నేను ఎప్పుడు మార్పు చెందని వాడను అన్న స్థిర నిర్ణయము మీకు రావాలి. నేను స్త్రీని లేక పురుషుడను అన్న భావన మీకు ఎంత సహజముగా ఉన్నదో అంత సహజముగా నేను ఆత్మ స్వరూపుడను, మార్పు చెందని వాడను అన్న నిర్ణయము మీకు కలగాలి. అప్పుడు మీరు ఏ సాధన చేసినా అది వెంటనే ఫలవంత మవుతుంది.
నిత్యానిత్య వస్తువివేకమే మిగిలిన సాధనలన్నిటికీ మార్గము తెలిచేది. కనుక అత్యంత శ్రద్ధతో చెయ్యాలి. నిత్యానిత్య వస్తువివేకములో స్పష్టత లేకుండా ఏ సాధనా కొనసాగదు. మీరు చేసే ప్రతి సాధన కూడా మోక్ష లక్ష్యముతో చెయ్యాలి.
ప్రతి ఆలోచనలో కూడా మూడు గుణములు ఎలా పనిచేస్తున్నాయి , గుణాతీతముగా వర్తించుట ఎట్లా అనునది చూచుకొండి. మూడు గుణములను పనిముట్లుగా వినియోగించు కొనగలుగుట గుణాతీతము. గుణస్పర్శయే వికారత్వమునకు కారణము. గుణస్పర్శ లేకుండుటయే నిర్వికారత్వము.
పంచ భూతములు స్థూలమైనవి. వీటివలన మన స్థూలశరీరము ఏర్పడినది. పంచ భూతముల యొక్క సూక్ష్మ అంశ వలన సూక్ష్మశరీరము ఏర్పడినది. వాసనలు ఈ సూక్ష్మశరీరమును వాహకముగా వాడుకొని కోర్కెలను తీర్చుకొంటుంది. వాసనల వలననే స్థూల, సూక్ష్మశరీరములు సమస్త చరాచర సృష్టి ఉనికిని సంతరించుకొంటున్నాయి. వాసనలు క్షయమైన సృష్టితో పనే లేదు.
వాసనలను విషయముగా, అనుభవముగా చూచినంత కాలము వాటి వెంట పడిపోతూ ఉంటావు. అవి నాలోని సాక్షిత్వమును నిరూపించుటకు వచ్చుచున్నవి అని గుర్తించిన సాక్షిత్వము యందు నిలుస్తావు.
ప్రపంచము యొక్క ఉనికి నీవు గుర్తించుట లేదా గుర్తించక పోవుటలో ఉన్నది. నీవు గుర్తించినంత కాలము అది ఉంటూనే ఉంటుంది. నీవు కాని దానిని విడనాడాలి. అంటే నీవు కాని దానిని గుర్తించకు. నీవు నీ స్వస్వరూపాన్ని మననము చేయాలి. నీవు సాక్షివి. నిరంతరము ఆ ద్రుష్టితో జీవించు. ఏది ఎంతవరకు అర్హమో అంత వరకే చెయ్యి.
సూర్యుని వెలుగులో సమస్త జనులు ఎలా ప్రవర్తిస్తున్నారో , తమ పనులు తాము చేసికొంటున్నారో అదే విధముగా చైతన్య ప్రకాశములో ఇంద్రియములు తమ పనులను తాము చేసికొంటున్నాయి. నీవు ఆ సాక్షి చైతన్యమువు. నీవు కాని దానిని గుర్తించుట వలన నీకు జ్ఞానము కలుగదు. నీవైన దానిని నీవు గుర్తించుట వలననే నీకు జ్ఞానము కలుగుతుంది.
ఆలోచన ముందు చేసి తరువాత ఆచరించుట సత్వగుణము
ముందు ఆచరించి తరువాత విచారణ చేయుట రజోగుణము. చెయ్యకూడని విధముగా చేసిన పశ్చాతాపము చెందుతాడు.
ఆచరణకు ముందు , తరువాత కూడా విచారణ లేక, తాను ఏమి చేస్తున్నాడో తనకు తెలియకయే ఆచరించుట తమోగుణ లక్షణము.
ముందు తమో, రజో గుణములను అధిగమించి సత్వగుణముతో జీవించుట నేర్చుకోవాలి.
ఆధ్యాత్మిక విలువలను ఆచరించ వలెననిన ధ్యానము, విచారణ తప్పనిసరి.
