందిలో ఆ నీరు పోసి వత్తివేసి వెలిగించాడు. వత్తి దేదీప్యమానంగా వెలిగింది. అవిచూసి ఆ నీరుతో దేవాలయంలోని దీపాల నన్నిటిని వెలిగించాడు. జ్యోతులు ప్రజ్వరిల్లినవి. దేవుని ఊరేగిస్తూ తిరువారూరులికి తీసికొని వెళ్ళేవారు. అక్కడ అన్ని కులాలవారు చుట్టూ మూగి ఆయనను అర్చించేవారు. అలా జరిగిన ఒక రోజున నామినంది దేవాలయం పనులన్నీ పూర్తయాక ఇంటికి వచ్చాడు. తిరువావూరులో అన్ని కులాల వారిని ముట్టుకొని వచ్చానని, అందుకే అపవిత్రుడయినట్లుగా భావించి, ఇంటిలోనికి వెళ్లి దేవుని అర్చించకుండ నిద్రకుపక్రమించాడు. తన భార్యను పిలిచి స్నానానికి నీళ్ళు తెప్పించి స్నానము చేసి ఇంట్లోకి వెళ్దామనుకున్నాడు. కాని చాలా అలసిపోవటంతో నిద్ర ముంచుకువచ్చింది. కలలో శివుడు కనిపించి, అతనితో ఇలా అన్నాడు. "నందీ! తిరువావూరులో పుట్టిన వాళ్లంతా నా గణాలే (నా సేవకులే) వాళ్లని నీవు అపవిత్రంగా భావించకూడదు ఇది నువ్వే నీ కళ్ళతో చూస్తావు" అన్నాడు. నంది అడిగళ్ నిద్రలేచాడు. ఇదంతా భార్యకు చెప్పాడు. తనలోని చెడ్డ తలంపుకు విచారించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి దేవుని అర్చించాడు. మరునాటి వేకువన తిరువారూరు వెళ్లాడు. అక్కడ అతనికి అంతా శివమయంగా కనిపించింది. అక్కడ పుట్టిన వాళ్లంతా శివ స్వరూపులుగా కనబడ్డారు. అందరూ శివరూపంలోనే పున్నారు. ఇదంతా పరమేశ్వరుని లీల అని నంది గ్రహించాడు.

నంది ఆడిగళ్ తిరువారూరును స్థిరనివాసం చేసుకున్నాడు. అచ్చట శివుని, శివభక్తులను నిష్టతో కొలిచేవాడు. అతని భక్తి తత్పరతను చూచి అందరూ అనిపోన్ (మేలిమి బంగారము) అనిపిలిచేవారు. అంత్యమున శివసాయుజ్యమును పొందినాడు.
***
మూలము: http://www.telugubhakti.com/telugupages/Nayanars/Nayanars.htm

Subrahmanyam Gorthi

unread,
Nov 27, 2014, 9:21:48 PM11/27/14
to babasatsang
తిరునీలనక్కనాయనారు


శాత్తమంగలము అను ఒక నగరము కావేరీతీరమున గలదు. అందు తిరునీల నక్కనాయనారు అను శ్రోత్రియ బ్రాహ్మణ శివభక్తుడొకడు సదాచారసంపన్నుడై నివసించుచుండెను. అతడు సమస్త వేదశాస్త్రములను అభ్యసించెను. షట్కాల శివపూజా ధురంధరుడై శివభక్త ఆరాధకుడై సమస్త జనులచే స్తుతింపబడుచుండెను.

ఒక పర్వదినమున శివునికి విశేషార్చన చేయదలచి, పూజాద్రవ్యములను వెండి పళ్లెరమున బెట్టి తన వెంటగొనిరమ్మని భార్యను నియమించి, శివాలయమున కేగి అర్చన ప్రారంభించి చేయుచుండెను. అతని యిల్లాలు కూడా భక్తితత్పరయై చెంతనే కూర్చుండి శివార్చనను శ్రద్ధతో చూచుచుండెను. ఇంతలో ఒక సాలెపురుగు పైకప్పు నుండి శివలింగము శిరోభాగమున పడెను. ఆమె అది చూచి, వెంటనే నోటితో ఊది ఆ విష కీటకమును శివలింగము పైనుండి పారద్రోలెను. ఆమె ఊదినపుడు నోటి నుండి తుంపరులు వెలువడి శివలింగముపై పడెను. దానిని చూచిన నాయనారు ఆమెపై మిక్కిలి కోపించి, ''ఓసీ దురాత్మురాలా! శివలింగముపై ఉమ్మి, అపవిత్రము గావించితివి. ఆ కీటకమును పారద్రోలుటకు ఇంకొక మార్గమే తోచలేదా! మూఢురాలా! ఈ క్షణమునుండి నీవు నా భార్యవు కావు-పొమ్ము'' అని కఠినముగా పల్కి ఇంటికి బోయెను. ఆమె మిక్కిలి దుఃఖించి, భర్త శాసనమును కాదనలేక ''ఇక ఆ పరమేశ్వరుడే నాకు దిక్కు'' అని తలచి, శివపాద సన్నిధిని శిరమును జేర్చి మేనువాల్చి, ఆ రాత్రి శివుని ధ్యానములో గడిపెను.

ఆమె భక్తికి పరవశించి శివుడు ఆనాటి రాత్రి నాయనారుకు స్వప్నమున దర్శనమొసగి, ''నాయనారూ! నీవు చాల తొందరపడితివి. నీ భార్య నాకు తల్లివలె ఊది సాలె పురుగును తొలగించి మహోపకారమొనర్చినది. ఆ కీటకము పడుటచే, ఆ తల్లి ఊదిన భాగము తప్ప మిగిలిన నా శరీర భాగమంతయు ఎట్లు తట్టు తేరినదో చూడుము'' అని చూపించెను. నాయనారు సంభ్రమాశ్చర్యములతో లేచి చూడ, శివుడు అంతర్ధానమొందెను. అతడు వెంటనే ఆలయమునకు పోయి భార్యతో తన స్వప్నవృంత్తాంతమును జెప్పి, సగౌరవముగ ఆమెను ఇంటికి తీసుకునివచ్చి, యధాపూర్వకముగా సంసారము చేయుచుండెను. భార్యభర్తలు ఇద్దరూ శివుని లీలను తలచుచూ నిత్యము శివుని భక్తి శ్రద్ధలతో కొలుచు చుండిరి.

ఇట్లుండ కొంత కాలమునకు తిరుజ్ఞానసంబంధమూర్తి తన శిష్యులతో తీర్ధయాత్రలు చేయుచు శాత్తమంగలమునకు రానున్నాడని నాయనారు వినెను. మహా మహిమాన్వితుడైన తిరుజ్ఞాన సంబంధమూర్తి దివ్యదర్శన భాగ్యము ఎన్నడు చేకూరునో అని వేయి కన్నులతో వేచి చూచు చుండెను. నాయనారు ఈ శుభవార్తను నగరమందలి పెద్దలకు, పిన్నలకు తెల్పి నగరమంతను అలంకరింప జేసి, మేళతాళాలతో సకుటుంబ సపరివార సమేతంగా ఎదురేగి తిరుజ్ఞానసంబంధమూర్తిని గాంచి పాదములపై వ్రాలి తన యింటిని పావనమొనర్ప దయచేయుడని ప్రార్ధించెను. తిరుజ్ఞానసంబంధమూర్తి - నాయనారు వినయ విధేయతలకు భక్తికి సంతసించి, అతని ఇంటనే బస చేసెను.

ఆనాటి రాత్రి సంబంధారు తనతోపాటుగా వచ్చిన యఝపనారు, అతని భార్యను - తిరునీల నక్కనాయనారుకు చూపి, వారికి బస ఏర్పాటు చేయవలసినదని ఆదేశించెను. యఝపనారు తక్కువ కులమునకు చెందినవాడు; అందువలన తిరునీలనక్కనాయనారు ఆ దంపతులకు తమ గృహములోనే ఆతిధ్యమిచ్చుటకు సంకోచించెను; చివరకు అచటకు దగ్గరలో ఉన్న ఒక యజ్ఞశాలకు ఆనుకుని విడిగా ఉన్న ఒక కుటీరములో ఆ దంపతులకు బస ఏర్పాటు చేసి, వారిని అచటకు తోడ్కొని పోయెను. ఆ దంపతులు యజ్ఞశాలను దాటుకుని, కుటీరములోనికి వెళ్ళుచుండగా, అచటనున్న యజ్ఞవాటికలో అగ్ని తనంత తానుగా వెలిగి ప్రజ్వలింప సాగెను. ఈ అద్భుతమును కన్నులారా వీక్షించిన తిరు నీలనక్క నాయనారు ఆశ్చర్యపోయెను. అంతటితో అతనిలో అంతవరకూ గూడు కట్టుకొని ఉన్న కుల మత వివక్షత సమూలముగా సమసిపోయెను.