చిత్తవ్రుత్తి నిరోధము యోగము
నిర్విషయమైన మనస్సును కలిగి యుండుట ధ్యానము
సమస్థితిలో ప్రాణము నడపుట ప్రాణాయామము
ప్రాణమునకు ప్రాణాయామము
మనస్సుకు ధ్యానము
బుద్ధికి యోగము అవసరము
ఎవరికీ మనస్సు చెప్పినట్లు ప్రాణము నడుస్తుందో, మనస్సు నిర్విషయము అవుతుందో , వాడు యోగమునకు అర్హుడు
ప్రతి సాధన ఆయా తలములలో శుద్ధి చేస్తుంది.
మూడు గుణములతో కలసి పనిచేయుటయే మాలిన్యము
మూడు గుణములకు లోబడక, వాటిని అధిగమించి, గుణములను పనిముట్లుగా వాడుకొన గలిగే స్థితికి చేరుకొనుటయే శుద్ధి చేసికొనుట అంటే.
ప్రాణాయామమును ఆచరించుట వలన అనేక విషయముల వెంట పరుగిడే మనస్సు ఏకాగ్రతను పొందుతుంది.
ఏకాగ్రత చెందిన మనస్సుతో నిష్కామకర్మాచరణ చేయుట వలన మనస్సు నిర్విషయమవుతుంది.
నిర్విషయమైన మనస్సు యోగము చేయుటకు, చిత్త వ్రుత్తి నిరోధము చేయుటకు సాధనాచతుష్టయ సంపత్తి కావాలి
లేని దానిని నీ మీద ఆరోపించుచున్నావు, అందుకొనే నీవు ఉన్నదానిని గుర్తించలేకపోవుచున్నావు.
శరీరమునకు హితాహారము, మితాహారము తీసికోవాలి. కేవలము నోటిద్వారా తీసికొనేది మాత్రమే ఆహారము కాదు. జ్ఞానేంద్రియముల ద్వారా స్వీకరించేది కూడా ఆహారమే.
సమస్థితిలో సహజముగా ఎల్లప్పుడూ ప్రాణాయామము చెయ్యి
మనస్సులో విషయము తోచినప్పుడు అల్లా దానికి వ్యతిరేకము చెయ్యి. మనస్సు నిర్విషయం అవుతుంది, వైరాగ్యము అలవడుతుంది
బుద్ధిని విచారణలో పెట్టు
వీటినన్నింటిని ఉపయోగించి చిత్తములో సుఖాపెక్ష అనే వ్రుత్తి ఎలా కదులుచున్నదో పరిశీలించు. అ సుఖాపెక్షను దెబ్బకొట్టుటయే చిత్త వ్రుత్తి నిరోధము.
మూడు గుణములకు అతీతము అయితే తప్ప చిత్తవృత్తిని నిరోధించలేవు.
సాధనాచతుష్టయమును ఉపయోగించి త్రిగుణములను అధిగమించు. చిత్త వృత్తినిరోధము సాధ్యమవుతుంది
అత్మానాత్మ వివేకము చేయుటకు అర్హత కలుగుతుంది
అత్మానాత్మ వివేకము వలన అహంకార నిరసన చేస్తావు.సాక్షి మిగులుతుంది.
అన్ని పనులు సామాన్యముగా చేస్తావు. ఉదాసీనముగా ఉంటావు. నీవు ఏపని చేసిన ఈశ్వరుడు ఈ ఉపాధిలో వర్తిస్తున్నాడు అన్న భావనతో చేస్తావు.
సత్వ గుణము వలన జ్ఞానము, సుఖాసక్తత
రజోగుణము వలన రాగము, తృష్ణ, బందము కలుగుతాయి
ఈశ్వర దృష్టితో లేక ఈశ్వరార్పణ భావనతో జీవించిన సత్వగుణము యందు స్థిరపడతావు. క్రమేపి గుణాతీతము యందు నిలువగలుగుతావు.
గుణాతీత స్థితిలో నిలువగలిగినప్పుడే మూడు అవస్థలను విషయముగా చూచుకొని లేకుండా చేసికొన గలుగుతావు. తురీయానుభవము లేక సమాధి స్థితిని పొందగలుగుతావు.
బ్రహ్మాండ పంచీకరణ తెలిస్తేనే తురీయానుభవమును పొందగలవు
పిండాండ పంచీకరణ తెలిసిన పిండాండమును నిరశించ గలుగుతావు
బ్రహ్మాండ పంచీకరణ తెలిసన ఈశ్వర వ్యవహారమును నిరశించ గలుగుతావు
కలిసి ఉన్న వాటిని విడగొట్టి చూపించుటను పంచీకరణ అంటారు
ఒక సంచిలో వస్తువులు అన్ని వేశాము. దానిని వాడుకోమని ఇచ్చాము. సంచి విప్పి దానిలోని సామానును గ్లాసులు, గిన్నెలు విడగొట్టుతాము. సంచి ఈశ్వరుడు. దానిలోని వస్తువులను విడగోట్టుట పంచీకరణ.
నిరశించుట - అశనము అంటే స్వీకరించుట లేక అనుభవించుట. నిరశించుట అంటే స్వీకరించ కుండా లేక అనుభవించ కుండా ఉండుట.
నీవు అద్దము ముందు నిలబడ్డావు. ప్రతిబింబము కనపడినది. అద్దము సత్యమా లేక ప్రతిబింబము సత్యమా? అద్దము సత్యము, ప్రతిబింబము లేకపోయినా అద్దము ఉన్నది కనుక. ప్రపంచము అద్దము వంటిది. నీ ఆసక్తతను ప్రపంచము అనే అద్దములో చూచుకొని ఆనందిస్తున్నావు. నీకు ప్రితిబింబ ఆసక్తత లేదు. నీవు బాగున్నావో, బాగుండలేదో చూచుకొన వలసిన అవసరము లేదు. నేను సంపూర్నుడను , ఆత్మను అన్న జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ప్రతిబింబముతో పని లేదు. అద్దమునకు కళాయి ఉంటేనే ప్రతిబింబము కనపడుతుంది. కళాయి త్రిగుణములు. త్రిగుణములు లేని యెడల నీ ఆసక్తతను ప్రపంచము అనే అద్దములో చూచుకొని ఆనందించవలసిన అవసరము లేదు. నీలో దోషములు లేకుండా ప్రపంచములో ఆ దోషమును గుర్తించలేవు.
గురువు పాదములకు ఎందుకు ప్రణమిల్లుతారు?
గురువు శరీరమును పనిముట్టుగా వినియోగించు కొని చేసిన అన్ని సాధనలు , తపస్సుకు ఆధారము ఆ పాదములే. ఆ పాదములను ఆశ్రయించి పుణ్య ఫలము అంతా ఉంటుంది. కనుక అట్టి తపోఫలమును ఆశ్రయిస్తున్నాను అని గురువు పాదములకు ప్రణమిల్లుతారు.
అజ్ఞాన అంధకారము హృదయ స్థానము నందు ఉన్నది. ఈ అజ్ఞాన అంధకారములను దూరము చేసికోవాలి అనే లక్ష్యముతో ఎవరైతే గురువును ఆశ్రయిస్తారో, గుర్తువును హృదయము నందు నిలుపుకొని, మూడు అవస్థల యందు తనయందు గురువు, గురువు యందు తాను ఉన్నానని జీవిస్తారో అటువంటి వారికి గురువు కృపా వీక్షణముచే అజ్ఞానము పటాపంచలవుతుంది.
గురువు శాస్త్ర స్వరూపుడు. మనమంతా శాస్త్రమును చదివి స్వరూప జ్ఞానమును తెలిసికోవాలి అనుకొంటున్నాము. స్వరూపజ్ఞానమే వ్యక్తీకరించబడి నప్పుడు శాస్త్రము అయినది. గురువు లేక మహర్షి స్వరూప జ్ఞానములో ఉండి చెబితే అది ఉపనిషత్తు అయినది. గురువు లేక మహర్షి తన అనుభవ జ్ఞానమును వ్యక్తీకరిస్తే అది ఉపనిషత్తు అయినది.
శాస్త్రము చదివితే ప్రయోజనము లేదా?
శాస్త్రము స్వరూప అనుభవము కలిగిన గురువు దగ్గరకు దారి చూపెడుతుంది. తరువాత భాద్యత గురువుది. గురువు తన స్వరూప జ్ఞానముచే నీ అజ్ఞానమును తొలగిస్తారు.