మఱికొంత కాలమునకు తిరువల్లూరున తిరుజ్ఞానసంబంధమూర్తి కల్యాణ మహోత్సవమునకు నాయనారు వెళ్ళి, కల్యాణమును తిలకించి తిరుజ్ఞానుని సేవించుచూ అక్కడ కొంత కాలము ఉండి చివరకు శివసాయుజ్యమొందెను.

Subrahmanyam Gorthi

unread,
Nov 28, 2014, 11:36:27 AM11/28/14
to babasatsang
అప్పుడి నాయనారు


గురుభక్తి విషయంలో అప్పుడి నాయనారును చెప్పి మరొకరి గూర్చి చెప్పాలి. అయన గురుభక్తి నిరుపమానము. మహా శివభక్తుడు. గృహస్తుగా తన ధర్మాన్ని జాగరూకతతో నిర్వహించేవాడు. చోళదేశంలోని తొంగలూరు భ్రాహ్మణుడాతడు.

అప్పుడి నాయనారు - అప్పారు యొక్క ఖ్యాతి విన్నాడు. పల్లవరాజు అప్పారును శిక్షించి నట్లును, శిక్షగా అప్పారును బండరాయికి కట్టించి సముద్రములో పడవేస్తే దైవ కృపచే బండ తేలిపోయి అప్పారును సురక్షితముగా తీరాన్ని చేర్చినదని మొదలైన కథలన్నీ అప్పారు గురించి విన్నాడు. అయన పనులకు ముగ్దుడై అప్పారును చూడక పోయినా అప్పారును తన గురువుగా నెంచుకొని గురుపూజా దురంధరుడయ్యాడు. పరమశివుడు భక్తులయెడ కృపతో గురువుగా భాసిస్తాడు. అప్పుడి నాయనారు సదా గురు పద కమలములను ధ్యానిస్తూ వుండేవాడు. తన కుమారులకు వాగీశులని - పెద్దవాగీశుడు చిన్ని వాగీశుడని పేర్లు పెట్టాడు. గృహోపకరణములకు, తవ్వించిన నూతులకు, తటాకములకు, తోటలకు, అన్ని ధర్మకార్యములకు గురువు గారిపేరు మీద వాగీశునిధర్మము అని వుంచాడు.

అప్పారు ఒక రోజున తింగలూరు మీదుగా ప్రయాణం చేస్తున్నాడు. ఒక జలాశయం దగ్గరకు వెళ్ళాడు. తన పేరే అంతటా కనబడింది. ఆశ్చర్యపోయాడు. బాటసారుల నుండి తీర్థయాత్రీకుల నుండి ఇవన్నీ అప్పుడి నాయనారు నిర్మించినవే నని తెలిసింది. విస్మయంతో అప్పుడి నాయనారు దగ్గరకు వెళ్లాడు. అప్పుడి నాయనారు ఈ శివభక్తుని సాదరంగా బహు నమ్రతతో ఆహ్వానించాడు. అప్పారు అప్పుడిని పలుకరించి మహాశయా! మిమ్ములను గూర్చి, మీ మంచి పనులగూర్చి పెక్కుమంది నుంచి విన్నాను. మీకు నా జోహారులర్పించ వచ్చాను. నాపై దయవుంచి తెలుపండి. ఈ ధర్మ కార్యాలన్నిటిపైనా మీ పేరుంచకుండా ఎవరిపేరో ఎందుకు పెట్టారు? అని అడిగాడు. ఈ విధంగా అతిసామాన్యంగా అప్పారు అడిగేటప్పటికి - అప్పుడికి ఒకింత కోపమే కలిగింది. స్నేహితుడా! నీవు శివభక్తుడివిగా కన్పడుతున్నప్పటికి వాగీశుని గూర్చి ఏమీ తెలియనట్లు కనపడుతున్నావు. పల్లవరాజు ఆయనను ఎన్ని బాధలు పెట్టాడు. దైవకృపచే ఎలా రక్షింపబడి శైవమత వ్యాప్తికి తోడ్పడ్డాడో తెలియదా? రాజుగారు అతనిని బండకు కట్టించి సముద్రములో త్రోయించిన సంగతి, ఎలా తేలిపోయి అయన సురక్షితంగా తీరము చేరాడో నీవు వినలేదా? ఎవరు నువ్వు అని అడిగాడు.

అప్పుడి నాయనారు గురుభక్తి తత్పరతకు అప్పారు చలించిపోయాడు. అప్పుడి నాయనారుతో నేను తీవ్ర రుగ్మతకు లోనయి శివుని పాదాలనాశ్రయించిన దీనుడను. పరమశివుని కృపచే ఆ తీవ్రరుగ్మత నుండి బయటపడి శైవమతానికి తిరిగివచ్చిన అల్పుడను అని అప్పారు అన్నాడు.

ఆ విధముగా అప్పుడి నాయనారు అప్పారు యొక్క ఘనతను ముచ్చటించగా, అప్పారు తన లోపముల గూర్చి చెప్పాడు.

ఈ పై మాటలు ఆ శివభక్తుని నోట వినగానే, తన గురువైన అప్పారుతోనే తాను స్వయముగా మాట్లాడుతున్నానని అప్పుడి నాయనారుకి అర్థమైంది. తన గురువే తనయెదుట సాక్షాత్కరించాడని. అప్పుడి నాయనారు అప్పారుకు ప్రణతులనర్పించి తాను తన భార్య కలిసి అప్పారును అర్చించారు. తమ నుండి బిక్షను తీసికొనవలసినదిగా అర్థించాడు. అప్పారు బిక్షకు అంగీకరించాడు. అప్పుడి నాయనారు తనయుడు అరిటి ఆకులను తీసుకుని వచ్చుటకు తోటలోనికి  వెళ్లగా, అతనిని పాము కరిచింది. ఆ తనయుడు గూడ శివభక్తుడే. అమ్మ చేతిలో ఆకుల నుంచుతూ పాము సంగతి చెప్పి మరణించాడు.

అప్పుడి నాయనారు ఇది గమనించి అతిథి మర్యాదకు భంగము కాకుండా, దుఃఖమును దిగమింగుకొని, అప్పారును భోజనానికి రమ్మని పిలిచాడు. అప్పారు అప్పుడి నాయనారుకి, అప్పుడి నాయనారు భార్యకు భస్మమిచ్చి మీ పిల్లవానిని పిలువమన్నాడు. అప్పుడి నాయనారు -  ఆతను రాలేని పరిస్థితిలో వున్నాడని బదులు ఇచ్చాడు. అప్పారు అప్పుడి నాయనారుని నిజం చెప్పమని నిలదీశాడు. అప్పుడి నాయనారు - జరిగినది చెప్పాడు. అప్పారు వెంటనే అప్పుడి నాయనారుతో తన తనయుడి శవాన్ని దేవాలయం ముందరకు తెమ్మన్నాడు. అక్కడ అప్పారు ఒక పాటలో దేవుని వినుతించాడు. ఒక అద్భుతం జరిగింది. పిల్లవాడు నిదుర నుంచి లేచినట్లుగా లేచాడు. అందరూ సంతోషించారు. తల్లిదండ్రులు మాత్రము అథితి భోజనమునకు ఆలస్యమైనదని చింతించారు. అప్పారు వెంటనే కూర్చుని భోజనము చేశాడు. అప్పారు అప్పుడి నాయనారుతో కొంతకాలమున్నాడు. అప్పారు యెడ గురుభక్తి మూలాన అప్పుడి నాయనారుకి శివసాయుజ్యము లభించినది.

Subrahmanyam Gorthi

unread,
Nov 29, 2014, 10:44:16 AM11/29/14
to babasatsang
మూర్ఖ నాయనారు

మూర్ఖ నాయనారు తొండైనాడులోని తిరువెర్కటో కు చెందిన వెల్లాల పరమశివ భక్తుడు. ప్రతిరోజు మహేశ్వరపూజ చేసి భక్తులకు అన్నము పెట్టేవాడు. ఎన్ని అవాంతరములు వచ్చినను భక్తులకు తప్పనిసరిగా అన్నము పెట్టేవాడు. ఆ ఆతిథ్యముతో అతని సంపదంతా కరిగిపోయింది. ఆతిథ్యము కొనసాగింప కష్టమయింది.

అందుచేత మూర్ఖ నాయనారు ఒక విచిత్ర పధ్ధతిని ఎంచుకున్నాడు. అతనికి జూదము ఆడుటలో ఎంతో నేర్పరితనము కలదు. అందుచేత ప్రతివారిని పిలిచి తనతో జూదమాడేవాడు. ఆ జూదములో గెలిచిన డబ్బుతో శివభక్తులకు భోజనము పెట్టేవాడు. తనతో జూదము ఆడేవాళ్లకై ప్రతి ఊరు తిరిగి వెదికేవాడు. ఎవరినీ విడిచిపెట్టేవాడు కాదు. ఈ ప్రవృత్తిని చూచి అతనిని అందరూ మూర్ఖ నాయనారు అని పేరు పెట్టారు.

కాని సంపాదించిన ధనము యావత్తు తను దాచుకొనేవాడు కాదు. తనకు సొంతానికి వాడుకొనేవాడు కాదు. తన ఖర్చులకు గూడ ఆ ధనము ముట్టుకొనేవాడు కాదు. హృదయములో వున్న దేవుడు, ఇతని ఆతిథ్య విశేషము చూచి తన కృపను ఇతనిపై ప్రసరింపజేశాడు.

ఇది ఒక విపరీతమైన విషయము. మూర్ఖనాయనారు తీవ్ర శివభక్తిలో పరాభక్తిని చూపేవాడు. దాని న్యాయము దానిదే. మూర్ఖ నాయనారుకు దేవుడు తప్ప లోకము, లోకములోని కట్టడులు తెలియవు. దేవునిలో నివశిస్తాడు. దేవుని కొరకు జీవిస్తాడు. దేవునికే చెందినవాడు. ఇటువంటి పరిస్థితులలో పరమశివుడే సారధ్యము వహిస్తాడు. పూర్ణ శరణాగతిన కఠిన పరీక్ష పెడతాడు.

ఇది చాలా కష్టమైనా బాట. నారదమహర్షి - " యోగి ఋజుమార్గము తప్పరాదు. నీతి నియమములను ఉల్లంఘించరాదు. నీ వ్యక్తిత్వము నీకు తెలిసినంతకలము నీ ఋజువర్తనకే కట్టుబడియుండు. మూర్ఖముగా ఇతర యోగులను అనుకరించకు - ఏలనన - వారుండే మానసిక పరిస్థితికి, నీ మానసిక పరిస్థితికి చాలా అంతరాయముండవచ్చు. అందుకని నీ ఋజుమార్గమునే నీవు అనుసరించమని" చెప్పాడు.
***

Subrahmanyam Gorthi

unread,
Nov 30, 2014, 1:37:20 PM11/30/14
to babasatsang
ఆదిపత్త నాయనారు

ఆదిపత్తనారు ఒకయోగి. నాగపట్టణము దగ్గర నున్న నూలైపాడిలో జనించిన ఒక మత్సకారుడు. ప్రతిరోజు చేపలు పడుతూ - పట్టిన చేపలలో ఒక చేపను నిష్టగా పరమేశ్వరునకు నైవేద్యముగా నీటిలో వదిలి వేసేవాడు. శివుడు అతని గొప్పదనమును ఆవిష్కరించదలచాడు.

వరుసగా కొన్ని రోజులు కేవలం ఒక్క చేప మాత్రమే వలలో పడుట తటస్థిచింది. శివుని పేరుతో ఆ అన్ని రోజులు వలలో పడిన ఆ ఒక్క చేపను నీటిలో వదిలేశాడు. అతనికి ఆహారము లేకపోయేది. అయినా తన నిష్ట తప్పలేదు. ఒక రోజున వింతగా ఒక్కటే చేప బంగారు చేప వలలో పడింది. తన వ్రతాన్ని అనుసరించి, మరువక, ప్రలోభపడక అది బంగారు చేప అయినా సరే - ఆ ఒక్క బంగారు చేపను శివునికి నైవేద్యముగా నీటిలో వదిలేశాడు.

శివుడు ప్రత్యక్షమయి నిరక్షరుడు అయిన ఆ మత్స్యకారుడైన శివయోగిని ఆశీర్వదించాడు.

విద్వత్తుతోగాని, ప్రాణాయామ విధులతోగాని, వినుటచేగాని, ఎక్కువగా అనుటచే గాని - కాక - ఒక్క నిశ్చల భక్తితోనే భగవంతుడు భక్తసులభుడవుతాడు. నమ్రత స్వభావుడు, మనం తక్కువుగా నెంచే మత్స్యకారి యోగి దారి చూపాడు. నిష్ట అనేది వెంటనే పొందలేము. దేవుని యందు నిరతిశయమైన భక్తి, గాఢ నమ్మకముతోనే నిజమైన జ్ఞాన లభ్ది లభిస్తుంది. జీవుడు శివుడు కాగలడు. మనసు అనేక ప్రలోభాలతో మనలను మార్చేస్తుంది. నిష్ట నుండి తప్పిస్తుంది. అజ్ఞానులు పుస్తకాలపై ఆధారపడతారు. మంచి పండితునుకి వ్యాకరణంతో పనేముంది. దేవుని ప్రత్యక్ష స్వరూపముగా చూడగల వానికి పద సౌలభ్యత పరిజ్ఞానము ఎందులకు? వైదుష్యము నిరతిశయ భక్తికి తోడ్పడిననే ఉపకరిస్తుంది. లేనిచో ప్రతిబంధకమవుతుంది. గాఢమైన భక్తే అచంచల భక్తే మనను దరిచేర్చగలదు.

***

Subrahmanyam Gorthi

unread,
Dec 1, 2014, 2:18:40 PM12/1/14
to babasatsang
తిరుమూల నాయనారు


శైవ సిద్ధ పురుషులలో తిరుమూల నాయనారు ఒకరు. తిరునందిదేవారు ఎనిమిది మంది శిష్యులలో ఈయనొకరు. వారందరు యోగులే. మూలాన్ శరీరములో పరకాయ ప్రవేశము చేసినందున తిరుమూలారు అయినాడు.

పోతియ పర్వత పంక్తులలో వున్న అగస్త్య మహామునిని చూచుటకై కైలాసము నుండి తిరుమూలారు దక్షిణ దిశకు బయలుదేరాడు. త్రోవలో అనేక శైవ స్థలములను సందర్శించి తిరువాదూతురాయి చేరాడు. అక్కడ కావేరి నదిలో స్నానము చేసి దేవాలయమునకు వెళ్లాడు. దేవాలయము చుట్టూ రెండుసార్లు ప్రదక్షిణము చేసి, దేవుని కొలిచాడు. కావేరినది ఒడ్డున నడిచి వెళుతుండగా అక్కడ ఆవులమంద విచారముగా కన్నుల నీరు కారుస్తూ కనబడింది. దానికి కారణము తెలిసికొన్నాడు. ఆ ఆవుల కాపరి చనిపోయివున్నాడు. తిరుమూలారు ఆవులను దుఃఖ విముక్తులను చేయదలచి, తన శరీరమును ఒక చెట్టు తొర్రలో దాచి, ఆ ఆవుల కాపరి శరీరములోనికి పరకాయ ప్రవేశము చేశాడు.
ఆ కాపరి జీవించియున్నట్లు లేవగానే ఆవులు గంతులేశాయి. గ్రామంలోనికి వానిని తోలుకెళ్ళాడు. మూలాన్ ఇంటికి చేరాడు కాని పశువుల కాపరి భార్యకు భర్త కాలేకపోయాడు. "నేను నీ భర్తను కాను. శివుని ఆరాధించు. ముక్తిని పొందు" అని పశువుల కాపరి భార్యతో చెప్పాడు. భార్యకు ఇది విడ్డూరంగా తోచి పెద్దల ముందు ఈ విషయముంచినది. వారు ఆమె భర్త అనబడు తిరుమూలారును అనేక విధముల శోధించారు. అతనిలో ఆధ్యాత్మికముగ పెనుమార్పు వచ్చింది - అందుకని భార్యను అతనుకు దూరముగా వుండమన్నారు. మరునాడు తిరుమూలారు ఆవులను తోలుకొనివెళ్లి తన శరీరానికై చూచాడు అది కనిపించలేదు. ఇదంతా పరమేశ్వరుని లీల. తిరుమూలారు దైవ సంకల్పాన్ని అర్థం చేసుకున్నాడు.




తిరువాదూతురాయికి తిరిగి వచ్చాడు. దగ్గరవున్న రావి వృక్షము కింద తీవ్ర తపస్సు చేశాడు. సమాధి స్థితిలో 3వేల సంవత్సరములున్నాడు. ప్రతి సంవత్సరము సమాధి నుంచి బయటకు వచ్చి, ఒక పద్యాన్ని చెప్పేవాడు. అలా మూడు వేల సంవత్సరాలలో మూడు వేల పద్యాలు చెప్పాడు. ఈ గ్రంథాన్ని తిరుమందిరము అని పిలుస్తారు.