మెలకువలో పనిచేస్తున్నప్పుడు శరీర, మనో బుద్ధులే నీవు అని భావిస్తున్నావు. కల నీవు పని చేయుటకు ఆధారమైన ప్రేరణలు, వాసనలతో నడుపబడుతుంది. నిద్రలో ఇంద్రియ, మనో, బుద్ధులు ఉండి లేకుండా ఉన్నవి, వ్యాపార రహితముగా ఉన్నవి.
మెలకువలో ఇంద్రియములు పనిచేస్తే ఆ పనియే నీవుగా ఉన్నావు
కలలో ఆ పనులకు ప్రేరణ అయిన వాసనలే నీవుగా ఉన్నావు
నిద్రలో వ్యాపార రహితముగా నీవు ఉన్నావు
ఈ మూడు స్థితులలో నీవు వాటితో కలిసిపోతే జీవుడవు, కలవక పోతే సాక్షివి.
మెలకువలో పనులకు , ఫలితములకు, విషయములకు , ఇంద్రియములకు సాక్షివి
కలలో ఇంద్రియ ప్రేరణలకు, మనో బుద్ధులకు సాక్షివి
నిద్రలో చిత్తము, అహంకారములకు మధ్యలో ఉన్నావు.
ఆ చిత్తము, అహంకారములకు సాక్షివి అయిన నీవు చిద్రూపమై తురీయము యందు ప్రవేశిస్తావు
చిత్తము యొక్క ప్రభావము లేకపోవుటయే చిద్రూపమగుట
మరియొక విధముగా చెప్పవలెనన్న మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశప్రభావము లేనివాడిగా ఉండుటయే చిద్రూపమగుట
శాస్త్రమును తత్వద్రుష్టి కొరకు చదువుట కాదు, తత్వదృష్టితో శాస్త్రమును చదవాలి.
జగత్తు ఉన్నది, జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అనునది భ్రాంతి. ఉన్నది ఒక్కటే. అదే జగత్తుగా, జీవునిగా, ఈశ్వరునిగా గోచరిస్తున్నది. వీటిలో మొదటి భ్రాంతి తాను ఈశ్వరుని కన్నా వేరు అనే తలంపు కలుగుట. ఆ భ్రాంతి దృష్టితో జగత్తును చూచుట వలన జగత్తు వేరుగా గోచరిస్తున్నది. నేను, ఈశ్వరుడు వేరు అన్న భ్రాంతిని తొలగించిన జగత్తు, జీవుడు తొలగి ఈశ్వరుడు ఒక్కడే మిగులుతాడు. మనము ప్రతి వ్యవహారమును చేసేటప్పుడు జగత్తు దృష్ట్యా చేస్తున్నామా? జీవ దృష్ట్యా చేస్తున్నామా లేక ఈశ్వర దృష్ట్యా చేస్తున్నామా అనేది పరిశీలించుకోవాలి.
జగత్తు, జీవ భ్రాంతితో పూజలు, వ్రతములు, నోములు చేస్తున్నావు. నిజమునకు అవి నీవు ఈశ్వరుడవే అనే సత్యమును గ్రహించుటకు అవి నిర్దేసించబడినవి. నేను ఈశ్వరుడనే అన్న భావన కలుగునంత వరకు నిన్ను కర్తృత్వభావన విడచిపెట్టదు. కర్తృత్వభావన ఉన్నంత వరకు జననమరణ చక్రములో పరిభ్రమించక తప్పదు.
దేవాలయమున ఒక విగ్రహము ఉన్నది. అది దేనినైనా స్వీకరిస్తున్నదా? నిరాకరిస్తున్నదా? లేదు. నీవు అలాగే సాక్షిగా జీవిత సంఘటనలకు కదలక, మెదలక సాక్షిగా ఉండమని బోధిస్తున్నది. నిశ్చల మనోబుద్దులను కలిగి ఉండమని బోధిస్తున్నది. నీకు జీవ, జగత్తు భ్రమ తొలగవలనన్న ఈశ్వర లక్షణములను తెలసికొని, ఈశ్వర లక్షణములతో జీవిస్తూ వివేకము కలిగి ఉన్నట్లైతే ఆ జీవిత అనుభవము ద్వారా నేను ఈశ్వరుడను అనే నిర్ణయము స్థిరపడుతుంది. జీవ, జగత్తు భ్రాంతులు రెండు ఒకేసారి తొలగిపోవాలి. జీవభావన ఉన్నంత వరకు జగత్తు భ్రాంతి తొలగదు.