పరమేశ్వరుని సంకల్పము సిద్ధించింది. తిరుమూలారు తిరిగి కైలాసము చేరాడు.
***


Subrahmanyam Gorthi

unread,
Dec 2, 2014, 8:52:39 AM12/2/14
to babasatsang
ఇయర్‌కాన్ కలికామ నాయనారు

పొన్నినాడులోని తిరుపెరుమంగళంలో ఇయర్‌కాన్ కలికామ నాయనారు వుండేవాడు. వెల్లాల కులస్తుడు. ఆ కుటుంబమును ఇయర్‌కుడి అని పిలిచేవారు. చోళ రాజులకు సేనాధిపతులనిచ్చిన కుటుంబమది. కలికామనాయనారు మహాశివభక్తుడు.

సుందరమూర్తి నాయనారు పరమశివుని వరవయారు అను వారకాంత (వేశ్య) వద్దకు దౌత్యమునకు (మధ్య వర్తిత్వమునకు) పంపినాడని తెలిసింది. కలికామ నాయనారు మహోగ్రుడైనాడు. పరమశివుడంతటి వానిని తుచ్ఛుని ఇంటికి దౌత్యమునకు పంపుతాడా? వీనినేమి చేసినా పాపములేదు. వీని మొగము చూచిన పాపమగును" అని కోపించి - పరమశివునితో, "నీవు వెలయాలి ఇంటికి ఎట్లా వెళ్లావు?" అని బాధపడుట మొదలుపెట్టాడు.

ఈ సంగతి సుందరమూర్తి నాయనారుకు తెలిసింది. పరమశివుని కలికామ నాయనారు కోపమును మాన్పుమని కోరెను. పరమశివుడు వారిరువురుకు సఖ్యము చేయ నిశ్చయించి, కలికామ నాయనారుకు శూల వ్యాధి కలిగించెను. బాధకు తట్టుకోలేక కలికామ నాయనారు పరమశివుని ప్రార్థించాడు. పరమశివుడు అతనికి కనిపించి, "నీకు సుందరమూర్తి నాయనారు ఉపశమనము కలిగించగలడు" అని చెప్పాడు. కలికామ నాయనారు అది విని, "వానిచే నా బాధను తొలగించుకొనుట కన్న నాకు చావే మంచిది" అని శివునికి చెప్పాడు. శివుడు సుందరమూర్తి నాయనారునకు స్వప్నమున కనబడి, కలికామ నాయనారు శూలరోగమును నీవుపోయి తొలగింపుమని ఆదేశించాడు.

సుందరమూర్తి నాయనారు కలికామ నాయనారు ఇంటికి వస్తున్నానని వార్త పంపాడు. ఆ దురాత్ముని చూచుట కన్న నాకు మరణము మేలు అనుకొని, కత్తితో పొడుచుకొని ప్రాణము విడిచాడు. ఇంతలో సుందరమూర్తి నాయనారు అక్కడికి వచ్చాడు. అందరని నిశ్శబ్దముగా వుండమని కలికామ నాయనారు భార్య సుందరమూర్తి నాయనారును ఆహ్వానించి - ఆదరించినది. సుందరమూర్తి నాయనారు, "నేను కలికామనాయనారును చూడవలయు"నని చెప్పాడు. ఆయన నిద్రించుచున్నారని కలికామ నాయనారు భార్య చెప్పినది. అయినా చూస్తానన్నాడు. ఇక చేయునది లేక కలికామ నాయనారు శవమును చూపారు. కలికామ నాయనారు లేని ఈ భూమిపై నేనుగూడ నుండనని తాను గూడ పొడుచు కొనబోయెను.

శివుడు సాక్షాత్కరించి, కలికామ నాయనారును పురరుజ్జీవింప జేసినాడు. నాయనారులు ఇరువురు ఒకరినొకరు పరిష్వంగనము చేసుకొన్నారు. కలికామ నాయనారు తన శేష జీవితమును శివుని సేవలోను, శివభక్తుల సేవలోను నిమగ్నము చేసి, అంత్యమున శివసాయుజ్యమును పొందెను.
***

Subrahmanyam Gorthi

unread,
Dec 3, 2014, 2:21:18 PM12/3/14
to babasatsang
దండి ఆదిగళ్ నాయనారు

చోళదేశములో తిరువావూరులో దండి ఆదిగళ్ అనే శివభక్తుడుండేవాడు. అతను పుట్టు గ్రుడ్డి. అయినను పంచాక్షరిని అనునిత్యము జపించేవాడు. పరమశివుని అంతర్ దృష్టితో దర్శించుకునేవాడు. ప్రతి రోజు శివాలయానికి వెళ్లి స్వామిని కీర్తించుచు, సాష్టాంగ ప్రణామములు అర్పించేవాడు. ఆ దేవాలయమునకు పడమటి దిశన ఒక తటాకముంది. ఆడిగళ్ దానిని పెద్దది చేయ నిశ్చయించాడు. గ్రుడ్డివాడు ఎట్లు చేయగలడు? కాని ఎన్ని అవరోధములు ఎదురైనను తటాకమును పెద్దదిగా చేయ సంకల్పించుకున్నాడు. చెరువు మధ్యలో ఒక కర్రను పాతాడు. దానికి ఒక తాడు కట్టాడు. రెండవ చివరను ఒడ్డున వున్న ఇంకొక స్తంభానికి దానిని కట్టాడు. ఆ త్రాడు పుచ్చుకొని చెరువులో దిగేవాడు. త్రవ్వడము మొదలు పెట్టేవాడు. త్రవ్వి ఆమట్టిని  గంపలోనికి ఎత్తుకుని, త్రాడు సాయమున తీరమునకు వచ్చి ఆ గంప మట్టిని బయట పోసేవాడు.

అక్కడనున్న జైనులు అతనిని చూచి, "ఓరీ గ్రుడ్డివాడా! నీకు ప్రాణములపై ఆశ లేదా? ప్రాణాపాయ కరమైన పనిని ఎందుకు చేస్తున్నావు? మానేయి!" అని మందలించారు. "ఇది పరమేశ్వరునికి ప్రీతిని గలిగించు కార్యము. నేను ఎట్లా మానేది?' అని సమాధానము చెప్పేవాడు. జైనులు వీనికి కన్నులు లేనట్లే చెవులు గూడ లేవు. ఎవరు చెప్పిన వినడు అనేవారు. నాకు కన్నులున్నవి, చెవులున్నవి, మీకే లేవు అని నాయనారు  బదులు పలికాడు. "నీకు కనుక కన్నులుండుటయే నిజమైన, మేము ఈ వూరిలో వుండము" అని జైనులు పలికారు.



ఆ రాత్రి ఆదిగళ్‌కు స్వప్నమున పరమేశ్వరుడు సాక్షాత్కరించి, "నీకు కనులు ఇచ్చుచున్నాను, నిన్ను అవహేళన చేసిన జైనులను అంధులుగా జేసితిని" అని చెప్పాడు. ఆ రాజ్యపు రాజునకు గూడ శివుడు స్వప్నములో కనబడి, "జైనులు నాయనారుకు అడ్డము తగులకుండ చూడవలసినది" అని ఆదేశించారు. మరునాడు ఆ రాజు నాయనారు వద్దకు వచ్చి, "నేను మీకు ఏమి చేయగలనో ఆదేశించండి" అని అడిగాడు. నాయనారు రాజును చెరువు వద్దకు తీసికొని వెళ్లి, జైనులను అక్కడికి రప్పించాడు. జైనులు అందరు అంధులై యున్నారు. రాజాజ్ఞ ప్రకారం వారు పడుచు లేచుచు ఎట్లో అచటకు వచ్చారు. "నాకు ఇప్పుడు కన్నులు వచ్చినవి. మీరు చేసిన శపథము ప్రకారము, ఈ వూరు విడిచిపెట్టి వెళ్లుడు" అని నాయనారు వారిని ఆదేశించాడు. జైనులలో కొంత మంది అంత్వముతో బాధపడలేక, నాయనారును శరణుజొచ్చారు. వారికి అంతటితో అంధత్వము తొలగినది.

దండి ఆదిగాళ్ జీవించి యున్నంతకాలము శివపూజ, శివభక్తులకు సేవను చేస్తూ, అంత్యమున శివసాయుజ్యమును పొందినాడు.  

***
ఓం నమశివాయ
***

Subrahmanyam Gorthi

unread,
Dec 4, 2014, 11:55:12 AM12/4/14
to babasatsang
సోమశిర నాయనారు 

​సోమశిర నాయనారు తిరువాంబూరులో నివసించే బ్రాహ్మణుడు. శివభక్తిపరుడు. శివభక్తులను సేవించేవాడు. శివభక్తులు ఏ కులాల వారైనా సరే - వారిని ఆదరించేవాడు. యాగాలు చేసాడు. ఫలితమును ఆశింపకనే శివుని కొలిచేవాడు. శివుడికి సంపూర్ణ శరణాగతుడు. ఈ కారణముచే అతనికి శివానుగ్రహము లభించినది.

ఇది ఒక పవిత్రుని జీవితము. ఇందులో పైకి ప్రత్యేకత ఏమీయు కనిపించదు. ఆ రోజుల్లో దక్షిణాదిన వున్న పరిస్థితులను మనము గమనించాలి. ఆ రోజుల్లో బ్రాహ్మణుడెవడు ఇతర కులస్థులతో కలిసి తిరుగలేని పరిస్థితి. బ్రాహ్మణుడు వానికి సేవ చేయుటయు, ఆలోచనలో కూడా ఊహించలేము. ఎంత మహాశివ భక్తులైనా సరే బ్రాహ్మణుడెవడు ఇతర కులస్థులకు సేవ చేయుట కుదరదు. దేవుని భక్తులకు సేవ చేయుటకు చాలా మనోనిబ్బరముండాలి. పట్టుదల వుండాలి.

ఇంక యాగములు ఫలితమాసించక ఎవరునూ తలపెట్టరు. ఒక కోరికతో స్వార్థ మునకై యజ్ఞమును చేయ సంకల్పిస్తారు.

నాయనారు యాగాలను నిస్వార్థముగా చేశాడు. తనకై ఏమీ ఆశించలేదు. ఆధ్యాత్మికతతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లుగా గమనిస్తాము. జ్ఞానపరిధిలో, ఆధ్యాత్మిక దృష్టితో నిజమైన జ్ఞాని అతడు. కర్మయోగి అతడు.

ఇవన్నియుగాక అతనికి గురువు యెడ అప్రతిమాన భక్తి యుంది. సుందరమూర్తి నాయనారు ఈతనికి గురువు. గురుభక్తి మూలాన సాధించలేని దేముంది? అయినా మూర్ఖులు, గర్విష్టులు గురుభక్తి గూర్చి చులకనగా మాట్లాడుతారు. గురు భక్తిని హేళన చేస్తారు.

ఎవరు ఎంత హేళన చేసినా నాయనారు తనదైన పద్ధతిని వీడలేదు. పరమ శివుడు సంతసించి నాయానారుకు అంత్యమున సాయుజ్యమును గ్రహించాడు.

Subrahmanyam Gorthi

unread,
Dec 5, 2014, 12:46:29 PM12/5/14
to babasatsang
సక్కియ నాయనారు

సక్కియ నాయనారు తిరుచంగమంగయిలోని వెల్లాల కులజుడు. ఆయనకు ఇహలోక వ్యాపకాలపై పూర్తి అయిష్టత ఏర్పడింది. మోక్షమును పొంద దలచాడు. మోక్ష సాధనకు ఉత్తమమైన మార్గమునకై అన్వేషణ ఆరంభించాడు. సమీపములోనున్న కొందరు బౌద్ధ సన్యాసుల సాంగత్యములో జీవించసాగాడు. కొంతకాలము వారివద్ద ఉండి, బౌద్ధ మత గ్రంధాలను, వారి సిద్ధాంతాలను అధ్యయనము చేసాడు. కానీ అవేవీ అతని అధ్యాత్మిక తృష్ణను పరిపూర్ణముగా తీర్చలేకపోయాయి.

అది తనకు తగిన మార్గము కాదని గ్రహించిన సక్కియ నాయనారు మనసు శైవ సిద్ధాంతములవైపు, పరమశివుని వైపునకు ఆకర్షింపబడినది. బాహ్య చిహ్నములేవైన బాహ్య ప్రవర్తనమేదైనా దేవునియందు అచంచల భక్తి ప్రపత్తులున్నచో మోక్షమునందగలడు అని నాయనారు మనస్సుకు గాఢంగా తట్టింది. బాహ్యంగా బౌద్ధమత చిహ్నలు వీడకపోయినా ఆయన మనస్సులో శివునియందు అచంచలమైన భక్తి ప్రపత్తులు నెలకొన్నవి. శివుని గాఢంగా ప్రేమించాడు.

ఒక రోజున శివాలయములో కూర్చొని శివుని గూర్చిన తలంపుతో మైమరిచిపోయాడు. ఆ స్థితిలో శివలింగముపై తాను రాయిని వేయడం తటస్థించింది. మరునాడు దేవాలయమునకు వెళ్లి వెనుకటి దినమున తానేమి చేసాడో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. భక్తుడు భక్తితో ఏమి సమర్పించినా దేవుడు స్వీకరిస్తాడు. ఈ రోజు గూడ శివునిపై రాయిని వేశాడు. రోజూ ఇలా రాళ్ళను శివలింగమునకు సమర్పించుటయే అతని నిత్య పూజా విధానముగా అయినది! ఈ పని చేయనిదే అతనికి ఆహారము గూడ తీసికొ బుద్ధయ్యేదికాదు. ఒకరోజున భోజనానికి కూర్చోగానే, తాను రోజూ చేసే పూజ చేయలేదని జ్ఞాపకానికి వచ్చింది. ఆకలిని గూడ మరచి దేవాలయమును దర్శించి భక్తితో శివునిపై రాయి నుంచాడు. తక్షణమే పరమశివుడు ప్రత్యక్షమై ఆశీర్వదించి కైలాసానికి తీసికొని వెళ్లాడు.

***
ఓం నమశివాయ - ఓం నమశివాయ - ఓం నమశివాయ
***

Subrahmanyam Gorthi

unread,
Dec 6, 2014, 12:18:41 PM12/6/14
to babasatsang
చేరమాన్ పెరుమాళ్ నాయనారు

ఇప్పటి కేరళ రాష్ట్రమయిన మలైనాడులో చేరమాన్‌ పెరుమాళ్‌నాయనారు కోడున్‌కోలూరులో (మలైనాడు రాజధాని. మహోదయం అనిపేరు గూడా వుంది) - ఉత్తియన్‌ కుటుంబము కొత్తయార్ల రాజ వంశములో జన్మించాడు. చేర వంశస్తులందరికి చేరమాను అనునది సాధారణ నామము. పట్టాభిషిక్తుడైన తర్వాత పెరుమాళ్‌ అని పిలిచేవారు. అసలు పేరు - పెరుమ్‌ -మ-కొత్తయారు. మంచి సంస్కారవంతుడు. బాల్యము నుంచి దైవభక్తి తత్పరతతో నుండెడివాడు. వయస్సు పెరిగిన కొలది దైవభక్తి గూడ పెరుగుతూ వచ్చింది. విచక్షణ, నిష్పక్షపాతము ఆయనలో మూర్తీభవించాయి. పరిపాలకుడుగా ఉండాలన్న ఇచ్చ ఆయనకు లేనేలేదు. అందుకని వయస్సు రాగానే సన్యసించి తిరువంజక్కళముకు చేరి అచ్చట శివపూజా దురంధరుడై యుండెను. దేశాన్ని సెన్‌గోల్‌ పోరయాను (చెంగప్పరుడు) పరిపాలించేవాడు. ఆయన గూడ నిత్యానిత్య వివేకము నెరిగి మోక్షమునకై ప్రపంచ సంబంధాల నుండి వైదొలగి వెళ్ళిపోయాడు. ఆయనకు సంతతి లేదు. సింహాసనం ఖాళీగా వుంది. అందుకని ప్రజలు తిరువంజక్కళమునకు వెళ్ళి పెరుమ్‌-మ-కొత్తయారును సింహాసనమధిష్టించి రాజ్యాన్ని కాపాడమని అర్థించాడు. తన దైవ ఉపాసనకు అడ్డంకియని ముందర రాజ్యమధిష్టించుటకు అంగీకరించలేదు. కాని దైవాజ్ఞ - అతను పరిపాలకడుకావాలని. దేవాలయమునకు వెళ్ళి దేవుని ప్రార్థించాడు. పరమాత్మ అతనిని రాజువుకమ్మని ఆదేశించాడు. నీవు రాజువయితే ప్రజలు నిన్ను అనుసరిస్తారు. రాజువై నీవు శైవాగమమును వ్యాపింపజేయవచ్చును. అందుకని రాజువుకా అని పరమాత్మ ఆదేశించాడు. దైవాజ్ఞ మూలాన సింహాసన మధిష్ఠించి న్యాయవంతముగా పరిపాలన చేశాడు. ఆయనకు అన్ని భాషలు, చివరకు పక్షుల భాష గూడ తెలుసును. దేవుడు అష్టైశ్వర్యాలు, బలం, రాజవాహనాలు అన్ని ఆయనకు ప్రసాదించాడు.

పట్టాభిషిక్తుడై పిదప దేవాలయమునకు వెళ్ళి అర్చించి తిరిగి వస్తుంటే ఒక చాకలివాడు దేహమంతా విభూతితో కనిపించాడు. ఆ దృశ్యము చేరమానుకు సాక్షాత్తు పరమశివుని చూస్తున్నట్లు అనిపించింది. అందుకని ఏనుగు దిగి చాకలిని అతను వారిస్తున్నా వినకుండా మ్రొక్కాడు. చేరమాను యొక్క అనితర భక్తి అందరకు గోచరమైంది.

చేరమాను పవిత్ర జీవనము, భక్తి ప్రపత్తులు పరమశివుని ముగ్ధుణ్ణి చేశాయి. పెరుమాళ్ళు అనేక శివాలయములను దర్శించి పరమశివుని సేవించి స్వస్థలమునకు చేరుకున్నాడు. మధుర సోమసుందరేశ్వరుడు తన భక్తుడైన బాణాపతిరారు (బారాభద్రుడు) నకు సకలైశ్వర్యములు ఒసగదలచి, "చేరమాను పెరుమాళ్‌ పేరున ఒక చీటీనిచ్చెదను. దానిని తీసుకొనిపోయి, అతనికిమ్ము, అతను సకలము నెరవేర్చును" అని చెప్పి చీటీ (తాళపత్రము) ఇచ్చెను. ఆ చీటిలో సాక్షాత్తు సోమసుందరేశ్వరుడే పెరుమాళ్‌గూర్చి రచించిన గీతమున్నది! దాని అర్థము ఇలా వుంది. "కవులను పండితులను సమాదరించే, ప్రజలను న్యాయవంతముగా పరిపాలించే ఓ మహారాజా! నీకు జయము, జయము. నీ భక్తి తత్పరత, దయార్ద హృదయత, దాతృత్వము నన్ను ఆకట్టుకున్నాయి. ఈ తాళపత్రము గొని తెచ్చునాతని పేరు బాణపతిరారు. గొప్ప సంగీత విద్వాంసుడు. పరమ దైవభక్తి తత్పరుడు. నన్ను గూర్చి అతనికి ఇష్టమైన 'యాజు' (వీణ) మీద నన్ను కీర్తిస్తూ పాడుతూ వుంటాడు. నిన్ను చూడాలని అభిలషిస్తున్నాడు. అతనిని సాదరంగా గౌరవ పురస్సరంగా ఆహ్వానించి అనంత పురస్కారములనిచ్చి గౌరవించవలసినది" అని వుంది.

చేరమాను ఆ విద్వాంసుని ప్రేమతో, గౌరవంతో ఆహ్వానించాడు. " సోమసుందరేశ్వరస్వామికి నేటికి నా మీద అనుగ్రహము కలిగినదా" యనుకొని చీటి (తాళపత్రము) సంగతి మంత్రులకు తెలియజేసి "కోశమున సకలమును బాణాపతిరారు ఇంటికి తరలించుడు" అని ఆజ్ఞాపించి బాణాపతిరారు వైపుతిరిగి, "స్వామీ ఈ రాజ్యమును గూడ స్వీకరించి మీసేవ చేయ నంగీకరింపవలయును" అని ప్రార్థించాడు. అందులకు బాణాపతిరారు నిర్ఘాంతపోయాడు.

రాజుగారి పరమ భక్తి తత్పరత అర్థమైంది. "ఓరాజా! మీ దర్శనంతో నా జీవితము ధన్యమైంది. నాకు కావలసినంత మాత్రమే మీ దగ్గర నుంచి తీసుకొనగలను. అదియే ఈశ్వరుని ఆజ్ఞ కూడా" అని చెప్పి తనకు కావలసినది తీసుకుని రాజుకు వందన మాచరించి తిరిగి వెళ్ళాడు. చేరమాను ఆయనను ఏనుగు మీద ఎక్కించి పంపాడు. తన రాజ్యము పొలిమేరదాక ఆయనతో వెళ్ళి ఆయనను సాగనంపాడు.

చేరమానుకు నటరాజస్వామి యెడ బహు ప్రీతి వుంది. తన శరీరము, మనస్సు, ఆత్మను గూడా ఆయనకే అర్పణ చేసాడు. ప్రతిరోజు ఆయనను అర్చించేవాడు. అర్చనచేసే సమయములో నాయనారుకు, నటరాజస్వామి కనక సభలో నృత్యము చేస్తున్నప్పుడు ఉత్పన్నమయ్యే కాలి మువ్వల ధ్వనులు వినిపించేది. ఒక రోజున అర్చన సమయంలో కాలి అందెల ధ్వని వినబడలేదు. చేరమాను తాను మహాపరాధము చేసితినని భావించి తన ఖడ్గముతో మరణమునకు ఉధ్యుక్తుడయ్యాడు. వెంటనే మువ్వల ధ్వని వినబడింది. ఆకాశము నుండి ఒక వాణి వినిపించింది. 'నా మిత్రుడు సుందరారు తిల్లై వచ్చాడు. ఆయన మధురమైన పాటలను వింటూ తన్మయుడనైనాను. అందుకని నా మూపురుధ్వనులతో నిన్ను ఆశీర్వదించుటకు ఆలస్యమైంది'. పరమశివుడు - సుందరారు, చేరమాను ఇరువురు మిత్రులవ్వాలని వాంఛించాడు. అందుకని సుందరార్‌ గూర్చి గొప్పగా చెప్పాడు. చేరమాను నటరాజును అర్చించుటకును సుందరారును దర్శించుటకును తిల్లైకు వెంటనే బయలుదేరాడు. చేరమాను తిల్లైచేరే సరికే సుందరారు ఆ స్థలము వదిలి వెళ్ళిపోయాడు. అందుకని చేరమాను తిరువారూరు వెళ్ళి అచ్చట సుందరారును కలిసికొన్నాడు. ఒకరికొకరు సాష్టాంగ ప్రణామములు చేసికొన్నారు. తిరువావూరులో చేరమాను విఖ్యాతినందిన "తిరుమమ్మనికోవై" కృతిని దేవదేవుడైన త్యాగరాజు మీద రచించి పాడాడు.

ఇద్దరూ కలిసి వేదారణ్యం వెళ్ళారు. అక్కడ చేరమాను 'తిరూఅంతాది' కృతిని దేవుని మీద పాడాడు. చాల దేవాలయములను సందర్శిస్తూ ఇద్దరూ మధుర చేరుకున్నారు. పాంఢ్యరాజు సాదరముగా వాళ్ళని ఆహ్వానించాడు.

ఆ సమయములో అక్కడ యున్న చోళ యువరాజు గూడా వారిని గౌరవించాడు. వాళ్ళతో కలిసి చాలా దేవాలయములను ఇద్దరూ సందర్శించారు. వారి దగ్గర నుండి సెలవు తీసుకుని చేరమాను, సుందరారు తిరువారూరునకు చేరారు. చేరమాను కోరికపై సుందరారు కొడున్‌కోలూరు చేరమాను వెంట వెళ్ళాడు. అచ్చట చేరమాను సుందరారును ఏనుగుపై వూరేగించి సత్కరించాడు. సుందరారు తిరిగి వస్తూ చేరమానును - రాజ్యమును న్యాయవంతముగ నేర్పుతో పరిపాలించ వలసినదిగా చెప్పాడు. సుందరారు ఆజ్ఞను చేరమాను తూచా తప్పక పాటించాడు.

మరొకసారి చేరమానుతో సుందరారు కొడున్‌కోలూరులో వున్నప్పుడు - సుందరారు వంటరిగా తిరు అంచైకాలము కోవెలను సందర్శించాడు. అచట తనను సంసార ఇహలోక బాధ్యతలనుండి తప్పించి కైలాసమునకు తీసుకునుపొమ్మని శివుని అర్థించాడు. మహాదేవుడు అతని అభ్యర్థనను మన్నించి తెల్ల ఏనుగుపై కైలాసానికి తెచ్చుటకు ప్రమధగణాన్ని పంపాడు. చేరమానుకు సుందరారు కైలాసానికి చేరుతున్నట్లు తట్టింది. తాను కూడా తన భద్రాశ్వమును అధిరోహించి దాని చెవిలో పంచాక్షరీ మంత్రమునుచ్చరించగా అది చేరమానును సుందరారు వద్దకు తృటిలో చేర్చింది. సుందరారును కలిసికొన్నాడు. ఇద్దరూ కలిసి కైలాసంకు చేరుకున్నారు.
​కైలాసంలో ద్వారపాలకులు ఒక్క సుందరారునే లోనికి ఆహ్వానించారు. సుందరారు దేవుని దగ్గరకు వెళ్ళి నుతించాడు. చేరమాను ద్వారం బయటయున్నాడని చెప్పాడు. తన స్నేహితుని మురిపించుటకు పరమశివుడు తన వాహనమైన నందికేశ్వరుని పిలిచి చేరమానును తీసుకొనిరమ్మని పంపాడు. శివుడు చేరమానును తన అనుమతిలేనిదే కైలాసానికి ఎలా రాగలిగావు అని ప్రశ్నించాడు. "సుందరారు కైలాసమునకు బయలుదేరుట చూచాను. అతని వియోగము భరించలేక అతనితో వచ్చాను" అని చేరమాను బదులు చెప్పాడు. శివుడు చేరమానును వాత్సల్యంతో కైలాసానికి ఆహ్వానించాడు.

ఈ సంఘటనలో చేరమాను ఒక మహాసత్యాన్ని వెల్లడించాడు. ఒకడు అనర్హుడైనను, గురువునకు (ఋషికి) ఆత్మీయుడవగలిగినచో, గురువు తనతోబాటు తన శిష్యునికి గూడా భగవత్‌ సాన్నిధ్యము ఇప్పించ గలడన్న సత్యము ప్రస్ఫుటమైంది.

పరమశివుడు చేరమానును తన ప్రమధ గణాధిపతిగా చేసికొన్నాడు.

****
ఓం నమశివాయ - ఓం నమశివాయ - ఓం నమశివాయ
****

Subrahmanyam Gorthi

unread,
Dec 8, 2014, 12:45:57 PM12/8/14
to babasatsang
నరసింగ మునియారయ్యరు నాయనారు


నరసింగ మునియారయ్యరు తిరుమునైపాడిలో నివశించిన యోగి. ప్రధానాధికారి. శివపూజాదురంధుడు. శివభక్తి వ్యాప్తికి ప్రధానుడు. ప్రతి తిరువాత్తిరాయి దినమున (అంటే - మార్గశిర మాసములో వచ్చే ఆరుద్ర నక్షత్ర దర్శనం రోజు - 8 డిసెంబర్, 2014! అనగా చిత్రంగా ఈరోజే!!!) ప్రత్యేక శివపూజను గావించి తారతమ్యము లేకుండ అందరు శివభక్తులకు భోజనమిడి 100 సువర్ణ నాణెములు నిచ్చువాడు. ఒకరోజున అలా చేస్తూంటే, ఒక శివభక్తుడు నగ్నంగా ఒడలంతా విబూది పూసుకుని వచ్చాడు. అతనిని చూసి మిగతా భక్తులు చీదరించుకున్నారు. నాయనారు ఇది గమనించాడు. ఆ అగంతకుని కాళ్ళకు మొక్కి అందరికన్న గౌరవముతో ఆహ్వానించి చక్కని విందు ఇచ్చి 200 సువర్ణ నాణెములు ఇచ్చి అతనిని సత్కరించాడు. పరమశివుడు ఇదిచూసి చాలా సంతసించి తన అపార కృపను నర్సింగ మునియారయ్యరుపై జూపాడు.

ఇది ఒక మంచి ఉదాహరణ. యోగులు భవ్య జీవితమును సౌమ్యముగా ఆవిష్కరిస్తారు. మనుజులలో దృక్పథంలో మార్పును బహుసున్నితంగా తెస్తారు. నాయనారుకు అందరు శివభక్తులు పరమశివ రూపములే. నగ్నంగా విభూతితో ఉన్న భక్తుడికి వేరొక భక్తునికి తారతమ్యము లేదు. నాయనారుకు వారియెడ ఎటువంటి జుగుప్స, దురాభిప్రాయము లేదు. తాను స్వయంగా చేసి చూపి మిగతా వారల మనస్సులలో మంచి మార్పును తేగలిగాడు. తారతమ్యమును వాళ్ల దృక్పథంలో నుంచి తొలగించగలిగాడు

Subrahmanyam Gorthi

unread,
Dec 9, 2014, 1:45:43 PM12/9/14
to babasatsang
కాలియ నాయనారు

​కాలియ నాయనారు తిరువొత్రియూరులో నూనె వ్యాపారి. అతని శివభక్తి అపురూపము. శివైక ధ్యాన తత్పరముతో ప్రతిరోజూ నిష్టగా దేవాలయమునందు జ్యోతులు ప్రజ్వలనములో నిమగ్నుడయేవాడు. సహజముగా ధనవంతుడు. అతని భక్తిని లోకమునకు వెల్లడి చేయదలంచి మహాదేవుడు అతని ధనమంతయు కరిగించి వేసి పేదవానిగా ఒనర్చాడు. అతని కుటుంబీకులు గూడ అతనికి సహాయము చేయ నిరాకరించారు. అందుకని దీపారాధన చేయుటకు కూలివానిగా గూడ అతడు పని చేయవలసి వచ్చింది. ఇది కూడా కుదరనీయలేదు. మూర్ఛ వచ్చే పర్యంతమయి దరిగానక తన కంఠము నుత్తరించుకుని నూనెబదులు ఆ రక్తముతో దీపారాధన చేయ ప్రయత్నించాడు. శివుడు ప్రత్యక్షమై అతని చేతిని పట్టుకుని ఆ ప్రయత్నము నుండి విముక్తుణ్ణి చేసి కాలియ నాయనారుకు సాయుజ్యమును గ్రహించాడు.

ఇందులో కాలియనాయనారు నిరతిశయభక్తి - భక్తి విషయములో తన స్వకీయ మాన ప్రాణాన్ని గూడా విస్మరించి దైవ కర్తవ్యమునకు అతని నిరంతర శ్రమను మనము చూస్తాము. దైవ కర్తవ్యతాచరణమే అతని ఏకైక లక్ష్యము. అతను ఇంకే విషయములు ఆలోచించలేదు. ఆచరణయే పరమావధి. ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయలేదు. ప్రలోభాలు గాని, వేరొక ఆలోచనలు గాని అతను తన దరికి రానీయలేదు. కష్టాల్లో, అడ్డంకులు దాటుటకు మార్గాల నన్వేషించాడు. తొణకలేదు. బెణకలేదు. ఇదే శివుని చేరుటకు మార్గ సోపానమయింది.

Subrahmanyam Gorthi

unread,
Dec 11, 2014, 4:35:16 PM12/11/14
to babasatsang
కరి నాయనారు

కరి నాయనారు అత్యంత శివభక్తులలో ఒకడు. తిరుకడవూరు వాసి. తమిళంలో మహాపండితుడు. ముగ్గురు రాజుల వద్దకు వెళ్లి, తమిళ-కోవైలను పాడి, ఆ పాటలకు రాజులిచ్చిన అనంత ధనరాసులతో ఆలయములు కట్టించేవాడు. ఈ విధంగా ఈశ్వర భక్తి వ్యాప్తి నొనరించాడు. శివభక్తులను గూడ చక్కగా ఆదరించేవాడు. ఈ విధంగా శివునికి అత్యంత ఇష్టుడైనాడు.

నిజమైన భక్తుడు దేవుని కొఱకే జీవిస్తాడు. నాయనార్ తనకున్నదంతా శివార్చన కొఱకై వినియోగించాడు. నీ జన్మ భగవంతుని సృష్టి. నీ తల్లి, తండ్రి ఆయనే. నీ గురువు, స్నేహితుడు గూడ భగవంతుడే. నీకు బహుధా శక్తియుక్తుల ప్రసాదించాడు. నీకు వివిద వనరుల ననుగ్రహించాడు. ఇదంతా భగదనుగ్రహమే. అంతా భగవంతునికి చెందినదే. భగవంతుడు సర్వాంతర్యామి. అందరిలో వున్నాడు. భక్తులు వారి సహాయ సంపత్తులు భగవదర్పితంగా  అందరిసేవలో వినియోగించాలని అభిలషిస్తాడు. ఇది ధర్మపరులు ప్రవచించిన ధర్మ సూక్షము. అందరిలోను భగవంతుని చూడు. అందరిలో భగవంతునకు సేవలనర్పించు. నిస్వార్థముగా ప్రేమిస్తూ వితరణశీలిగా ధర్మమార్గములో నడుస్తూ నీ మార్గమునకు అవరోధము గల్పించు అహంకార మమకారములను తొలగించుకొని ఈ జన్మలోనే - కాదు ఈ క్షణమే భగవంతుని పొందుము.
***
ఓం నమశివాయ -ఓం నమశివాయ- ఓం నమశివాయ
***

Subrahmanyam Gorthi

unread,
Dec 11, 2014, 6:10:25 PM12/11/14
to babasatsang
మునైయడువార్‌ నాయనారు

మునైయడువార్‌ నాయనారు ఋషి వెల్లాల కులస్తుడు. చోళ రాజ్యములోని తిరునిడూరు వాసి. శివభక్తులన్నా, శివుడన్నా విపరీతంగా ప్రేమించేవాడు. నిరాశాపరులకు, బలహీనులకు, అణగద్రొక్కబడ్డవారికి - పెద్ద అండగా, వారికి ఆశాజ్యోతిగా వుండేవాడు. ఆయనను ఆశ్రయించి, వారు వారి ఓటమి నుండి తప్పించుకునేవారు. ఎవరినైనా రక్షించుటకు పోరాటమునకు సిద్ధపడేవాడు. వారిని రక్షించడానికి మూల్యము తీసుకుని ఆ మూల్యమును శివభక్తులకే వెచ్చించేవాడు. శివభక్తులను పరమాదరించేవాడు. ఈ విధంగా మూల్యమును సంపాదించి శివభక్తులను కొలుచుటచే ఆయనని మునైయడువారు అని పిలిచేవారు. శివుడు పరమ భక్తితత్త్వమున కాకర్షింపబడి సాయుజ్యమొసగినాడు.

ఈతని జీవితము నుండి రెండు పాఠాలు మనము గమనించితీరాలి. మొదటిది ఈయనకు భగవంతుడు - ఇతరులను రక్షించేందుకు బలము, శక్తియుక్తులు ఇచ్చియున్నాడు. నాయనారు ఆ శక్తులను నిరాశాపరులైనవారిని, బలహీనులను, అణగద్రొక్కబడిన వారిని రక్షించేందుకు మాత్రము ఉపయోగించాడు. శక్తి, బలము గూడ దైవ నిదర్శనము. వాటిని న్యాయంగా ఉపయోగించాలి. రెండవది అలా న్యాయంగా ఉపయోగించడంలోని ఫలము శివార్పణము చేయాలి. భగవద్గీత, ఋషులు, మునులు ఇదే చెబుతున్నది. నీవు నీ పని చేయాలి. ఫలితము దేవునికి అర్పణ చేయి. మంచిదైన నడవడి ఫలితము దైవార్పణతో స్వార్ధం లేనిదై వుండాలి. స్వార్ధము అన్ని దోషములకు, వాని మూలమున వచ్చు కష్టాలకు మూలకారణమవుతుంది.
***
ఓం నమశివాయ - ఓం నమశివాయ - ఓం నమశివాయ
***


Subrahmanyam Gorthi

unread,
Dec 12, 2014, 1:06:13 PM12/12/14
to babasatsang
ఇడన్‌గాజి నాయనారు


ఇడన్‌గాజి నాయనారు ఒక ఋషి. కొడుమ్‌బలూరులో వేలాల రాజుగా ప్రసిద్ధినొందాడు. అప్రతిమానమైన శివభక్తుడు. అన్ని దేవాలయాలలోను శైవ ఆగమాల ప్రకారము పూజలు జరుగాలని నిర్దేశించాడు. ఆ వూళ్లోనే శివపూజాదురంధరుడైన - మహేశ్వరపూజ చేయు ఇంకొక భక్తుడున్నాడు. అతను పేదవాడయి పూజను కొనసాగించలేక, శివభక్తులను ఆదరించలేక, శక్తిలేనయిన వాడయ్యాడు. అందుకని ఇడన్‌గాజి నాయనారు ఒక రాత్రి రాజుగారి ధాన్యాగారంలో దొంగతనము చేయ సంసిద్ధుడయ్యాడు. అక్కడ కాపలాదారు దొంగని పట్టుకుని రాజు వద్దకు తీసుకుని వెళ్ళాడు. రాజుగారు విచారణ చేయగా, ఈ దొంగతనము శివభక్తుల సేవకై, వారి ఆహారముకొరకేనని తేలింది. శివపూజ చేయు రాజు ఈ విషయమును విని - దొంగతనము చేయుటకు వచ్చిన ఆ శివభక్తుని విడుదల చేశాడు.

ఈ విషయము రాజుగారి కళ్ళను తెరిపించింది. తన ఆస్తి, సంపదలు తనవి కానే కావని, అవేవీ తనకు చెందవని, అవన్నీ మహాశివునివి, రాజ్య ప్రజలవి - అని గ్రహించాడు. అందుకని తన ధాన్యాగారమును అందరి ప్రజలకు తెరిచి వుంచాడు. వాళ్లకు కావలసినవి తీసుకుని వెళ్ళవచ్చునని చెప్పాడు. పరమశివుని మెప్పును అవలీలగా పొందాడు. శివసాయుజ్యమొందాడు.

***
ఓం నమ శివాయ - ఓం నమ శివాయ - ఓం నమ శివాయ
***
 

Subrahmanyam Gorthi

unread,
Dec 13, 2014, 12:11:32 PM12/13/14
to babasatsang

తిరుకురిప్ప తొండ నాయనారు (భక్త సిరియాళ)

భక్త సిరియాళ జీవిత చరిత్ర సినిమా ఈక్రింది వీడియోలో చూడవచ్చును: :-)

Subrahmanyam Gorthi

unread,
Dec 15, 2014, 12:37:31 PM12/15/14
to babasatsang
తిరునీలకంఠ యాజ్‌పనార్ నాయనారు


చోళ రాజ్యంలో తిరుఏరుకట్టన్ పులియారులో తిరునీలకంఠ భూజ్‌పనార్ అనే మహాశివభక్తుడు  ఉండేవాడు. యాజ్ మీద భక్తిపాటలు చాల చక్కగా మనోహరంగా గమకంగా పాడేవాడు. దేవాలయాలను దర్శించి దేవుని మీద యాజ్‌మీద పాడుట ఆయన అలవాటు. ఒక రోజున మధుర వెళ్లాడు. గుడి ముందర నిలుచుని భక్తి పారవశ్యముతో పాడటం మొదలు పెట్టాడు. మధుర దేవదేవుడు నుందరేశ్వరునికి తన సమక్షంలో ఆ పాటలు పాడించుకోవాలని, వినాలని అనిపించింది. అందుకని భక్తుల కలలో కనిపించి, మరుసటి దినమున యాజ్‌పనారును గర్భగుడిలోనికి తీసుకొని వచ్చి పాడించమని నిర్దేశించాడు. యాజ్‌పనారును మరుసటి దినము లోనికి తీసుకొని వెళ్ళడము ఆయనకు ఆశ్చర్యము గొల్పింది. ఇది భగవంతుడి లీల అని గ్రహించాడు. యాజ్ మీద తాను పాడటం భగవంతునికి ఇష్టమని గ్రహించాడు. అలా పాడుతుంటే, "తడినేల తగిలిగే యాజ్ పాడవుతుంది అందుచే ఆయనకు బంగారు ఆసనము వేసి కూర్చోబెట్టండి" అని ఒక దివ్యవాణి అక్కడ ఉన్నవారందరికీ వినిపించింది. వెంటనే బంగారు ఆసనము అమర్చబడింది. యాజ్‌పనారు దేవునికి సాష్టాంగపడి, దేవుని అనంత కరుణా శీలత్వమును గూర్చి ఆ కనకపు ఆసనము పై కూర్చుని పాడాడు.


యాజ్ అనబడు తంత్రీవాద్యము

యాజ్‌పనారు తర్వాత తిరువారూరు వెళ్లాడు. అక్కడ కూడా దేవాలయము బయటనే నుంచుని పాడాడు. ఇక్కడకూడా దేవుడు అతనిచే తన సమీపంలో పాడించుకో దలచాడు. దాని కొఱకై, ఈశ్వర సంకల్పము వలన, ఆ దేవాలయమునకు ఉత్తర దిశన, యాజ్‌పనారు నిలబడియున్నచోట గల గోడ రెండుగా చీలిపోయి, ఆలయములోనికి ప్రవేశించుటకు మార్గము ఏర్పడినది! యాజ్‌పనారు దేవుని సంకల్పమును గ్రహించి, ఆ ద్వారము ద్వారా లోనికి ప్రవేశించి, దైవము ముంగిట మనోహరంగా పాడాడు.

ఈయన సంబంధార్‌తో చేరి సాయుజ్యమును పొందుట సంబంధార్ చరిత్రలో చూస్తాము. 
Reply all
Reply to author
Forward
0 new messages